తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్కు కంచుకోటగా మారిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్న ఉబలాటంతో అడ్డదారులు తొక్కుతున్నది. అందుకోసం ధన ప్రవాహాన్ని పారించడమే కాకుండా.. బీఆర్ఎస్ నాయకుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నది. ఎరవేస్తూ పార్టీలో కలుపుకొంటుండగా.. నికార్సయిన నాయకులు ఎదురొడ్డి నిలుస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఈ క్రమంలో తమ దారికి రానివారిని, లొంగదీసుకునేందుకు ఎంతకైనా ఒడిగడుతున్నది.
అంతేకాదు, హస్తం పార్టీ పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గులాబీ సోషల్ మీడియా వారియర్స్పై దాడులకు తెగబడుతున్నది. పోలీసులను అడ్డుగా పెట్టుకొని లేనిపోని కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నది. అందుకు ధర్మారం మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి సల్వాజి మాధవరావు ఉదంతమే నిదర్శనంగా నిలుస్తున్నది. ఇది జరిగి రెండు మూడు రోజులైనా కాకముందే సుల్తానాబాద్లో కౌన్సిలర్ లక్ష్మీమల్లయ్య ఇంట్లో పోలీసులు సోదాల పేరిట అలజడి సృష్టించడం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతున్నది. ఇలా ప్రలోభాలకు గురి చేయడం, లొంగకుంటే బెదిరింపులకు దిగుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) పరిధిలో పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథనితోపాటు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడింటికి ఐదు సెగ్మెంట్ల పరిధిలో సింగరేణి విస్తరించి ఉండగా, నాడు ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతంపై చిన్నచూపు కొనసాగింది. కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు.
రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమల్లోకి తెచ్చారు. ప్రతి కార్మికుడికీ ప్రయోజనం కలిగేలా కార్యక్రమాలు చేపట్టారు. ఇటు రూ.కోట్లాది నిధులతో ఈ ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇదంతా కండ్లముందే కనిపించడంతో ప్రజలు కేసీఆర్కే జైకొట్టారు. లోక్సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి చూస్తే.. తెలంగాణ రాక ముందు వరకు మెజార్టీ సమయాల్లో కాంగ్రెస్కు విజయాన్ని అందించినా.. రాష్ట్ర ఏర్పాటు నుంచి మాత్రం బీఆర్ఎస్కు పట్టం కడుతూ వచ్చారు.
2014 లోక్సభ ఎన్నికల్లో బాల్క సుమన్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్పై 2.91 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో 56.82 శాతం ఓట్లు బీఆర్ఎస్కు రాగా, కాంగ్రెస్కు కేవలం 27.57 శాతం వచ్చాయి. 2019 ఎన్నికల్లో వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ అభ్యర్థి ఆగమ్ చంద్రశేఖర్పై 95 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 45.49 శాతం ఓట్లు గులాబీ పార్టీకి రాగా, 35.68 శాతం హస్తం పార్టీకి వచ్చాయి.
ఈ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో ప్రజల సమస్యలే ఎజెండాగా పోరాడే వ్యక్తిత్వమున్న సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణను, బీజేపీ గోమాస శ్రీనివాస్ను బరిలోకి దింపాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ప్రచారం చేస్తున్నది. సింగరేణితో ఉన్న సంబంధాలతోపాటు ప్రజలతో మమేకం అవుతున్న తీరుతో కొప్పులకు మంచి స్పందన వస్తున్నది. ఎక్కడ చూసినా హవా కనిపిస్తున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సింగరేణి సమస్యలపై అవగాహనతోపాటు ఈప్రాంతంపై పూర్తి పట్టు ఉండడంతో కొప్పులకు అండగా నిలిచేందుకు జనం కదులుతున్నది. తొలి తెలంగాణ సీఎంగా కేసీఆర్ అమలు చేసిన ఎన్నో పథకాల నేపథ్యంలో కొప్పుల వైపు కార్మికలోకం చూస్తున్నది.
