Telangana | చర అంటే కదిలేది అని అర్థం. చరించేది చరిత్ర. జరిగిపోయినది చరిత్ర. అయితే ఆ కదలికలో చాలా గుర్తులు చెరపలేనివిగా మిగులుతాయి. ఆ మిగిలినవే తర్వాతి తరాలకు తెలుస్తాయి. మనం చేసిన పనులే చరిత్రను చెప్తాయి. అంతేకానీ, మనం మాట్లాడిన మాటలు కాదు, అవి గాలిలో కలిసిపోతాయి. అయితే, ఈ చరిత్రకు ఎందుకు విలువ ఉంటుంది? అన్నీ విషయాలు లేక పాఠ్యాంశాలు పాఠాలు నేర్పిస్తాయి. కానీ, చరిత్ర గుణపాఠాలు నేర్పిస్తుంది. అంటే, జరిగిన విషయాలు గమనించి, తప్పులు గ్రహించి, వాటిని దిద్దుకుంటే ఎవరికైనా భవిష్యత్తు బాగుంటుంది.
అంతేకానీ, ఎన్ని జరిగినా ‘నేనింతే’ అంటూ ముందుకుపోతే చరిత్ర వారిని క్షమించదు. అంతేకాదు, ‘జరిగినది చెరిపేయగలను’ అనుకుంటే కూడా చరిత్ర ఆ మనిషిని చూసి నవ్వుకుంటుంది. ఉదాహరణకి బహమనీ రాజుల చరిత్ర చూస్తే.. రాజ్యాలను ఏలుతున్న తమ తండ్రులను చంపి వారిలో చాలామంది రాజులయ్యారు. అలాగే మొఘలు వంశంలో చివరి బలవంతుడైన రాజు ఔరంగజేబు తన అన్నదమ్ములను చంపి, తండ్రిని ఖైదు చేసి రాజయ్యాడు. ఇలా చరిత్రలో శాశ్వతంగా లిఖితమైన, జరిగిపోయిన చరిత్ర గుర్తులు చెరగాలంటే, చెరిపేద్దామంటే సాధ్యం కాదు.
మన రాష్ట్రంలో జరిగిన ఘటనే అందుకు చక్కటి ఉదాహరణ. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కూడా అప్పట్లో జరిగిన ఆ ఘటనను ప్రజలు మర్చిపోలేదు. అదే నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటు ఉదంతం. ఇప్పటికీ చంద్రబాబును ‘వెన్నుపోటుదారుడు’ అని అంటున్నారు కదా! మామని గద్దె దించి అధికార పీఠమెక్కిన బాబు.. తానెంతో గొప్ప పరిపాలకుడినని చెప్పుకొన్నా, 55 ఏండ్ల రాజకీయ జీవితంలో 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని పదేపదే చెప్పుకొన్నా, వీటన్నిటితో పాటు ఆయన మొట్టమొదటి బిరుదు కూడా అలాగే శాశ్వతంగా ఉంటుంది. అదీ చరిత్రకున్న బలం.
చరిత్ర ఎలా నిర్మితమవుతుందో చెప్పాలంటే.. ‘ఒక గోడ కట్టినట్టు’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇటుక మీద ఇటుకను పేర్చి ఆ గోడను కడతారు కనుక, మధ్యలో కొన్ని ఇటుకలు తీసేయాలంటే కుదరదు. ఇక దానిపై చరిత్ర నిలవదు. గ్రీకు భాష నుంచి తీసుకున్న హిస్టరీ అనే పదమే చరిత్ర. చరిత్ర (హిస్టరీ) అన్న పదానికి వ్యుత్పత్తి (పుట్టుక) అర్థం చూస్తే.. ‘ఒక తెలివైన మనిషికున్న విజ్ఞానం’ అని అర్థం వస్తుంది. అంటే సామాన్యుల కంటే భూతకాలపు సంఘటనలు తెలిసిన మనిషికున్న జ్ఞానం అని దాని అర్థం. భూతకాలపు అవగాహన ఉన్నవాళ్లని తెలివైనవాళ్లు అని, ఆ కాలపు సంఘటనలను వర్తమానంతో బేరీజు వేసి, భవిష్యత్తుని ఊహించి చెప్పగలిగినవాళ్లని మేధావులని భావిస్తాం.
