గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో కేంద్రం ఏర్పాటు
అత్యాధునిక యంత్రాలతో ల్యాబ్
గంటలోనే 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం
త్వరలోనే ప్రారంభించే అవకాశం
ఫర్టిలైజర్సిటీ, జూలై 16 : మహమ్మారి కొవిడ్ నిర్ధారణలో రివర్స్ ట్రాన్స్ కిప్టివ్ పాలిమరై చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) టెస్టు ఎంతో కీలకమైనది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కంటే ఇది కచ్చితమైనది. అయితే ఈ పరీక్షలో భాగంగా ఇన్నాళ్లూ స్వాబ్ తీసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సెంటర్లకు పంపించేవారు. రిజల్ట్ వచ్చే సరికి మూడు రోజులు పట్టేది. దీని వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలకు ఇబ్బంది అయ్యేది. అందుకే సర్కారు వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లాలోనే మొదటిసారిగా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఆర్టీపీసీఆర్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కోటి వ్యయంతో ఏర్పాటు చేశారు. ఒక గంటలోనే 300 పరీక్షలకు సబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతైన ఆర్ఎన్ఏ, సెంట్రల్ ఫ్యూజ్ మిషన్, మైనస్ 80 డిగ్రీల ఫ్రిజ్, లామినార్ హార్ట్ గ్లో తదితరాలను ఏర్పాటు చేశారు. మొదట నిమ్స్ నుంచి డమ్మీ శాంపిళ్లను తీసుకవచ్చి టెస్టులు చేస్తారు. ఫలితాలు కచ్చితత్వంతో వస్తే ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతి వస్తుంది. మరోవారం రోజుల్లో ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశమున్నది. ఈ మేరకు సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రయోగ స్థాయిలో ఫలితాలు
జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ కేంద్రంలో నిమ్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రయోగాలు చేస్తాం. ఫలితాల అనంతరం ఐసీఎంఆర్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటాం. అనుమతి రాగానే ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తాం. కొవిడ్ రోగులకు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఒక వరం. ప్రయోగాల అనంతరం అరగంట నుంచి గంట లోపల ఇక్కడ పరీక్ష ఫలితాలు వస్తాయి. కొవిడ్ రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.