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు. ఇప్పటివరకు చట్టసభలకు వెళ్లలేదు. సింగరేణి సమస్యలపై పెద్దగా అవగాహన లేదు. ఎమ్మెల్యే వివేక్ కొడుకుగానే తప్ప పెద్దగా ప్రజల్లో పేరు లేదు. ఇదే సమయంలో కొప్పులతో హస్తం పార్టీ అభ్యర్థిని పోల్చి చూస్తున్నారు. ఏ అంశంలోనూ ఈశ్వర్కు తులతూగడం లేదన్న అభిప్రాయాలు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశ్వర్తో కంపేర్ చేసి ప్రచారం చేయలేని పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడుతున్నది. మరోవైపు ఒకే కుటుంబానికే అవకాశం ఇస్తారా..? అన్న భావన ఆ పార్టీ నాయకుల్లోనూ కనిపిస్తున్నది. వీటన్నింటినీ లోతుగా పరిశీలించిన ప్రధాన నేతల్లో ఓడిపోతామనే భయం మొదలైంది.
బీఆర్ఎస్ తరఫున నిలబడి పోరాడుతున్న వారిని టార్గెట్ చేసి.. ఏదో రకంగా దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. తమ ప్రలోభాలకు లొంగకపోతే టార్గెట్ చేసి మరీ వెంటాడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలపై కుట్రలు చేస్తున్నారు. ఎదురుతిరిగి అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించిన వారిని లేనిపోని కేసులతో భయపెడుతున్నారు. ఇటీవల ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి సల్వా జీ మాధవరావుపై కేసులు పెట్టి జైలు పాలు చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంలో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడు తూ సోషల్మీడియాలో పోస్టు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు.
ముందుగా ఆ యు వకుడిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోగా.. ఆ తర్వా త అతనిపైనే అట్రాసిటీ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది జరిగి రెండు మూడు రోజులు కాకముందే సుల్తానాబాద్లోని కౌన్సిలర్ లక్ష్మి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం కక్షసాధింపు చర్యలకు అద్దం పట్టింది.
ఎలాంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా.. మహిళా పోలీసులు లేకుండా దాదాపు రెండు మూడు గంటలపాటు సోదాలతో భయానక వాతావరణం సృష్టించారు. తమ ఇంట్లో ఎందుకు తనిఖీలు చేస్తున్నారని కౌన్సిలర్ కొడుకు ప్రశ్నిస్తే బైండోవర్ చేస్తామంటూ బెదిరించారు. లో బీపీతో బాధపడుతున్న కౌన్సిలర్ లక్ష్మి ఒక్కసారిగా కుప్ప కూలినా పట్టించుకోలేదు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. రాత్రి వరకు కో లుకున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడుతున్నారు. మరికొన్ని మండలాల్లోనూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నికార్సయిన బీఆర్ఎస్ నాయకులు మాత్రం హస్తం పార్టీ బేరసారాలకు లొంగ డం లేదు. కొంతమంది మాత్రం కేసీఆర్ పదేళ్ల పాలనలో వివిధ పదవులు అనుభవించి, ప్రస్తుతం ప్రలోభాలకు ఆశపడిపోవడం చూసి ప్రజలే అసహ్యించుకునే పరిస్థితులు ఉన్నాయి. ‘అందితే జుట్టు.. లేదంటే కాళ్లు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ మారుతున్న నాయకులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్టగతులుండవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోసాలు, కుట్రలకు పెట్టింది పేరుగా నిలిచిన కాంగ్రెస్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. మరింత దిగజారుతున్నది.
తన కుతంత్రాలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతుండగా.. బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటున్నది. దాడులు, అక్రమ కేసులపై తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నది. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అభయమి స్తున్నది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలులో ఉన్న సల్వాజీ మాధవరావును పరామర్శించి, ధైర్యం చెప్పారు. సాయంత్రం సుల్తానాబాద్లోని 9వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీమల్లయ్య కుటుంబ సభ్యులను కూడా పరామర్శించా రు. ఎలాంటి వేధింపులకు గురిచేసినా అధై ర్య పడద్దని, పార్టీ పరంగా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు.