పెద్దేముల్, జూన్ 1 : ఫర్టిలైజరు దుకాణాల యజమానులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ, కేజీఎన్ ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయాధికారి షేక్ నజీరుద్దీన్తో కలిసి సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో బిల్ బుక్లను, స్టాక్ రిజిస్టర్లు, ఎరువులు నిల్వ ఉంచిన గోదాంలను, విత్తనాల పాకెట్లపై ఉన్న తేదీలను, ఎరువు బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సీఐ జలేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు తాండూరు రూరల్ పరిధిలో లైసెన్స్ కలిగిన అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మికంగా విడుతల వారీగా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా ఎవరైనా లూజు విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా కొంతమంది రైతులు ఏజెంట్లుగా ఏర్పడి లూజు విత్తనాలను అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవో నజీరుద్దీన్ మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాప్ యజమానులు రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను అమ్మాలని, నకిలీ విత్తనాలను అమ్మరాదని, అదే విధంగా విత్తనాల వివరాలతో కూడిన బిల్లులను కూడా తప్పకుండా రైతులకు ఇవ్వాలని తెలిపారు. తనిఖీల్లో ప్రొబెషనరీ ఎస్సై ఆనంద్కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం, జూన్ 1 : నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రైతులు విత్తనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాల విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సైదులు, ఏవో వరప్రసాద్రెడ్డి, రెవెన్యూ అధికారులు, ఎస్సైలు పాల్గొన్నారు.
షాద్నగర్ పట్టణంలో..
షాద్నగర్, జూన్1: రైతులకు నష్టం వాటిల్లే విధంగా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయదారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు పొందిన సంస్థలు తయారు చేసిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. అధిక ధరలు, నకిలీ విత్తనాలు, మోసపూరిత ప్రకటనలు వంటి అంశాలపై ఫిర్యాదు వస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వం గట్టి నిఘా పెంచిందని, ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయని తెలిపారు. షాద్నగర్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు సృష్టించేలా ఏ వ్యాపారి ప్రవర్తించినా వారి దుకాణం అనుమతులను రద్దుచేస్తామని హెచ్చరించారు. సర్కారు సూచించిన విధంగా ఎరువులు, విత్తనాల అమ్మకాలను నిర్వహించాలని వ్యాపారులకు సూచించారు. ప్రతి వ్యాపారి తమ దుకాణం ముందు ధరల పట్టికను ఏర్పాటుచేసుకోవాలని, రైతులకు అర్థమయ్యే రీతిలో ధరల పట్టిక ఉండాలని సూచించారు. సమావేశంలో షాద్నగర్, చేవెళ్ల, ఆమన్గల్లు ప్రాంతాలకు చెందిన విత్తనాల డీలర్లు, దుకాణం నిర్వాహకులు, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు.
కేసులు నమోదు స్తాం..
కొడంగల్, జూన్ 1: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని పరిగి డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని కేఎస్వీ ఫంక్షన్ హాల్లో వ్యవసాయశాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. నకిలీ విత్తన నిర్మూలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, అమ్మకాలు జరిగినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరక్షరాస్యత వల్ల రైతులు పంట దిగుబడి అధికంగా వస్తుందని, కలుపు నివారణ అవుతుందనే మాటలు నమ్మి మోసాలకు గురవుతున్నట్లు తెలిపారు. కొడంగల్లో కర్ణాటక, బూత్పూర్ తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నట్లు సమాచారం ఉందని, గతంలో ఈ ప్రాంతంలో 26 కేసులు నమోదయ్యాయని అన్నారు.
ప్రస్తుతం వారిని గుర్తించామని, కొందరు ఈ ప్రాంతం నుంచి తరలివెళ్లారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నదనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, రానున్న రోజుల్లో తెలంగాణలో నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడాల్సిన పరిస్థితిని కల్పించేలా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటితో పంట నష్టంతో పాటు ప్రాణాంతక వ్యాధులు సంభవించే ఆస్కారం ఉంటుందన్నారు. రైతులు విత్తనాలు కొనేముందు ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలన్నారు. కొనుగోలుపై తప్పకుండా రసీదు పొంది, పంట చివరి వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, ప్రజల సహకారం ఉంటే 100 శాతం నకిలీ విత్తనాలు నిర్మూలించుకోవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా ఏడీఏ వినయ్కుమార్ మాట్లాడుతూ ఎరువులు, విత్తన డీలర్లు రైతులకు పూర్తి సహకారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. డీలర్లు విత్తనాలు, ఎరువుల అమ్మకాలకు తప్పకుండా రసీదు అందించాలన్నారు. రసీదు ఉంటేనే పంట నమోదు చేస్తారని, కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం ఉంటుందని సూచించారు. రైతు వేదికలో ఏఈవోలు విత్తన నాణ్యతలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణంలో విత్తనాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ అప్పయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, కొడంగల్, దౌల్తాబాద్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్, భగవంతు, ఏవో బాలాజీ ప్రసాద్లతో పాటు కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.