శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగత, స్థానిక, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి స్థానిక అంశాలను స్పృశించని ఆ పార్టీ ఎజెండాయే కారణమైంది. స్థానిక ఎజెండాతో కాంగ్రెస్ ఎన్నికల రంగంలోకి దిగితే బీజేపీ జాతీయ ఎజెండాతో బరిలోకి దిగింది. కాంగ్రెస్ ఎజెండాను ప్రజలు స్వీకరించి బీజేపీ ఎజెండాను తిరస్కరించారు.
ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ ఎత్తుగడలను ముస్లిం సమాజం కూడా ఈసారి విజ్ఞతతో ఆలోచించి తిప్పికొట్టింది. మైనారిటీ ఓట్లను జేడీఎస్, కాంగ్రెస్ చీలిస్తే, ఆ పార్టీల్లో ఎవరికీ ప్రయోజనం ఉండదని, తనకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. దీనిని అర్థం చేసుకున్న ముస్లిం సమాజం తమ ఓట్లు చీలకుండా చూసి బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టింది.
కర్ణాటక ఎన్నికల్లో ప్రధానంగా రెండు ఎజెండాలు ప్రజల ముందుకు వచ్చాయి. పాలకపక్షం బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు, హిజాబ్, హలాల్, ఆజాన్, టిప్పు సుల్తాన్, అమూల్ మిల్క్, బజరంగ్ బలి, కేరళ స్టోరీ, మోదీ చరిష్మాను ఎజెండాగా చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటిలో ఒక మహిళకు రూ.2000 పింఛన్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా, దారిద్య్రరేఖకు దిగువన ఉండే కుటుంబాల్లో ఒక్కొక్కరికి నెలకు పది కిలోలు ఉచితంగా బియ్యం పంపిణీ వంటి సంక్షేమ ఎజెండాను నమ్ముకుంది. దీంతోపాటు బీజేపీ హయాంలో జరిగిన అవినీతి, అధిక ధరలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. తాము అధికారంలోకి వస్తే, మత విద్వేషాలకు కారణం అవుతున్న పీఫుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతోపాటు బజరంగ్దళ్ను కూడా నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో బీజేపీ, తనకు మరో అస్త్రం దొరికినట్లు సంబురపడింది. బజరంగ్దళ్ను హనుమంతుడితో పోల్చుతూ, బజరంగ్దళ్ను నిషేధించటం అంటే హనుమంతుడిని అవమానించటం అన్నట్లుగా ప్రచారానికి దిగింది. సామూహిక హనుమాన్ చాలీసా పరాయణం వంటివి చేపట్టింది.
విద్వేషాలు రేపే విధంగా రూపొందించిన కేరళ స్టోరీ సినిమాను ప్రచార అస్త్రంగా మల్చుకుంది. బీజేపీ ప్రచారంలో స్థానిక నాయకత్వాన్ని పక్కనబెట్టి ప్రధాని మోదీ, అమిత్ షాలే ముందుండగా, కాంగ్రెస్ పార్టీ స్థానికుడైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ల సారథ్యంలో ప్రచారం జరిపింది. రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ ప్రచారానికి వచ్చినప్పటికీ స్థానిక నాయకత్వ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు.
కర్ణాటకలో 5.3 కోట్ల మంది ఓటర్లలో లింగాయత్ సామాజిక వర్గం వారు 18 శాతం ఉన్నారు. వీరు దాదాపు 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరు. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలోకి రావటానికి లింగాయత్ల మద్దతే ప్రధాన కారణం. కర్ణాటకను పాలించిన సీఎంలలో 9 మంది ఆ వర్గం వారే. ముస్లింలకు విద్య, ఉద్యోగాలలో ఉన్న 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎన్నికలకు ముందు రద్దు చేసి దానిని చెరి సగం చొప్పున లింగాయత్లకు, రాష్ట్రంలో మరో కీలక సామాజికవర్గమైన వక్కలిగలకు పంచింది. ఈ విధంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలుతాయని బీజేపీ అంచనా వేసింది. అలాగే లింగాయత్ సామాజిక వర్గానికి పెద్దదిక్కు వంటి యెడ్యూరప్పను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ పార్లమెంట్ బోర్డులో స్థానం కల్పించింది. మరోవైపు ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి 69 మందికి టికెట్ ఇచ్చింది. కానీ యెడ్యూరప్పను 2021లో అర్ధాంతరంగా సీఎం పదవి నుంచి దించడం, అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం జగదీశ్ షట్టర్, తాజా మాజీ సీఎం లక్ష్మణ్ సవదికి పార్టీ టికెట్ నిరాకరించడం వంటి చర్యలు లింగాయత్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. దీంతో బీజేపీ ఎన్ని కబుర్లు చెప్పినా వారు ఆ పార్టీని ఈసారి నమ్మలేదు. అంతేగాక, బీజేపీ చేస్తున్న మత విభజన రాజకీయాల పట్ల కూడా వారిలో విముఖత ఏర్పడింది. ఫలితంగానే, బీజేపీ తరఫున పోటీ చేసిన 69 మంది లింగాయత్లలో 15 మంది మాత్రమే గెలిచారు. పార్టీ ప్రయోజనాలకంటే తమ ఆత్మగౌరవమే మిన్న, రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అని లింగాయత్ సామాజిక వర్గం చాటి చెప్పిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.
