ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత కానుక ఇద్దాం: టీజీవో, టీఎన్జీవో
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న 9 లక్షల పైచిలుకు ఉద్యోగులు, పెన్షనర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హరితకానుక అందించబోతున్నారు. దేశంలో ఏ సీఎం ఇవ్వని తీరుగా కష్టకాలంలో 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల అన్ని సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మొక్కలు నాటి కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 30 శాతం పీఆర్సీ అందుకున్న ప్రతి ఉద్యోగి, అధికారి, పెన్షనర్లు అంతా ఒక్కొక్కరు ఐదు నుంచి ఆరు మొక్కలు నాటాలని ప్రతినబూనారు. వాటిని బతికించుకునే కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా ఆయా మొక్కలకు కుటుంబసభ్యుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగులందరూ పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి మొక్కలు నాటాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) పిలుపునిచ్చింది. మరోవైపు, పల్లె, పట్టణ ప్రగతిలో ఉద్యోగులు, పెన్షనర్లు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు సీపీఎస్ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లు, టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అంతా కలిపి 9 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి 6 మొక్కలు నాటాలి. కుటుంబసభ్యులతో మొక్కలు నాటించాలి. వాటికి ఇంట్లోవారి పేర్లు పెట్టి ప్రతి మొక్కను సంరక్షించాలి. నేటినుంచి ఉద్యోగులంతా మొక్కలు నాటుతారు. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు మొక్కలు నాటి, సంరక్షించడమే మేం ఇచ్చే బహుమతి.
– మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
కుటుంబసభ్యులతో కలిసి నాటండి
అధికారులంతా పల్లె, పట్టణ ప్రగతిలో పాల్గొనాలి. ప్రతి అధికారి 6 మొక్కల చొప్పున వారి కుటుంబసభ్యులంతా 20కి తగ్గకుండా నాటాలి. మొక్కలు నాటడం ద్వారా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేయాలి.
– మమత, టీజీవో అధ్యక్షురాలు