యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సర్వే ప్రారంభించాలని కేంద్రం అనుమతులు ఇవ్వడంతో ప్రజా సంఘాలు, ప్రజలు, స్వచ్ఛందంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.
బీజేపీ నాయకులు లక్ష్మణ్ నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజలు ఆర్థికంగా మెరుగు పడతారని, తవ్వకాలను అడ్డగించే ప్రజ లు అభివృద్ధి నిరోధకులని ఈ మధ్య విమర్శించారు. యురేనియం ప్రమాదం గురించి తెలియని నాయకుల వ్యాఖ్యలు ఇవి. యురేనియం తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే ‘డస్ట్’ 80 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. డస్ట్ పడిన ప్రాంతమంతా విషపూరితమవుతుంది. నల్లమలలోని చెంచుల ఉనికికి అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే చెంచులను ఆ ప్రాంతం నుంచి తరలించాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టును తొలగించాలి. సాగర్ నీళ్ళు వ్యవసాయానికి గానీ, తాగడానికి గానీ ఉపయోగపడవు. ఇంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలను కార్పొరేట్ల లాభాల కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్నది.
యురేనియంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి తేలికవుతుందని చెప్తూ తవ్వకాలకు కేంద్రం అనుమతులిచ్చింది. రష్యాలోని చెర్నోబిల్, జపాన్లోని పుకుషీమాలో యురేనియం విద్యుత్ కేంద్రాలు పేలిపోవడంతో వేలమంది మరణించడమే కాక, నేటికి ఆ రేడియో ధార్మిక శక్తి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు చెప్తున్నారు. ఆ భయంతో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో యురేనియం తవ్వకాలను ఆపాలని ఆందోళనలు సాగుతున్నాయి.1896లో హెన్రీ బెకరల్ రెడియో ధార్మిక శక్తి 92వ మూలకాన్ని కనుగొన్నాడు. చదరపు అడుగు యురేని యం 500 కేజీల బరువు ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అణుబాంబులు తయారు చేసిన ఆమెరి కా జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై వేసింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియో ధార్మిక శక్తి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. యురేనియంతో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయవచ్చు. 10 లక్షల కిలోల బొగ్గుతో ఉత్ప త్తి అయ్యే విద్యుత్ అరకిలో యురేనియంతో తయా రు చేయవచ్చు. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి వ్య యంతో కూడుకున్న పని అని యురేనియంతో ఉత్పత్తిని ప్రారంభించారు.
మొదట ఈ నిక్షేపాలు మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దట్టమైన అడవుల కింద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత దేశంలో 7 కేంద్రాల్లో 22 రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. 1950లో యురేనియం గనులను ఏ ర్పాటు చేశారు. 1967లో జాదూగూడలో గని ప్రా రంభించారు. యురేనియం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రక్రియలో యురేనియం శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన యురేనియంను పైపులద్వారా బోరు బావిలోకి పంపిస్తారు. వాస్తవానికి ఈ శుద్ధిఅయిన యురేనియంతో అణుబాంబులు తయారు చేయవచ్చు. ఇక్కడ అణుబాంబులు తయారు చేసే లక్ష్యం లేనందున శుద్ధి అయిన యురేనియాన్ని బావుల్లోకి పంపిస్తున్నారు. తటస్థీకరణ చర్యకు సున్నపు రాయిని కూడా దానితోపాటు పంపాలి. యురేనియం భూమికి చాలా లోతులో ఉంటుంది. 1960లో వెయ్యి అడుగులలోతు వరకు బోర్లు వేసి తీశారు. అయినా తగినంత ఉత్పత్తి రాకపోవడంతో 1990లో ఎన్ఎస్జీ దేశాల నుంచి (కజకస్తాన్, కెనడా, రష్యా) దిగుమతు లు చేసుకున్నారు. ఈ దిగుమతులకు అమెరికా, ఐక్యరాజ్య సమితి అడ్డుపడ్డాయి. ఎన్జీఓ సంఘాలు యురేనియం వల్ల ప్రమాదాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చాయి.
పిల్లలు పుట్టకపోవడం, ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం, క్యాన్సర్, చర్మ వ్యాధులు తదితర ప్రమాదాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బాబా అటామిక్ రీసెర్చ్ వారు కూడా పరిశీలించారు. ఆ లోపాలు యురేనియం వల్ల కాదని తప్పుడు సమాచారం ఇచ్చారు. రేడియేషన్ వస్తుంది కానీ దాన్ని బయటకు సోకకుండా జాగ్రత్త తీసుకుంటున్నామని తెలిపారు. 1998లో ప్రధాని వాజపేయి జా దూగూడ కాక వేరే ఎక్కడైన యురేనియం లభ్యత ఉందా అని పరిశీలించారు. ఈ స్థితిలో ప్లూటోనియాన్ని కనుగొన్నారు. ప్లూటోనియంతో తయారు చేసిన అణుబాంబును పోక్రాన్లో పరీక్షించారు. చివరకు 2002లో చంద్రబాబు అనుమతితో జరిపిన అన్వేషణలో కడప జిల్లా తుమ్మలపల్లి, గుంటూరు జిల్లా కోపూరులోని 2,300 ఎకరాల్లో నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు.
1.40 లక్షల టన్నులు తుమ్మల పల్లిలో, 2500 టన్నులు కోపూరులోనూ బయటకు తీశారు. 2004 లో వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. యుసీఐఎల్ దృష్టి ఇప్పు డు నల్లమలపై పడింది. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణానది కలుషితం అవుతుందని ప్రచారం సాగుతున్నది. ప్రస్తుతం దేశంలో మరో 7 అణు రి యాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి యురేనియం కావాలి. అందుకు దిగుమతులపై ఆధారపడాలి. లేదా స్వదేశంలో ఉత్పత్తి చేయాలి.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తయారవ్వడానికి ఐదారు సంవత్సరాలు పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు కూ డా ప్రస్తుతం లభించే ధరకన్న ఎక్కువగానే ఉంటుం ది. తక్కువ యురేనియంతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పటికీ యురేనియం తవ్వకానికి అయ్యే పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. రేడియో ధార్మిక శక్తి బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్త జరిగినా రేడియో యాక్టివిటి కిరణాలు అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే భారత దేశంలో 3 దశాబ్దాల క్రితం భోపాల్లో ‘మిక్’ గ్యాస్ లీక్ వల్ల 2 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికి అక్కడ వాతావరణం బాగు పడలేదు. కానీ కేంద్రం అవేవీ పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో రక్షణ లేకుండా యురేనియం తవ్వకాలు, వినియోగం చేయడం తీవ్ర ప్రమాదకరం.
-సారంపల్లి మల్లారెడ్డి
94900 98666