షాబాద్, జూలై 22 : మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి వర్షం పడుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది.
ఆమనగల్లులో..
ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ముసురు పట్టింది. దీంతో ఆయా గ్రామాల్లోని కుంటలు, చెరువులోకి వరదనీరు చేరింది. ముసురులో కూడా రైతులు వరినాట్లు వేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో మొట్ట పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమనగల్లు మండలంలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తహసీల్దార్ చందర్రావు పేర్కొన్నారు.
బురదమయంగా రోడ్లు..
మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షానికి పట్టణంలోని పలు వీధులు బురదమయంగా మారాయి.
కళకళలాడుతున్న చెరువులు
మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా ఫరూఖ్నగర్ మండలంలో కురుస్తున్న వర్షానికి చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఫరూఖ్నగర్ మండలంలో మొత్తం 132 చెరువుల్లో చాల మేరకు జలకళను సంతరించుకున్నాయి. ఎలికట్టలో బాలసముద్రం చెరువు, కందివనంలోని నల్లకుంట, మదురాపూర్లోని మల్లయ్య చెరువులోకి భారీగా వర్షం నీరు వచ్చిచేరింది. మిషన్ కాకతీయ పనులతో చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.
వర్షాలకు కూలిన ఇండ్లు
ఏకధాటి వర్షాలకు మండలంలోని భైర్ఖాన్పల్లి, పోమాల్పల్లి గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. భైర్ఖాన్పల్లికి చెందిన కావలి మంగమ్మ ఇల్లు కూలిపోయి ఆర్థికంగా నష్టం వాటిల్లింది. పోమాల్పల్లికి చెందిన పెబ్బె పార్వతమ్మ, వడ్ల మాయచారి ఇండ్లు వానలకు కూలి పోయాయి. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.
బురదమయంగా మారిన రోడ్లు
మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల రోడ్లు బురదమయంగా మారాయి. 12వ వార్డులోని రిత్విక్ కాలనీకి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. వార్డుల్లో పారిశుధ్య కార్మికులు పరిసరాలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లో డంపింగ్ యార్డులకు తరలించారు.
అప్రమత్తంగా ఉండాలి
వానలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని దేవర చెరువు, గుర్లకుంట, ఉప్పారాశి కుంట, నాగిరెడ్డి కుంటలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు మహేశ్, నాయకులు రాములు, శ్రీశైలం, మల్లేశ్ పాల్గొన్నారు.
కురుస్తున్న వర్షం
మండలంలో రెండురోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. కుర్మిద్ద, నందివనపర్తి, తాటిపర్తి, నానక్నగర్ గ్రామాల చెరువుల్లోకి భారీగా వరద వస్తున్నది. మేడిపల్లి, యాచారం, కొత్తపల్లి, మంథన్గౌరెల్లి గ్రామాల్లో కుంటలు నిండాయి. తక్కళ్లపల్లి వేంకటేశ్వరస్వామి గుట్ట సమీపంలో ఉన్న చేతిపంపు నుంచి భూగర్భ జలం పైకి ఉబికివస్తున్నది.