స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించేవారు. ఇక నిజాం స్టేట్లో ఉన్న తెలుగువారు నైజాం దేశం వారే. తెలంగాణ సంస్కృతి దక్కన్ సంస్కృతిలో అంతర్భాగంగా వ్యవహరించబడేది. ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు వారికి కొత్తగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చినా, అది ‘ఆంధ్రులు’గానే వ్యవహారంలోకి వచ్చింది. తెలంగాణ వారికి ఉన్న ప్రత్యేకభాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నీ ఆంధ్ర సంస్కృతిలో కలిసిపోయి, నిద్రాణంగా ఉండిపోయాయి.
కేసీఆర్ మలివిడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన తర్వాతే తెలంగాణ సాంస్కృతిక సింహం నిద్రలేచింది. మన భాషకు, సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉన్నదన్న స్పృహ తెలంగాణ ప్రజలకు కలిగింది. తెలంగాణ జానపద సంపదకు నెలవు. మనకున్న బోనాలు, బతుకమ్మ వంటి సామూహిక ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మన సంస్కృతిని మనకు కేసీఆర్ గుర్తుచేసి ప్రజలను జాగృతం చేశారు. ఉద్యమ రథసారథిగా సాధించిన రాష్ర్టాన్ని దేశంలోనే తలమానికంగా నిలపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహరహం కృషిచేస్తున్నారు.
రాష్ట్రసాధన కోసం కేసీఆర్ ఎంతటి ఉద్యమ ప్రణాళికలు రచించారో, తెలంగాణ సంస్కృతిని పునరుజ్జీవింపజేయటం కోసం అంతటి కృషిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈసడింపులు, అవహేళనలకు గురైన తెలంగాణ పండుగలు, ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతికూల వాతావరణంలోనే తెలంగాణ భవనాన్ని నిర్మించి, టీఆర్ఎస్ పార్టీకి ఒక అస్తిత్వాన్ని, గుర్తింపును తెచ్చారు. అంతేకాకుండా తెలంగాణ అంటే టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేవిధంగా దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్ఠలు పెంచారు. అలాగే.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భవనాలకు కూడా తెలంగాణ భవనాలనే పేరు పెట్టడం గమనార్హం. నేడు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఈ అరుదైన అవకాశం ఇంతవరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి దక్కలేదు. దేశంలో తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ కార్యాలయ భవనం దేశ రాజధాని ఢిల్లీలో కనిపించబోతున్నది. ఇది టీఆర్ఎస్కే కాదు, తెలంగాణ ప్రజలకు దక్కిన అరుదైన గౌరవం.
దేశ రాజధానిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భవనానికి కేసీఆర్ ‘తెలంగాణ భవనం’ అనే పేరు పెట్టారు. ఈ రకంగా ఒక రాష్ట్రం పేరు తమ పార్టీ కార్యాలయాలకు పెట్టుకున్న చరిత్ర ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి లేదు. దేశ రాజధానిలో ఒక రాష్ట్రం పేరుతో ఏ రాజకీయ పార్టీకి భవనం లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉండే తెలంగాణ భవనంలో తెలంగాణ భాష, సంస్కృతి ప్రతిబింబిస్తుంది. తెలంగాణ జెండా దేశ రాజధానిలో సగర్వంగా రెపరెపలాడుతుంది.
తెలంగాణ భవన్లోకి తమ సొంతింటికి వెళ్లినట్లు వెళ్లి వసతి పొందవచ్చు. ఇది కేవలం ఇటుకలు, కాంక్రీట్తో కడుతున్న భవనం కాదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపంగా సజీవ నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ఉద్యమం అనే ఇటుక రాళ్లను పేర్చి, మన ఆకాంక్షలనే కాంక్రీట్తో కడుతున్న మన ఆశల సౌధం. దీనిలో పార్టీ ఆఫీస్తో పాటు, మీటింగ్ హాల్, 20 గదులు, భోజన సదుపాయం కూడా ఉంటుంది. తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే సామాన్య ప్రజలు మొదలు నేతల దాకా ఇకపై వసతి కోసం దిగులు పడవలసిన అగత్యం ఉండదు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక ప్రత్యేకత ఉన్నది. స్వాతంత్య్రం తర్వాత గాంధేయ మార్గంలో అహింసాయుతమైన ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక ఇంజినీరింగ్ మార్వెల్. తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు. కేసీఆర్ నిరంతర క్రియాశీలి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ రైలుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘తెలంగాణ ఎక్స్ప్రెస్’గా నామకరణం చేశారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి ‘తెలంగాణ భవన్’ అని పేరు. ఈ విధంగా దేశ రాజధానిలో అన్నిచోట్లా తెలంగాణ భవన్లు కనిపించడం పట్ల రాష్ట్రంలోని ప్రజలకే కాక, దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలంతా హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధానిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భవనానికి కేసీఆర్ ‘తెలంగాణ భవనం’ అనే పేరు పెట్టారు. ఈ రకంగా ఒక రాష్ట్రం పేరు తమ పార్టీ కార్యాలయాలకు పెట్టుకున్న చరిత్ర ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి లేదు. దేశ రాజధానిలో ఒక రాష్ట్రం పేరుతో ఏ రాజకీయ పార్టీకి భవనం లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ.
-(వ్యాసకర్త: రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్)
కోలేటి దామోదర్