భూతకాలపు గుర్తులను చెరిపి, ఇప్పటినుంచే ఈ లెక్క అని ఎవరైనా అంటే.. అది లెక్కలోకి వచ్చే అంశంగా ఉండదు. విజ్ఞానం, వివేచన ఉన్నవారెవరూ ఆ మాట అనరు. త్రేతాయుగపు శ్రీరాముడి చరిత్ర, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడి చరిత్ర ఇంకా చదువుకుంటున్న మనం.. నిన్నమొన్నటి తెలంగాణ చరిత్ర మర్చిపోతామా? తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ పీసీసీ అధ్యక్షుడైన రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. 2023 డిసెంబర్ 7న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే ఆయనకు ఒక విషయం తెలియనట్టున్నది. ఏదైనా రాయాలంటే ఖాళీ పేపర్ మీద అయితే త్వరగా మనం అనుకున్నది రాయగలం. కానీ, అప్పటికే రాసి ఉన్న పేపర్పై అక్షరాలను చెరిపి రాయాలంటే సరిగ్గా దానికి రెండింతల సమయం పడుతుంది. అంటే ఐదేండ్ల కాలం కేవలం రెండున్నర సంవత్సరాలుగా మారుతుంది. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఒక రాజకీయ నాయకుడికి.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గ్రహించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉన్నది. అదేమిటంటే, ప్రపంచంలోని రచయితల్లో గొప్పవాడిగా పేరొందిన షేక్స్పియర్ ఒక విలువైన మాట అన్నారు. ‘పేరులో ఏముంది? గులాబీ పువ్వుకి ఇంకో పేరు పెట్టినా దాని పరిమళం మారుతుందా?’ అని. అంటే ‘రైతుబంధు’ పథకానికి రైతుభరోసా అని లేదా ఇంకో పేరు పెట్టినా కూడా.. ఆ పథకాన్ని సృష్టించి అన్నదాతలను ఆదుకున్న రైతు బంధువుగా దేశ చరిత్రలో కేసీఆర్ పేరే ఉంటుంది.
పేరేదైనా సరే, అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినప్పటికీ కనీసం ఆ ధనసహాయాన్ని ఇవ్వకుండా భరోసా పోగొట్టుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరు కూడా చరిత్రలో లిఖితమవుతుంది. చరిత్రకున్న విశేష లక్షణం ఏమిటంటే, మంచీచెడూ అన్నిటినీ శాసనాలుగా శాశ్వతం చేస్తుంది. కాబట్టి, బంధు-భరోసా, ధరణి-భూమాత, ఉచిత కరెంటు-గృహజ్యోతి, మహిళలకు పింఛన్-మహాలక్ష్మి.. ఇలా ఏ పేర్లు పెట్టినా ఆ పథకాలు అమలైన తీరును మాత్రమే చరిత్ర లిఖిస్తుంది కానీ, బహిరంగ సభల్లో చెప్పిన మాటలను కాదు. ఆ మాటలు ఆ ఉపన్యాసాల వరకే ఉంటాయి.
అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తమ రాష్ట్రం తమకే ఉండాలనుకునేవారు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ ‘తెలంగాణ స్టేట్- టీఎస్’ అని పేరు పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి స్టేట్ అని అర్థం వచ్చేలా ఆయన ఆ పేరు పెట్టారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ‘టీజీ’ అని ఎందుకు మార్చాలనుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. టీజీ అంటే తెలంగాణ అని మాత్రమే అర్థం వస్తుంది. అప్పుడు రేవంత్రెడ్డి, ఆయన గురువు చంద్రబాబు వేసిన పథకాన్ని ప్రయోగించడం తేలికవుతుంది.
అదేమిటో చూద్దాం! రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజల ఖర్మకాలి టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి. దేశం దశ బాగోలేనట్టుంది కనుక కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు జరిగాయంటే.. ముప్పేట నాయకులు – నరేంద్రమోదీ, రేవంత్, చంద్రబాబు కలిసి ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాలను ఒక్క రాష్ట్రంగా మార్చే వీలుంటుంది. అప్పుడు ఈ ప్రాంత ప్రజల కండ్లు తుడవడానికి రాష్ర్టానికి ఉమ్మడిగా ఆంధ్రా-తెలంగాణ అని పేరు పెడతారు. 1955లో పెద్ద మనుషులు (?) మొదటగా నిర్ణయించుకున్నట్టు. ఇది జరుగుతుందా అని షాకవకండి. 2014లో కేసీఆర్ ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాక్కొని ఆంధ్రాలో కలిపితే ఏం చేయగలిగాం? అందుకే ఇప్పుడూ ఆ ముగ్గురు అలా చేస్తే ఏమీ చేయగలమో ప్రజలు ఆలోచించాలి.
అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యం. అఖండ మెజారిటీతో బీఆర్ఎస్ సభ్యులను గెలిపిస్తే.. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని, ప్రత్యేక రాష్ర్టాన్ని నిలబెట్టుకోగలుగుతారు. జాగ్రత్త! ఈసారి ఓటు వేయడంలో పొరపాటు జరగకూడదు. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ను గెలిపించండి. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఆపండి. స్వతంత్రతను కాపాడుకోండి.
కనకదుర్గ దంటు
89772 43484