ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మన రాష్ట్రంలో హైదరాబాద్ మాత్రమే. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, కొచ్చి నగరాలు మాత్రమే. అంటే ప్రధాన నగరాలకు మాత్రమే ఐటీ పరిమితమైంది. కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారింది. మారుమూల పట్టణాలకు కూడా ఐటీ విస్తరించింది.
హైదరాబాద్ నగరానికి అవతల ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్, సిద్దిపేట, కరీంనగర్ వంటి ప్రాంతాలకు కూడా ఐటీ విస్తరించింది.. వాస్తవానికి ఐటీ కంపెనీలు రావాలంటే రోడ్లు బాగుండాలి. విద్యుత్తు సౌకర్యం మెరుగ్గా ఉండాలి. అన్నింటికి మించి ప్రభుత్వ సహకారం ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పదేండ్లలో ఐటీ రంగం నలుదిశలా విస్తరించింది. ‘రోబోక్సా’ అనే సింగపూర్ కు చెందిన ఐటీ కంపెనీ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్ ఏర్పాటు చేసుకున్నది. మొన్నీమధ్య కోదాడకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంస్థ కార్యకలాపాలు చూసి, అక్కడి స్థానిక యువత ఉద్యోగాలు చేయడం చూసి మనసు గర్వంతో ఉప్పొంగింది. దేని కోసమైతే ఉద్యమించామో అవి సాకారమవుతుంటే ఆనందంతో కంట నీరు ఉబికి వస్తున్నది. ఇక మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ‘సనాతన అనలిటిక్స్’ అనే ఐటీ కంపెనీ విజయవంతంగా నడుస్తున్నది. ఇదొక ఈ కామర్స్ యాప్. దానికి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పదివేల మంది వినియోగదారులున్నారు. ఈ కంపెనీలో 86 మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అంతేకాదు, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి ఈ సనాతన అనలిటిక్స్ కంపెనీ మంచిర్యాల నుంచి బిజినెస్ స్ట్రాటజీ సొల్యూషన్స్ అందిస్తున్నది. ఇక్కడ మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో నాలుగేండ్ల కిందట ‘డీజీ యోధ’ అనే కంపెనీ ప్రారంభమైంది. ఈ సంస్థ 200 మంది ఉద్యోగులతో 500 సంస్థలకు సేవలందిస్తున్నది. ఇవే కాకుండా సిద్దిపేట, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో కేటీఆర్ ప్రారంభించిన ఐటీ టవర్లు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాయి.
వాస్తవానికి ఐటీ అంటే పదేండ్ల కిందటి వరకు మన మదిలో మెట్రో నగరాలు మాత్రమే మెదిలేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం చరమగీతం పాడింది. జిల్లా కేంద్రాల్లోనూ సకల సౌకర్యాలు కల్పించింది. ఫలితంగా ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. అక్కడి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ శాఖలను ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతం అనుకునేవి. కానీ మెయిన్ బ్రాంచ్గా, స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ను మార్చిన ఘనత ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వానిదే. ప్రపంచంలోని 14 దేశాల నుంచి దాదాపు 1000 స్టార్టప్ ఐడియాలు వస్తే.. అందులోని 68 ఐడియాలు ఎంపికయ్యాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 13 కంపెనీలు ఉం డటం విశేషం. హైదరాబాదులో 1998లో మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రారంభమైంది. కానీ అప్పటికంటే ఇప్పుడు ఐటీ మరింత అభివృద్ధి చెందింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, ఓలా, వన్ ప్లస్, ఒప్పో, మైక్రాన్ వంటి కంపెనీలు రూ. 23 వేల కోట్లు పెట్టుబడి పెట్టాయంటే మామూలు విషయం కాదు.
ఐటీ రంగం అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన వరుస విదేశీ పర్యటనలు తెలంగాణ రాష్ర్టానికి ఎంతో లబ్ధి చేకూర్చాయి. అంతర్జాతీయ స్థాయి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా 11 పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. టైర్ 2, టైర్ 4 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించడం వల్ల.. గ్రామీణ ప్రాంతాల్లో ఐఐటీ రంగాల వారికి ఉపాధి లభిస్తున్నది. దీనికి తోడు గ్రామీణ తెలంగాణలో అద్భుతాలు చేసేందుకు ఐటీ రంగ నిపుణులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అండదండలు అందిస్తుండటంతో వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.
టీ హబ్, టీ వర్క్స్ వంటి వాటిల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారే సత్తా చూపిస్తున్నారు. అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తూ తెలంగాణ పౌరుషాన్ని చాటుతున్నారు.. ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ ఐటీరంగం ఎంత అభివృద్ధి చెందిందంటే.. ఒకసారి మాదాపూర్, నెక్ నాం పూర, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాలను చూస్తే తెలుస్తుంది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటైన ఐటీ కంపెనీల వల్ల ఎకనామికల్ గ్రోత్ పెరిగింది. అక్కడ ఉండే స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అంతేకాదు అక్కడున్న స్థానికులకు కూడా ఉపాధి లభిస్తున్నది. మలక్పేట వంటి ప్రాంతంలో ప్రభుత్వం ఐటీ పార్కు కోసం ప్రయత్నాలు చేస్తున్నదంటే,ఐటీ విస్తరణ మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
(వ్యాసకర్త: ప్రభుత్వ వైద్యులు, ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి)
– డా॥ కేసగాని రాజశేఖర్గౌడ్ 98484 80890