Disinvestment | న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహించిన రోడ్షోల్లో మదుపరుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ లైన్ చేసినట్టు సంబంధిత ఓ అధికారి చెప్తున్నారు. ఇందులో భాగంగానే జీఐసీలో దాని షేర్ల విలువ ఆధారంగా 10 శాతం వాటా విక్రయానికి యోచిస్తున్నట్టు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ శుక్రవారం తెలిపింది. స్టాక్ మార్కెట్లో ప్రస్తుత జీఐసీ షేర్ విలువ ప్రకారం ఈ వాటా అమ్మకంతో ఖజానాకు దాదాపు రూ.5,700 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. గడిచిన 6 నెలల్లో జీఐసీ షేర్ల విలువ సుమారు 45 శాతం పెరగడం గమనార్హం.
ముందుగా నిర్ణయించినట్టుగానే ఎల్ఐసీలో 2029కల్లా 10 శాతం, 2032 నాటికి 25 శాతం వాటాను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. అయితే చిన్నచిన్న విడుతలుగానే ఈ షేర్ల విక్రయానికి ప్లాన్ చేస్తున్నామంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఈ సంస్థ షేర్ల ప్రదర్శన, మదుపరుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా పెట్టుబడుల ఉపసంహరణకు వీలుందని అంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఎల్ఐసీ షేర్ విలువ 58 శాతం పుంజుకున్నది. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేర్ రూ.972.60 వద్ద ముగిసింది. 2022 మే నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్లు నమోదైనది విదితమే. ఐపీవో ద్వారా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను కేంద్రం అమ్మేసింది. మరో 1.5 శాతం వాటాను అమ్మాలని మోదీ సర్కారు చూస్తున్నది. ఇదే జరిగితే ప్రస్తుత షేర్ ధర ప్రకారం సుమారు రూ.9,200 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత వీటిపై ఓ స్పష్టత రానుందని పేర్కొంటున్నారు.