పాల్గొన్న ఎమ్మెల్యేలు, నిర్వాసితులు
గోదావరిఖని, జూలై 15: సింగరేణి సంస్థ ఆర్జీ-1 పరిధిలోని ఓసీపీ-5 ప్రాజెక్టు ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సక్సెస్ అయింది. నిర్వాసిత ప్రజలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు మధ్య జరిగిన చర్చల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అందరూ సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో తదితర డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి సింగరేణి అధికారులు కృషిచేస్తామని చెప్పారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని వీటీసీలో సింగరేణి ఆర్జీ-1 జీఎం కే నారాయణ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రామగుండం కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవిదాస్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాజకీయ పక్షాల నాయకులంతా పాల్గొన్నారు. సింగరేణి ఓసీపీ ప్రాజెక్టుతో ఏర్పడే సమస్యలను వివరిస్తూనే, తీసుకోవాల్సిన చర్యలను సూచించగా, పరిష్కారానికి కృషిచేస్తామని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. సింగరేణికి సంబంధించి ఓపెన్కాస్టు ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జీఎం కల్వల నారాయణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు బీ వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా కొత్త ప్రాజెక్టులకు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. జీడీకే-5 గని ప్రారంభం వల్ల ఈ ప్రాంత అభివృద్ధితోపాటు సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ తదితరులున్నారు.
ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు: కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రజల నిర్ణయమే తమ నిర్ణయమని ఎమ్మెల్యే చందర్ పేర్కొన్నారు. గురువారం ఓసీపీ-5 ఏర్పాటుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బొగ్గు నిల్వ ఉన్న ప్రాంతాల్లోని భూగర్భ గనులను ఓసీపీలుగా ఏర్పాటు చేస్తున్నారని, అదే స్థాయిలో ఓసీపీలతో సమానంగా భూగర్భ గనులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏడేళ్ల తెలంగాణ పాలన గొప్పగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతుందని చెప్పారు. సింగరేణిలో గత పాలకులు, యూనియన్లు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఉద్ఘాటించారు. గతంలో సంక్షోభంలో కూరుకుపోయిన సింగరేణిని నేడు లాభాల్లోకి వచ్చి కార్మికులకు వాటాను అందించే స్థాయికి ఎదిగిందంటే సీఎం కేసీఆర్ తీసుకున్న శ్రద్ధే కారణమని వివరించారు. సింగరేణి ప్రభావిత గ్రామాలను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి డబుల్ ప్యూరిఫైడ్ తాగునీరు అందిస్తామని చెప్పారు.