ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ను నిర్వహిస్తారా.. లేదా? అనే అంశంపై విద్యాశాఖ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయు లు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అన్న మీమాంసలో పడ్డా రు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఉపాధ్యాయ సంఘాలు విన్నవించా యి. దీంతో ఎన్సీటీఈకి ఈ మేర కు ప్రతిపాదనలు పంపిస్తామని, ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముంచుకొస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్జీటీలుగా దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్నవారు టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెట్టడం ఆందోళనకరం. ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరినప్పుడు లేని నిబంధనలు కొత్తగా అమలుచేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఎంతో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను టెట్ పేరిట పరీక్షించడం విస్మయం కలిగిస్తున్నది.
భాషోపాధ్యాయుల ఉన్నతీకరణ కోసం పేపర్- 2 ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెట్టడం విచిత్రంగా ఉన్నది. భాషోపాధ్యాయులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్ డ్యూటీలు చేస్తున్నారు. స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇతరులతో సమానంగా పదోన్నతులు మాత్రం లభించడం లేదు. భాషోపాధ్యాయులు బోధించిన విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్లుగా ఉండటం గమనార్హం. చాలామంది భాషోపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరి భాషోపాధ్యాయులుగానే పదవీ విరమణ చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధానం విద్యాశాఖలో ఉండటం శోచనీయం.
మరో విషయం ఏమంటే.. భాషోపాధ్యాయులకు ఏ మాత్రం సంబంధం లేని సాంఘిక శాస్త్రంలో టెట్ నిర్వహించడం వారి పాలిట శాపంగా మారుతున్నది. జీవశాస్త్రం ఉపాధ్యాయులు భౌతికశాస్త్రం లేదా గణితంలో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సబబు కాదు. ఏపీలో భాషోపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా పేపర్- 3 నిర్వహిస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ఆ విధానం లేదు. ఏపీలో మాదిరిగా భాషోపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా పేపర్- 3 నిర్వహించాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు అందించినా అధికారులు పట్టించుకోవడం లేదు. పదో తరగతి పరీక్షల పేపర్ వాల్యుయేషన్, ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్కు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు. గడువు ముగియకముందే ప్రత్యేక టెట్ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
డాక్టర్ ఎస్.విజయ భాస్కర్
92908 26988