Lok Sabha Security Breach | మన దేశంలో అత్యంత భద్రత మధ్య ఉండే పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యం యావత్ భారతావనిని నివ్వెరపరిచింది. ఇద్దరు ఆగంతకులు సభా కార్యక్రమాలు జరుగుతుండగానే లోక్సభలోకి ప్రవేశించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఊహకందని ఈ ఘటనతో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంచలన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అయితే ఈ చర్చల మాటున అసలు విషయం మరుగున పడుతున్నది. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన, సహకరించిన వారందరూ దాదాపు ఒకే వయసున్న వారు కావడం గమనార్హం. వారంతా విద్యావంతులైన నిరుద్యోగులు కావడం అసలు చర్చకు రావాల్సిన అంశం.
అసలు విషయం ఏమంటే ఎవరికీ తెలియని, ఎక్కడా చర్చకు రాని మన దేశంలో ఉన్న విద్యావంతుల నిరుద్యోగం. పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యానికి పాల్పడినవారిని పరిశీలిస్తే.. సాగర్ శర్మ పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడు. 28 ఏండ్ల వయసున్న ఆయన లక్నోలో ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 34 ఏండ్ల మనోరంజన్ ఐటీ ఇంజినీర్ ఏండ్లుగా ఉద్యోగ అన్వేషణలోనే ఉన్నాడు. హర్యానాకు చెందిన 37 ఏండ్ల నీలం వర్మ ఎంఏ, ఎంఫిల్ చదివింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించింది. అయినప్పటికీ ఆమెకు ఉద్యోగం రాలేదు. మహారాష్ట్రకు చెందిన 25 ఏండ్ల అమోల్ షిండే పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.
వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు నేపథ్యాలు కలిగిన వీరంతా సోషల్ మీడియా వేదికగా ఒక్కటయ్యారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడి పార్లమెంట్లోకి ప్రవేశించాలనుకున్నారు. అనుకున్నట్టే రంగుల పొగను వదిలి భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఉపా చట్టాన్ని వారిపై మోపి తీవ్రవాదులుగా ముద్ర వేసే ముందు, వారు లేవనెత్తాలనుకున్న అసలు అంశం ఏమిటనేది మనం మర్చిపోతున్నాం.
దేశంలోని వివిధ రాష్ర్టాలు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారి నేపథ్యాలు వేరు కావచ్చు.. కానీ, అందరిలోనూ ఉన్న సారూపత్య ఏమంటే భారతదేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం. పైన పేర్కొన్నట్టుగా దేశంలో నెలకొన్న ప్రధాన సమస్య విద్యావంతుల నిరుద్యోగం. ఉన్నత చదువులు చదివిన కోట్ల మంది యువత ఉపాధి దొరక్క రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నిరుద్యోగం మనకు కార్మిక, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల నివేదికల్లో మాత్రమే కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా తమ డిమాండ్లను వినిపించేందుకు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనల రూపంలో నిరుద్యోగులు బయటకువస్తారు.
2021లో అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మన దేశంలో డిగ్రీ పూర్తి చేసినవారిలో నిరుద్యోగిత రేటు 15 శాతం ఉన్నది. అదే విధంగా డిగ్రీ పూర్తి చేసిన 25 ఏండ్లలోపు వారిలో చూస్తే 42 శాతం ఉండటం గమనార్హం. హై స్కూల్ డిగ్రీలు పొందిన వారిలో 21.4 శాతం ఉన్నది.
యువత చదువు, వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగాలను సృష్టించడంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నిరుద్యోగుల్లో కొంతమంది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణె తదితర నగరాల బాట పడుతున్నారు. అక్కడ ఏదో ఒక పని చూసుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేకమంది ఉపాధి కరువై కాలం వెళ్లదీస్తున్నారు. అదే నివేదిక మరో విస్తుగొలిపే వాస్తవాన్ని బయటపెట్టింది. 35 ఏండ్లకు పైబడిన వయసు ఉండి డిగ్రీ విద్యార్హత కలిగిన వారిలో నిరుద్యోగిత రేటు 5 శాతమే ఉండటాన్ని గమనించాలి. దీనర్థం ఏమంటే.. 35 ఏండ్లు వచ్చేసరికి తమ చదువు, ఆశయం, ఆకాంక్షలు, నైపుణ్యానికి విరుద్ధమైన రంగాల్లో స్థిరపడుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు చిన్నాచితకా పనులు చూసుకుంటున్నారు.
ఓ సంస్థ సర్వే ప్రకారం.. సుమారుగా 7,25,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు. మెక్సికో, ఎల్ శాల్వడార్ తర్వాత మూడో స్థానం మనదే. లక్షలాది మంది యువత అక్రమంగా అక్కడ ఎందుకు ఉంటున్నారో అందరికీ తెలిసిందే. వారంతా ఉన్నత చదువులు చదివినవారే. మన దేశంలో నైపుణ్యానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వలసపోతున్నారు. అమెరికా సహా ఇతర దేశాల్లో జీవనాధారాన్ని వెతుక్కుంటున్నారు.
పర్యావరణవేత్తలు మోనాలిసా చిత్రాన్ని ధ్వంసం చేసినట్టే.. మన దేశంలోని చదువుకున్న నిరుద్యోగులు ఈ విధంగా తమ నిరసనను తెలియజేశారు. దేశవ్యాప్త సంచలనం కోసం ఈ క్రమంలో వారు ఆయా దేశాల్లోని చట్టాలను ఉల్లంఘించారు. సాధారణంగా చెప్తే దేశం దృష్టి సారించదని తెలిసే వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నా అభిప్రాయం ప్రకారం పార్లమెంట్ ఘటనలో జరిగిందిదే. భద్రత ఉల్లంఘన ఎలా జరిగిందో మన ఏజెన్సీలు కనుగొన్నప్పటికీ అసలు విషయాన్ని విస్మరిస్తున్నాయి.
దేశంలోని నిరుద్యోగులు తమ దుస్థితికి కారణం తాము ఎన్నుకున్న నాయకులే అని ఇప్పటికీ గ్రహించలేకపోతుండటం విచారకరం. ఎన్నికల సమయంలో నిరక్షరాస్యులు, విద్యావంతులతో పాటు మన పాలకులు కూడా నిరుద్యోగం లాంటి ప్రధాన అంశాలను పక్కనపెడుతున్నారు. కులం, మతం తదితర అంశాలే తెరపైకి వస్తున్నాయి. వాటి ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో విద్యావంతులు, నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు ఉపాధి చూపించాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ విషయంలో విఫలమైతే జనాభా డివిడెండ్ కాస్త జనాభా డిజాస్టర్గా మారే ప్రమాదం ఉన్నది.
అనువాదం: మాలోతు సురేష్
-రోహిత్ ఖన్నా
‘ది క్వింట్’ సౌజన్యంతో