ఆదర్శంగా సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాల
సిరిసిల్ల, జూలై 19: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కా రు బడుల్లో ఆన్లైన్ తరగతులు, పరీక్షలు నిర్వహిస్తూ సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. పాఠశాలలో దాదాపు 714మంది విద్యార్థులు ఉన్నారు. ముందుగా పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం సర్వే చేయించి 90 శాతం విద్యార్థులకు సెల్ఫోన్లు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. జీవ్ సంస్థ పాఠశాలకు అందించిన 50 ట్యాబ్ లు, సీఎస్ఆర్ ద్వారా చైతన్య సారథి ట్రస్ట్ ద్వారా పది కం ప్యూటర్లను గతంలో మంత్రి కేటీఆర్ అందించారు. జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సహకారంతో అందుబాటులో ఉన్న కంప్యూటర్లు, ట్యాబ్లను వినియోగిస్తూ జూమ్ యాప్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్లో బోధిస్తున్నా రు. ప్రస్తుతం ఎనిమిది, తొమ్మిది, పది తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సోమవారం ప్రయోగాత్మకంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం సమష్టిగాఆన్లైన్ బోధన చేయడం తో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.