మేం ఏమీ చేయం. ఎవరైనా ఏదైనా చేస్తే సహించం. ఇదీ కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత సిద్ధాంతం. ఇప్పుడు బీసీలకు అందే సాయం విషయంలోనూ ఈ రెండు పార్టీలు అదే సిద్ధాంతం చాటున నిలబడి మాట్లాడుతున్నాయి. నిజానికి బీసీలను 2023 బీసీలోకి తీసుకెళ్లిందే కాంగ్రెస్. బీజేపీ కూడా దానికేమీ తీసిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో సగానికిపైగా జనాభా ఉన్న బీసీలకు కాంగ్రెస్ కాని, బీజేపీ కాని చేసిందేమీ లేదు? ఎన్నికలొచ్చేసరికి ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలను అడ్డు పెట్టుకొని తెగ మాట్లాడుతున్నాయి ఈ పార్టీలు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ పార్టీలకు ఉన్నదా? నైతికంగా ఈ పార్టీలు బీసీల వద్దకు వచ్చి ఓట్లు అడిగే అర్హత కోల్పోయాయి. బీసీ కుల, జనగణన విషయంలో అడ్డుపుల్లలు వేస్తున్న వాళ్లు బీసీలకు ఏదో చేస్తారంటే ప్రజలు నమ్ముతారా?
కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏం చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ చెప్పిన సమాధానమే చాలు. దేశ స్వాతంత్య్రం తర్వాత 1950లో ఎస్సీలకు, ఎస్టీలకు జనగణన చేయించడానికి చట్టాలు వచ్చాయి కానీ, ఇతర కుల సముదాయాల జనగణన ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేశారు. 1950 నుంచి ఇప్పటివరకు బీసీలు ఎవరు? వారి జనాభా ఎంత? వారి జీవనస్థితి ఎలా ఉంది? అనే లెక్కలేవీ లేవు. ఓబీసీలు ఇంతగా అడుగుతున్నా దేశాన్ని ఇప్పటివరకూ ఏలిన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఏదో ఒక సాకు చూపెట్టి బహుజనుల కులగణనను మాత్రం చేపట్టకుండా పక్కన పడేస్తున్నాయి. ఓబీసీల కులగణన చేయటం అత్యవసరమని తెలిసినా కావాలనే ఆ అంశాన్ని వదిలేస్తున్నాయి.
‘ఒక దేశం సామాజిక సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో గణాంకాలు కీలకపాత్ర వహిస్తాయి. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’గా పేరుపొందిన ‘మహాలనోబిస్’ పేర్కొన్నట్టు.. ‘ప్రణాళిక లేని గణాంకం గొడ్డుది, గణాంకం లేని ప్రణాళిక గుడ్డిది’. 1872లో మొదటిసారి జనాభా గణన జరిగింది. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న కాలంలో కూడా జనాభా గణన జరుగకుండా ఆపలేదు. కానీ, నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం జనాభా గణన చేపట్టడానికి నిరాకరిస్తున్నది. బడుగు బలహీనవర్గాల వ్యతిరేక భావజాలం గల బీజేపీ, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం లభించకూడదనే తలంపుతోనే జనాభా గణన చేపట్టడం లేదు.
ఇప్పటికే దేశంలో అనేక బీసీ కమిషన్లు జాతీయస్థాయిలో వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970, జూన్లో అనంతరామన్ కమిషన్ నివేదిక 92 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించి, 4 గ్రూపులుగా వర్గీకరించింది. వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. 1982, జనవరిలో నియమించబడిన మురళీధరరావు ఏకసభ్య కమిషన్ 101 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తూ, 5 గ్రూపులుగా వర్గీకరిస్తూ, వీరికి విద్య, ఉద్యోగరంగాల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
జస్టిస్ దాళవ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని రాష్ట్ర బీసీ కమిషన్ జూలై, 2007లో ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలను రాష్ట్ర బీసీ జాబితాలో ఈ-గ్రూప్ కింద చేరుస్తూ 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బీసీ-ఈ గ్రూప్లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వేషన్లను 4 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేసిం ది. తెలంగాణ ప్రభుత్వం సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ తొలి రాష్ట్ర బీసీ కమిషన్ 2019 అక్టోబర్లో ప్రభుత్వానికి మరో నివేదిక సమర్పిస్తూ, సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలుచేసింది.
జాతీయస్థాయి బీసీ కమిషన్లు చూస్తే, 1953, జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ దేశవ్యాప్తంగా 2,399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వీరికి విద్యారంగంలో 70 శాతం, ఉద్యోగరంగంలో 25 నుంచి 40 శాతం వరకు రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం 1979లో ఏర్పాటుచేసిన మండల్ కమిషన్ బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని సిఫారసు చేసింది. 2017లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ నివేదిక ఇంతవరకు రాలేదు. వర్గీకరణ కోసం చేసిన డిమాండ్కు అతీ గతీ లేదు. కులగణన చేయడం లేదు. వర్గీకరణ జరగడం లేదు. అన్నింటిని నాన్చుతూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తుంటే బీసీ అజెండాలను బైటకు తీస్తున్నారు. కాకా కాలేల్కర్ కమిషన్ దగ్గరినుంచి ఇప్పటి బీసీ వర్గీకరణ విభజన చేయడం కోసం వేసిన కమిషన్ వరకు ఎన్నెన్నో నివేదికలు, ఎన్నెన్నో సూచనలు సిఫారసులు వచ్చాయి కానీ, నాటినుంచి నేటివరకు జాతీయ బీసీ కమిషన్లు చేసిన సిఫారసులను పక్కన పెట్టారు.
ఈ దేశం ముమ్మాటికీ వ్యవసాయిక దేశం. ఈ రంగంపై ఆధారపడిన తరతరాల వృత్తి కులాల చేతులతోనే భారత సమాజం నిర్మించబడింది. చరిత్ర నిర్మాణంలో, వర్తమాన దేశాన్ని నడిపించడంలో ఓబీసీలే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కానీ, మారుతున్న కాలానికనుగుణంగా ఆ వృత్తుల్ని ఆధునీకరించడానికి ఆ ఉత్పత్తులపై ఆధారపడ్డ జీవితాలను కొత్తదారుల్లోకి మళ్లించడానికి 75 ఏండ్ల మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులు మాత్రం అంతగా ఆలోచించకపోవడం విచారకరం . ఇది దేశాన్ని కృంగదీసే చర్యగానే చూడాలి.
(వ్యాసకర్త: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్)
– జూలూరు గౌరీశంకర్ 94401 69896