తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనేది కీలక నినాదం. గత తొమ్మిదేండ్లుగా తెలంగాణ ఉద్యమ, అభివృద్ధి సారథి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ ఫలాలను అనుభవిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి ఫలాలను ఆస్వాదించలేకపోతున్న ప్రజా వ్యతిరేక పార్టీలు మూకుమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వంపై దాడిని ప్రారంభించాయి. రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నాయి.
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక దారుణాలకు ఒడిగడుగుతున్నది. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించడానికి రంగంలోకి దిగారు. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న ఈ న్యాయ పోరాటానికి అండగా నిలుద్దాం. విచ్ఛిన్నశక్తులను ఈ భారతీయ సమాజం నుంచి వెలివేద్దాం.
తెలంగాణ రైతాంగానికి నీళ్లివ్వడానికి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనూ, అనేక ప్రాజెక్టులు పూర్తిచేసుకొని ఫలితాలు అందుకుంటున్న తరుణంలోనూ ప్రతిపక్షాలు ఇలాంటి దాడినే ఎంచుకున్నాయి. ప్రతిపక్షాల దాడులను, అడ్డంకులను లెక్కచేయకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకువెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలకు సాగు, తాగునీరు అందివ్వడంలో తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. నిధుల విషయంలోనూ ప్రతిపక్షాల ఈ విధమైన కుట్రనే ఎన్నుకున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పలు బడ్జెట్లలో నిధులు కేటాయిస్తూ తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నది. దేశవ్యాప్తంగా అన్నిరంగాలలో మెరుగైన స్థానాన్ని పదిలపరుచుకున్నది. దేశానికే తెలంగాణ మాడల్ అనే పేరు తెచ్చుకున్నది.
ఈ తరుణంలో తెలంగాణ ఫలితాలు దేశవ్యాప్తంగా కొనసాగాలనే బలమైన ఉద్యమ ఆకాంక్ష మొదలైంది. అన్నింటికన్నా ముఖ్యం గా నియమాకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పర్చింది. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షా ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని 38 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. మిగతా 94 వేల ఉద్యోగాలను పలు ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నది. దేశంలోనే అత్యంత పారదర్శకంగా నియమాకాలు జరిపిన కమిషన్గా టీఎస్పీఎస్సీ పేరు తెచ్చుకున్నది. 13 రాష్ర్టాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల బృందాలు టీఎస్పీఎస్సీ పనితీరును పరిశీలించి తమ రాష్ర్టాల్లో ఇలాంటి విధానాన్నే అమలుచేస్తామని చెప్పడం కమిషన్ పనితీరుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్గా గంటా చక్రపాణిని నియమించి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువతీ యువకులకు ఒకేసారి నమోదు పద్ధతి ప్రవేశపె ట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. పరీక్షా సిలబస్లో తెలంగాణ అస్తిత్వాన్ని, పో రాటాలను, సాంస్కృతిక, రాజకీయ చారిత్రక, విషయాలను చేర్చింది. నిపుణులైన మేధావులతో కమిటీ వేసి పరీక్షా పద్ధతుల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల ఆకాంక్షలను సరైన రీతిలో ఆవిష్కరించే ప్రయత్నంలో భా గంగా దాదాపు మలిదశలో 90 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందు లో భాగంగానే అనేక నోటిఫికేషన్లను విడుదల చేసింది. లక్షలాది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేవిధంగా ప్రణాళికలు రూపొందించి ముందుకుసాగుతున్నది.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీలో జరిగిన లీకేజీ వ్యవహారం యావత్ రాష్ర్టాన్ని బాధించింది. నిరుద్యోగ యువతీ యువకుల ఆకాంక్షల కోసం ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మయానికి గురయ్యా రు. ప్రభుత్వం వెంటనే జరిగిన కుట్రను ఛేదిం చే క్రమంలో సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించింది. దోషులను కోర్టులో హాజరుపరిచి శిక్షించేవిధంగా కఠిన చర్యలు తీసుకున్నది. కేవలం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ద్వా రా జరిగిన ఈ దుర్మార్గాన్ని మొత్తం వ్యవస్థకు, ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకు కుట్రలకు తెరలేపాయి.
సైబర్ నేరానికి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దొంగతనానికి కారకులైన వారిని శిక్షించాలన్న డిమాండ్ను పక్కనబెట్టి ఎలాంటి సంబంధం లేని ఐటీ శాఖ మంత్రిని రాజీనామా చేయాలని కోరడం
రాజకీయ మూర్ఖత్వానికి పరాకాష్ట.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ. కమిషన్ ఏర్పర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం సౌకర్యాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిసీ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం అత్యంత హేయనీయం. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న రాజకీయపార్టీలు తాము పాలిస్తున్న గుజరాత్లో 15, బీహార్ 12, అసోం, మధ్యప్రదేశ్లో 8 సార్లు, ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, గోవా రాష్ర్టాలలో 7 సార్లు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాలు జరిగాయి. తత్ఫలితంగా పరీక్షలు వాయిదా వేసిన విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయినా ప్రజలు మరిచిపోరనే విషయాన్ని ఆ పార్టీలు గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వంటి ఇతర అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు మోదీ ప్రభుత్వ హయాంలోనే లీకయ్యాయి.
ఆ లీకేజీపై దర్యాప్తును సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జికి అప్పగించలేదు. ప్రధాని కానీ, సంబంధిత శాఖ మంత్రులు కానీ రాజీనామా చేయలేదు. అలా చేయాలని ఎవ్వరూ డిమాండ్ చేయలేదు కూడా. కానీ తెలంగాణలో మాత్రం ఇలాంటి రాజకీయం చేయడం శవాల మీద పేలాలు ఏరుకోవడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం అప్పటి ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ నేతృత్వంలో రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుచేసి గురుకుల విద్యాలయాల్లో నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రభుత్వం పారదర్శకంగా జరిపిందని ప్రశంసించిన సదరు అధికారి, రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో, నియామకాల్లో రాజకీయ జోక్యం ఉందని ప్రకటించడాన్ని రాజకీయ కుట్ర కోణాల్లోనే చూడాల్సిన అవసరం ఉన్నది.
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదలబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయించి అవసరమైన స్టడీ మెటీరియల్స్తో పాటు స్టడీ సెంటర్లలో ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటించడాన్ని ప్రతి ఒక్క రూ స్వాగతించాలి. నిరుద్యోగుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన రాజశేఖర్ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడనే ఆధారాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటమే అందు కు నిదర్శనం.
ఈ నేపథ్యంలో దీనివెనుక ఎలాంటి కుట్ర లు జరిగాయో తెలుసుకోవలసిన అనివార్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడింది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు కారణమైన కేసీఆర్ నాయకత్వం పట్ల పెరుగుతున్న ఆదరణను బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై బురదజల్లే దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భవిష్యత్తులో లీకేజీ ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని పరిగణనలోకి తీసుకొని నిరుద్యోగ యువకులు తమ భవిష్యత్తుపై దృష్టిసారించాలి. అయితే కాషాయ దళం పలు మాధ్యమాల ద్వారా చేస్తున్న కుట్రల పట్ల ఉద్యోగార్థులు నిరంతరం అప్రమత్తతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.
(వ్యాసకర్త: బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-దేవిప్రసాద్
90006 33404