కర్ణాటకలో లింగాయత్ల తర్వాత అత్యధిక సంఖ్యలో (13 శాతం) ఉండే వాళ్లు వక్కలిగలు. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు. పాత మైసూర్ ప్రాంతంలో 55 సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో వీరి జనాభా ఉన్నది. దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి కర్ణాటక రాజకీయాల్లో కొంతకాలంగా కీలక భూమిక పోషించడానికి ఈ ప్రాంతంలో ఉన్న వక్కలిగల మద్దతే కారణం. లింగాయత్లను ప్రసన్నం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడలనే వక్కలిగల విషయంలోనూ బీజేపీ వేసినప్పటికీ ఫలించలేదు.
టిప్పు సుల్తాన్ను హతమార్చింది వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన యూరిగౌడ, నంజెగౌడ లేననే కల్పిత వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. చరిత్రలో అలాంటి ఉదంతమే లేదని వక్కలిగ మఠాధిపతులు, చరిత్రకారులు, పరిశోధకులు ఖండించారు. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో వక్కలిగలతో పాటు ముస్లింల జనాభా కూడా అధికం. వీరు జేడీఎస్కు మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంక్గా ఉంటూ వచ్చారు.
ఇక్కడ ప్రధానంగా జేడీఎస్, కాంగ్రెస్ మధ్యనే గట్టి పోటీ ఉండేది. వక్కలిగ సామాజికవర్గం ఓట్లు మొత్తంగా జేడీఎస్కు పడటం వల్లనే ఎన్నికల్లో తమకు పూర్తి మెజారిటీ రావటం లేదని భావించిన బీజేపీ, ఈసారి అలా జరగకుండా ఉండేందుకు పావులు కదిపింది. వారికి ఉన్న రిజర్వేషన్ను పెంచింది. అయినా కూడా వారు బీజేపీకి మద్దతివ్వలేదు. జేడీఎస్ వెంట కూడా వెళ్లలేదు. కాంగ్రెస్కు మద్దతు పలికారు. బీజేపీ పాలనను ఓడించటం, ఆ పార్టీని గద్దె దించటమే లక్ష్యంగా వక్కలిగలు ఓటు వేశారు.
ఐక్యత చాటిన ముస్లింలు
ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ ఎత్తుగడలను ముస్లిం సమాజం కూడా ఈసారి విజ్ఞతతో ఆలోచించి తిప్పికొట్టింది. మైనారిటీ ఓట్లను జేడీఎస్, కాంగ్రెస్ చీలిస్తే, ఆ పార్టీల్లో ఎవరికీ ప్రయోజనం ఉండదని, తనకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. దీనిని అర్థం చేసుకున్న ముస్లిం సమాజం తమ ఓట్లు చీలకుండా కాంగ్రెస్కే అండగా నిలిచి బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టింది. జేడీఎస్ 23 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్టివ్వగా అందరూ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ 15 మందికి టికెట్లివ్వగా 9మంది గెలుపొందారు.
పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా క నిపించినట్టు.. బీజేపీ హిందుత్వం ఒక్కటే తమ కు ఓట్లు రాల్చే నినాదం అనుకుంటుంది. కానీ ప్రజలు ఎక్కడివారైనా మొదట ఆలోచించేది దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలపైనే. కర్ణాటక ఎన్నికలు కూడా దీనినే నిరూపిస్తున్నాయి. స్థానిక అంశాలను పక్కనబెట్టి ఒక్క హిందుత్వ ఎజెండాతో వెళ్లి బీజేపీ బొక్కబోర్లా పడితే, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచార అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ విజయం సాధించింది.
వెల్జాల చంద్రశేఖర్
98499 98092