రాజ్యంగ నిర్మాణం నుంచే బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. రాజ్యాంగ రచనలో బీసీలకు అభివృద్ధిపరమైన ఎలాంటి రక్షణలేదు. జనాభా ప్రాతిపదికన హక్కులే లేవు. ఆనాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న అన్ని గణాంకాలు, వాస్తవాలు, చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఈ దేశంలో ఆధిపత్య సామాజిక వర్గాలు తమ జనాభాకు మించి అవకాశాలను పొందుతుంటే బీసీలకు మాత్రం అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
రాజ్యాంగంలో, బీసీలకు తగినంత రక్షణ దొరకలేదని, హక్కులు లభించలేదని, అవకాశాలు కల్పించలేదని అంబేద్కర్ నిజాయితీగా ఆనాడే విచారం వ్యక్తం చేశారు. దాంతో బీసీలకు కొంత ఊరట దొరికింది. కానీ జనాభా ప్రాతిపదికన హ క్కులు మాత్రం లభించలేదు. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో బీసీలకు ఎటువంటి ప్రాతినిధ్యం దొరక లేదు. అప్పటికీ బీసీలు ఎవరు? బీసీల స్థితి గతులేమిటి? బీసీలకు రాజ్యాంగంలో ఎటువంటి రక్షణ సూత్రాలు, హక్కులు అవసరం అవుతాయనేది తేలలేదు.ఆ ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. దాదాపు మూడేండ్లు నడిచిన రాజ్యాం గ నిర్మాణ ప్రక్రియ కాలంలో కూడా, పైన చూపిన ప్రశ్నలకు సమాధానం అవసరమని ఆనాటి రాజకీయ నాయకులు, రాజ్యాంగ నిర్మాతలు, మేధావులు ఎవరూ భావించలేదు. బీసీ ప్రజల మీద దృష్టి సారించలేదు. బీసీల ప్రాతినిధ్యం లేకుండా, అంటే దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ప్రజల ప్రమేయం లేకుండానే రాజ్యాంగ నిర్మాణం జరిగినా ఆనాటి నాయకులెవరూ బీసీలకు జరిగిన అన్యాయాన్ని బలంగా నిలదీయలేకపోయారు. నాడు దాన్ని అడిగే బీసీ గొంతులే లేవంటే ఎంత విచారకరమైన విషయమో ఆలోచించండి.
ఆనాటి నాయకుల నిర్లక్ష్యమో, అమాయకత్వమో కానీ నేటి బీసీ ల అస్తిత్వానికి, బలమైన రాజ్యాంగ ప్రతిపత్తి లేకుండా పోవడానికి కారణమైంది. బీసీలు నేడు మాట్లాడుతున్నది చట్టపరమైన ప్రతిపత్తి కాదు. కుల బాధితులైన బీసీలకు రాజ్యాంగ ప్రతిపత్తి దొరక లేదని. అందుచేత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించినవారు ఎవరి వర్గ ప్రయోజనాల మీద వారు దృష్టి సారించారే కానీ బీసీల మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనబడలేదు. దానివల్ల నేటికీ జనాభా ప్రాతిపదికన అవకాశాలు అందక అన్ని రంగాల్లో అన్నీ కోల్పోతున్నది చరిత్రలో కేవలం బీసీలు మాత్రమే. బీసీల్లో సంచార జాతుల పరిస్థితి మరీ హీనంగా ఉన్నది. పేరుకే బీసీలు కానీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలకన్న దీనస్థితిలో వారున్నారు. వీరి గురించి రాజ్యాంగ రచనలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, ఎలాంటి రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్స్ ఇవ్వకపోవడం విచారకరం.
దేశ వ్యాప్తంగా కేంద్ర ఓబీసీ జాబితాలో కేవలం 2600 కులాలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు మాత్రమే. కానీ దేశ వ్యాప్తంగా ఉన్న 29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంత్లాల్లో స్థానికంగా గుర్తింపు ఇచ్చి బీసీ కులాలుగా పరిగణిస్తున్న కులాలు సగటున 25 నుంచి 40 వరకు ఉన్నట్టు సమాచారం. అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద లేని కులాలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినవి 1000 నుంచి 1600 వరకు ఉంటాయి. ఇంకా దేశ వ్యాప్తంగా రాష్ర్టాలు గుర్తించని కులాలు 1000 నుంచి 1700 వరకు ఉన్నట్టు సమాచారం. అంటే దేశ వ్యాప్తంగా ఇంకా 2000 నుంచి 3300 కులాలు గుర్తింపునకు నోచుకోలేదు. ఆ కులా ల స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు.
ఇలాంటి చాల క్లిష్టమైన సమస్యలు బీసీ సామాజిక వర్గాల్లో ఉంటే గత ప్రభుత్వాలు 75 ఏండ్ల నుంచి వేడుక చూస్తున్నారే తప్ప న్యాయం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం బీసీ కుల గణన చేయడం. కానీ దాన్ని చేయకుండా 2017లో ఓబీసీ ఉప వర్గీకరణకు కమిషన్ వేసింది. కానీ బీసీ కులగణన తేలితే తప్ప ఓబీసీ గణన తేలదనే విషయాన్ని ఆ కమిషన్ తేల్చి చెప్పింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయలేదు. కనీసం ఇంతవరకు ఆ ప్రయత్నం కూడా జరుగలేదు.
1931లో చేసిన ఆఖరి కులగణన నివేదిక ఆధారంగానే మన దేశంలో అన్ని కమిషన్స్ బీసీ సామాజిక వర్గాల ప్రజలకు పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి. అందులో సంచార జాతులకు అసలు అవకాశమే రాలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార జాతుల బాలకృష్ణ రేణుకే కమిషన్ నివేదిక ప్రకారం సంచార జాతులకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇవ్వాలని దేశ వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇక సేవా కులాలు ఇప్పటి వరకు కేవలం 2.68 శాతం మాత్రమే లబ్ధ్దిపొందుతున్నాయి. కానీ ఓబీసీలో ఉన్న కొన్ని కులాలే 97.32% లబ్ది పొందుతున్నాయి. కాబట్టి ఇలాంటి అసమానతలు అన్ని తొలిగి పోవాలంటే కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రత్యేక ప్యాకేజి విధానంలో వెంటనే బీసీల కుల గణన చేయాలి. అలా కేంద్ర ప్రభుత్వానికి వీలు కాకుంటేప్రత్యేకంగా పార్లమెంట్లో చట్ట సవరణలు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ జీవో జారీ చేయాలి.
దానివల్ల ఏ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలున్నాయనే సమాచారం తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం విధాన పరమైన, శాస్త్రీయమైన పద్ధతిలో దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ సా మాజిక వర్గాల ప్రజలకు వారి వారి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్స్ అమ లు చేయాలి. తద్వారా బీసీలకు న్యా యం చేయాలి. బీసీ కుల గణనకు కేంద్రం చర్యలు చేపట్టకపోతే రాను న్న ఎన్నికల్లో బీసీల ప్రతిఘటనను చవిచూడక తప్పదు.
(వ్యాసకర్త : అఖిల భారత సంచార జాతుల కోఆర్డినేషన్ కమిటీ జాతీయ కోర్డినేటర్)
-శ్రీనివాస్ తిపిరిశెట్టి
99494 26536