మంత్రి కొప్పుల ఈశ్వర్
శ్రీమడేలయ్య గుడి నిర్మాణానికి భూమి పూజ
ధర్మారం, జూలై 25: రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ధర్మారం తహసీల్ కార్యాలయం ఎదుట ఉన్న ఒర్రె వద్ద శ్రీ మడేలయ్య గుడి నిర్మాణానికి ఆయన ఆదివారం భూమి పూజ చేశారు. రజక సహకార సంఘం అధ్యక్షుడు అర్థవల్లి రాం చంద్రం ఆధ్వర్యంలో అంతకు ముందు మంత్రికి రజక మహిళలు మంగళహారతులతో ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా రజకులు వారి సమస్యలపై మాట్లాడారు. దశాబ్దాల కాలం నుంచి ఒర్రె వద్ద బట్టలు ఉతుకుతూ జీవిస్తున్నామని వివరించారు. అందులోకి డ్రైనేజీ నీరు వస్తుండడంతో బట్టలు ఉతికేందుకు ఆటంకం కలుగుతున్నదని చెప్పారు. ధోబీఘాట్లు, సంఘ భవనం తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒర్రె వద్ద ఉన్న ప్రభు త్వ స్థలాన్ని సర్వే చేయిస్తానని, రజక సహకార సంఘానికి రెవెన్యూ శాఖ ద్వారా అప్పగించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ధర్మారం వాసులు బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు వంతెనకు ఇరువైపులా ఘాట్లు (మెట్ల) నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు.
మురికి నీరు ఒర్రెలో కలువకుండా ప్రత్యేక డ్రైనేజీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రజకుల సంఘ భవన నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. ధోబీఘాట్లు నిర్మింపజేస్తానని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని ప్రకటించారు. శ్రీ మడేలయ్య గుడి నిర్మాణానికి విరాళం అందిస్తానని, ఒర్రె వంతెన వద్ద నుంచి గుడి దాకా రోడ్డు వేయిస్తానని హామీఇచ్చారు. దీంతో మంత్రికి రజకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, వార్డు సభ్యులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు మిట్ట తిరుపతి, ఎండీ షరీఫ్, రజక సంఘం బాధ్యులు, కుల పెద్దలు కాల్వ మల్లేశ్, గుడికందుల ఎల్లయ్య, కాల్వ రాజలింగయ్య, కాల్వ నర్సింగం, కాల్వ తిరుపతి, రామడుగు శ్రీనివాస్, కొత్తకొండ గౌరయ్య, మల్యాల వెంకటేశ్, కాల్వ పోశయ్య, కోడి పుంజుల రవి, నేరెళ్ల లింగయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బాస తిరుపతి రావు, జైన రాజమౌళి, దేవి రాజలింగయ్య, దేవి నళినీకాంత్, వొడ్నాల శంకరయ్య, అమరపల్లి నారాయణ, దేవి లావణ్య, కాంపెల్లి చంద్రశేఖర్, కూరపాటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.