2022, అక్టోబర్ 5 దేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలకబోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్న తరుణం ఇది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుతున్న రోజు. 75 ఏండ్ల అమృతోత్సవం జరుపుకొంటున్న వేళ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడమే కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రప్పిస్తున్నది. పొరుగున ఉన్న చైనా, సింగపూర్, మలేషియాలు అభివృద్ధి సూచికలో దూసుకుపోతుంటే మనం ఇంకా అట్టడుగున ఉండటమే కేసీఆర్ను ఈ దిశగా ఆలోచింపజేసింది.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో కొంతమేర అభివృద్ధి బీజాలు పడి పురోగతిని సాధించిన మాట నిజం. హరిత విప్ల వం, బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణం, ఐఐటీలు వంటివి ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత అభివృద్ధి మందగించి అనేక కుంభకోణాలు, ఎమర్జెన్సీ, మత రాజకీయాలతో దేశ అభివృద్ధి నెమ్మదించింది. ప్రపంచంలోని ఏ దేశానికి లేని మానవవనరులు, సారవంతమైన భూములు, నీటి లభ్యత ఉన్నప్పటికీ ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు కనీస అవసరాలకు కూడా దేశ ప్రజలు ఇంకా అంగలారుస్తుండటం విషా దం. ఇప్పటికీ కోట్లాది మందికి నాణ్యమైన విద్య, వైద్యం అందని ద్రాక్షే. మానవాభివృద్ధి సూచికలో మనమింకా అట్టడుగుననే ఉండటం సిగ్గుచేటు. తలసరి ఆదాయంలో కానీ, అభివృద్ధికి సూచికగా నిలిచే తలసరి విద్యుత్తు వినియోగంలోగానీ మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. వీటన్నింటినీ సాధించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దార్శనికత లేని నాయకత్వ ఫలితమే దీనికి కారణం. అన్ని రుగ్మతలను తీరుస్తామని గుజరాత్ అభివృద్ధి మాడల్ను దేశమంతా తెస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఘోరంగా విఫలమైంది. గుజరాత్ మాడల్ అంటూ మోసపూరిత మాటలతో జనా న్ని వంచించింది.
బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ దేశాన్ని మరింత వెనక్కినెట్టింది. నోట్ల రద్దు పేరిట నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ ప్రజలను మోసం చేసింది. అధికారంలోకి వచ్చాక 2 కోట్ల ఉద్యోగాలిస్తామని యువతలో ఆశలు రేపి వారి ఆశల మీద నీళ్లు చల్లింది. దేశానికి తిండి పెడుతున్న రైతన్నకు వ్యతిరేకంగా చట్టాలు చేసి నెలల తరబడి రైతులను రోడ్లపాలుచేసింది. విద్యుత్తు సంస్కరణల పేరిట రైతులపై మరోమారు దాడికి దిగింది. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు లాంటి సంస్థలను అమ్మకానికి పెడుతున్నది. తన మానస పుత్రుడైన అదానీని ప్రపంచ కుబేరుడిని చేసేందుకు మోదీ తెగ ఉత్సాహపడుతున్నాడు.
దేశాభివృద్ధిని, పేద ప్రజల సంక్షేమాన్ని మరిచిన బీజేపీ ప్రభుత్వం కేవలం మతాన్ని ఎజెండాగా చేసుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ప్రజల భావోద్వేగాలను వాడుకొని జాతిని రెండుగా చీల్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహనీయుల దార్శనికతతో లౌకిక రాజ్యాంగాన్ని తీర్చిదిద్దుకున్న దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వాన్ని నాశనం చేసేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తున్నది. దేశం పట్ల భక్తి, ప్రేమ ఉన్న వ్యక్తులు ఇవ్వన్నీ చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోరు కదా? తెలంగాణలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో చేసి చూపించిన నాయకుడు కేసీఆర్. అలాంటి తెలివైన, సత్తా ఉన్న, జన బలం కలిగిన నాయకుడి అవసరం ఇప్పుడు దేశానికి ఉన్నది.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర కరెంట్, సాగునీరు అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు, పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వీటన్నింటిని ఉచితాల కింద జమకట్టి విమర్శిస్తున్న బీజేపీ పేదరికం, అసమానతలున్నంతవరకు ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అన్న విషయాన్ని మరిచిపోతున్నది.
ఇలాంటి అద్భుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసే కదా, పొరుగు రాష్ర్టాల సరిహద్దు గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాల ద్వారా తమను తెలంగాణలో కలపమని కోరుకొంటున్నది.
ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు తను జాతీయ
రాజకీయాల్లోకి రాకుండా ఎలా ఊరుకుంటాడు. కేసీఆర్ ఒక బాధ్యత కలిగిన నాయకుడు కాబట్టే ప్రజల కోసం జాతి కోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
కేసీఆర్ లాంటి కారణజన్ములకు అసాధ్యాలుండవు, సాధారణ మనిషి దృక్కోణానికి మహాపురుషుల దృక్కోణానికి ఉన్న తేడా అదే. దాన్ని గ్రహించని మూర్ఖులు ఆయన జాతీయరంగ ప్రవేశాన్ని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోరాట సమయంలోనూ అపహాస్యం చేసినవారే. కానీ ఆయన రాష్ర్టాన్ని సాధించి చూపారు. కేసీఆర్ వంటి కార్యసాధకుడిని గుర్తించి మనమంతా ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం, దేశ ప్రగతికి బాటలు వేసుకుందాం.
(వ్యాసకర్త : బీపీ నర్సింహులు గుప్త , 93818 15101, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి)