షాబాద్/కొడంగల్, అక్టోబర్ 25 : కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు సజావుగా జరిగాయి. మొదటి రోజు లాంగ్వేజ్కు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 195 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు 61,495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 59,105 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. ప్రతి విద్యార్థి మాస్కులు వాడేలా, శానిటైజ్ చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్తోపాటు శానిటైజర్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించారు. 144 సెక్షన్ అమలు చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లా పరిధిలో 29 పరీక్షా సెంటర్లలో 9232 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 8493 మంది విద్యార్థులు హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్నాయక్ తెలిపారు. గతంలో విద్యార్థులకు పరీక్షా సెంటర్కు హాజరయ్యేందుకు అరగంట ముందు అనుమతి ఉండేదని.. ప్రస్తుతం హడావుడి లేకుండా గంట ముందు విద్యార్థులను పరీక్షా హాల్కు అనుమతిస్తున్నట్లు తెలిపారు.