సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ)/ బేగంపేట్/ మన్సూరాబాద్/ మెహిదీపట్నం : ట్రై కమిషనరేట్ల పరిధిలోని బేగంపేట, ఎల్బీనగర్, నాగోల్, ఆసిఫ్నగర్, తదితర ప్రాంతాల్లో సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డి అకస్మికంగా పర్యటించారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్, ప్యారడైజ్ ప్లాజా సెంటర్, ఎల్బీనగర్, నాగోల్, పీవీనర్సింహారావు ఎక్స్ప్రెస్ పిల్లర్ నెంబర్ 37 వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. చెక్ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని, సరైన పత్రాలు, పాసులు లేని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి అకస్మిక పర్యటనలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్భగవత్, డీసీపీలు కల్మేశ్వర్ సింగన్వార్, సన్ప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నరేశ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ ప్రారంభమయ్యే సమయంలో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ఉదయం 6నుంచి 10 గంటల వరకు సడలింపు ఇవ్వడంతో మొదటి రెండు గంటలు రోడ్లపై అంతంత మాత్రంగానే ఉండే ట్రాఫిక్ తరువాత రెండు గంటల్లో ఒక్కసారిగా పెరిగిపోతున్నది. అయితే చివరి రెండు గంటల్లో కార్యాలయాలకు వెళ్లేవారు రోడ్లపైకి రావడం ఒక కారణం అయినా, కాలనీలలో నుంచి నిత్యవసరాల కోసం వచ్చిపోయే వారు కూడా అదే సమయంలో బయటకు రావడంతో కాలనీల ముఖ్య కూడళ్లలో, మార్కెట్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడుతున్నది.
కరోనా చైన్ లింక్ను బ్రేక్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. నిత్యవసరాల కోసం నాలుగు గంటల పాటు సడలింపునిచ్చింది. కాని సడలింపు తిరగడానికే అన్న ఉద్దేశంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత సైతం రోడ్లపై అదే రద్దీ కనిపిస్తున్నది. ఇలాంటి వారితోనే కరోనా వ్యాప్తి చెంది.. ఇంటిల్లిపాదిని ప్రమాదం బారిన పడేస్తున్నారు.