కట్టె పట్టుకొని పోయి కంటి వెలుగు కాడ అద్దాలు దెచ్చుకున్న మా బాపమ్మ తొంబై ఏండ్లు ఉంటది. మొన్న ఊరికి పోయినప్పుడు నా పెద్ద కొడుకు ‘బాపమ్మా కథ చెప్పు’మని ఏడిస్తే ఎన్కటి కాలాన్ని యాదిజేసుకున్నది. “మత్తడి పడే చెరువులు.. ఆమ్దాని నీళ్లు, పుట్ల కొద్ది పంట, ఇంట్ల పాడి, దొడ్డి నిండ గోదలు. గట్క తిన్నా మనుషులు గట్టిగ ఉండేది. ఇప్పుడంత మందుల కూడు, పారం కోళ్ల పానాలు. ఇంటాయన సుక్క పొద్దుకు మోట కడితే.. పాలిచ్చే యాళ్లదాక రెండు మళ్లు తడిసేది. ఎవుసానికి ఇప్పుడున్నట్టు అప్పట్ల కరెంట్ ఎక్కడిది? ఊరంతా ఒకటే మంచిళ్ల బాయి. ఇప్పటి కోడండ్లకు కేసీఆర్ నీళ్లు ఇంట్లకే రావట్టె. బిడ్డ పెండ్లి జేయాలంటే.. శెరువు కింద ఇంత అమ్మితేనే అయ్యేది. ఇప్పుడు కల్యాణలచ్చిమి పైసలొస్తున్నట్లు అప్పుడు యాడియి?
మనూరి శెరువు మత్తడి పోసుడు ముప్ఫై ఏండ్ల కింద జూసిన. నిరుటి సంది మల్లా మత్తడి పడుతున్నది. వాన పడ్డప్పుడు చెర్ల నుంచి చెరువు కాలవలకు చాపలు ఎదురెక్కేది. కొర్రమట్టలు తెచ్చి పుల్సు పెడితే.. ఇంటిన్రాజులకు నాలుగు రోజులు పొద్దుపోయేది. ఇప్పుడు శెర్లల్ల కేసీఆర్ శాపలు మల్లా అప్పటి లెక్కనే కనవడుతన్నయి. తెల్లందాకా.. ఇసిరిసిరి వాన కొడ్తే గుణపెంక ఇల్లంతా ఉర్సుడే. రోడ్లన్నీ కయ్య కోసేది. వాడవాడకు ఇప్పుడున్నట్టు సిమెంట్ రోడ్లు అప్పడెక్కడియి? ఒగలొగలకు కేసీఆర్ ఇండ్లు కూడ రావట్టె. శెరువులు, కుంటలు నిండినయి.. నీళ్లు ఆమ్దానొత్తన్నయి.. ఎన్కట పండినట్టే.. పుడ్లకొద్ది వడ్లు పండుతున్నయిప్పుడు. కని ఇప్పటిలెక్క గవర్నమెంట్ కొనుడు లేదు ఆ యాళ్ల. కోమటైన కాడ తెచ్చుకున్న అప్పు కిందకే వడ్లుపోయేది. తిందామంటే తిండి దొరకలే నాడు.. ఇప్పుడు ఎవలి బుక్కెడు వాళ్లు తింటున్నరు. ఎవుసం జేసే ఆసామి మొఖం జర తెలివికొచ్చింది. మంచిగ కేసీఆర్ పెద్దకొడుకోలె.. నెల నెల పింఛను ఇయ్యవట్టె, ముసలొల్లకు కండ్లు బాగజేసి అద్దాలు ఇస్తండు” అని చెప్పుకొచ్చింది.
మా బాపమ్మ చెప్పిన ముచ్చట వినుకుంటా నా పెద్ద కొడుకు ఎప్పుడో నిద్రపోయిండు కానీ.. అదంతా విన్న తర్వాత నాకు కేసీఆర్ పాలన తెచ్చిన సాంస్కృతిక మార్పు కనిపించింది. మా బాపమ్మ లాంటి ఎందరో వృద్ధులు, దివ్యాంగులు తెల్లారి లేస్తే సీఎం కేసీఆర్ను తలుస్తున్నారు. అలాంటివాళ్లు ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటారు. కేసీఆర్ పాలన స్థాయిలో వారిని ఎవరూ చేరుకోలేదు. తొంభై ఏండ్ల వృద్ధులకు అర్థమైన ‘స్వపరిపాలన’ ప్రతిపక్ష నాయకులకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థమైతలేదు!
-కాశెట్టి రాధిక