జ్యోతినగర్ (రామగుండం): ఎడతెరిపి లేకుండా సోమవారం అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ఉదయం 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
ఇన్ప్లో ద్వారా ప్రాజెక్టుకు 4,32,163 క్యూసెక్కుల నీరు చేరగా 40 గేట్ల నుంచి 2 మీటర్ల ఎత్తులో 3,90,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 148 అడుగులకు గాను ప్రస్తుతం 146.65 అడుగుల నిల్వ నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అంతర్గాం తహసీల్దార్ సంపత్ ప్రాజెక్టును సందర్శించారు. సమీప గోదావరి తీరం ముంపు గ్రామాల ప్రజలు పరిసర ప్రాంతాలకు రావొద్దన్నారు.