చారిత్రక నగరం.. ముత్యాల నగరం.. ఐటీ నగరం.. పర్యాటక నగరంగా విరాజిల్లుతున్న మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో నిధుల లేమి రాకుండా కేటాయింపులు జరుపుతున్నది ప్రభుత్వం. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో గ్రేటర్ అభివృద్ధికి అగ్రతాంబూలం వేసింది. ప్రధానంగా పాత రుణాలకు చెల్లింపు చేస్తూనే కొత్త పనులకు పచ్చజెండా ఊపింది. గ్రేటర్ దాహార్తిని శాశ్వతంగా తీర్చడంతోపాటు ఉచిత నీరు, మురుగునీటి వ్యవస్థ కోసం ఎన్నడూ లేనివిధంగా జలమండలికి రూ.2381 కోట్లు కేటాయించింది. సులువైన ప్రయాణానికి కేరాఫ్ మెట్రోరైల్ రెండో దశ విస్తరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఔటర్ నిర్మాణానికి జైకా నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు హెచ్ఎండీఏకు రూ.472 కోట్లు ఇచ్చారు. గ్రేటర్పై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతోపాటు శివారు జిల్లాలకు మణిహారం లాంటి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణకు రూ.750 కోట్లు కేటాయించారు. మొదటిదశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు భూసేకరణ చేయనున్నారు. ప్రజారవాణాలో కీలకమైన ఆర్టీసీకి ప్రభుత్వం అండగా నిలిచింది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు ప్రకటించడంతో కార్మికులు సంబురాల్లో మునిగిపోయారు.
హైదరాబాద్.. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నగరం.. హెరిటేజ్గా, కల్చరల్గా, ఐటీ హబ్గా, ముఖ్యంగా పెట్టుబడులకు అనుకూల వాతావరణంగా.. ఇలా భాగ్యనగరానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు.. అందుకే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఏటా బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుపడమే ధ్యేయంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సమకూర్చుతున్నది. ఇందులో భాగంగానే హైదరాబాద్, పరిసర ప్రాంతాల అభివృద్ధికిగాను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్లో అన్ని శాఖలకు కలిపి రూ.6371.11కోట్లు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపు ద్వారా నగరాభివృద్ధి మరింత వేగవంతం కానున్నదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగర విస్తరణ దాని భవిష్యత్తుపైన స్పష్టమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి కృషి చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్డీపీ లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రజా రవాణాను మెరుగు పర్చారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చారు. నగరంలో తొమ్మిది ఫ్లై ఓవర్లు, నాలుగు అండర్ పాస్లు, మూడు ఆర్వోబీల నిర్మాణం పూర్తి చేసుకోగా, కరోనా సమయంలో రూ.2వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు , 300 కిలోమీటర్ల రోడ్లు, 29 లింకు రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో వివరించారు.
మెట్రో ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి మొదటి దశను పూర్తిచేయగా, రెండో విడుతతో పాటు పాతనగరంలో మెట్రోను పరుగులు పెట్టించేందుకు రూ. 1000కోట్లు కేటాయించింది. ముఖ్యంగా నగరాభివృద్ధికి వివిధ పనులకుగాను పట్టణ మూల ధన వ్యయం కింద రూ.1962.22కోట్లు ప్రత్యేక నిధిని సమకూర్చారు. వీటితో పాటు భాగ్యనగర ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1475 కోట్లతో చేపట్టే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టుకుగానూ రూ.725కోట్లు కేటాయించింది. జలమండలి పరిధిలో తాగు, మురుగునీటి వ్యవస్థల బలోపేతం కోసం రూ.2381.52కోట్లు కేటాయించారు. జలమండలి చరిత్రలోనే ఈ నిధుల కేటాయింపు రికార్డు అని చెప్పవచ్చు. ఇక మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా రూ.200కోట్లు, ఇతర శాఖలలో ప్రాధాన్యత పనులకు నిధులను మంజూరు చేశారు. హైదరాబాద్ విశ్వనగర రూపును సంతరించుకోవడమే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అగ్రతాంబులం వేయడం గమనార్హం.