తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని ఉమ్మడి ఏపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ అవి కల్ల మాటలనేనని స్వరాష్ట్ర పాలన నిరూపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ విద్యుత్తు రంగం అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సవాళ్లను స్వీకరించారు. లోటు విద్యుత్తు కలిగిన రాష్ర్టాన్ని, మిగులు విదుత్తు రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంగా పనిచేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. నత్తనడక నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు.
తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్తు అవసరం కాబట్టి, ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్గఢ్తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని పీజీసీఎల్ ద్వారా కొత్త లైన్ నిర్మించారు. కొత్త విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. 2018 జనవరి 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 26.96 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది.
తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 16 రాష్ర్టాల్లో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ర్టాలే. సరైన ప్రణాళిక, బొగ్గు వనరుల నిర్వహణ కారణంగా తెలంగాణ తన గరిష్ఠ డిమాండ్ను చేరుకున్నది. రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి 2014లో 7,778 మెగావాట్లు ఉండగా, 2022లో 18 వేలకు పైగా మెగావాట్లకు పెరిగింది. సోలార్ పవర్ను 74 మెగావాట్ల నుంచి 4,512 మెగావాట్లకు పెంచింది. రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలను ఉంచుకోవడం ద్వారా బొగ్గు కొరతను తెలంగాణ అధిగమిస్తున్నది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు సరఫరాకు సంబంధించినంతవరకు రాష్ట్రం బాగానే ఉంది. అన్ని థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం రెండు వారాలపాటు బఫర్ స్టాక్ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం పొరుగున ఉన్న 8 రాష్ర్టాలకు బొగ్గును సరఫరా చేస్తున్నది. ట్రాన్స్మిషన్ నష్టాలను ఆరేండ్లలో 15.28 శాతానికి తగ్గించింది. కాగా, జాతీయస్థాయిలో 2019-2020లో 20.46 శాతం నష్టాలున్నాయి. దేశంలోనే అతి తక్కువ ట్రాన్స్మిషన్ నష్టాలున్న రాష్ర్టాల్లో తెలంగాణ 4వ స్థానంలో, దక్షిణాదిలో రెండవ స్థానంలో నిలిచింది. 24 గంటల విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తుండటంతో వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది.
విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 39,519 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే, 2021-2022 నాటికి 61,267 మిలియన్ యూనిట్లకు చేరింది. తలసరి విద్యుత్తు వినియోగంలోనూ గణనీయ ప్రగతి సాధించింది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1,356 యూనిట్ల తలసరి వినియోగం ఉండగా, 2021- 22 నాటికి 2,126 యూనిట్లకు చేరుకున్నది. సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2021-22 నాటికి 4,432 మెగావాట్లకు చేరుకొని ఎనిమిదేండ్లలో 59 రెట్లు పెరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీని పక్కాగా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ట్రాన్స్కో, జెన్కో, తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు సాధించిన కృషితో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం అనేక రెట్లు పెరిగింది. తలసరి లభ్యత వినియోగంలోనూ అగ్రస్థానంలో ఉన్నది. అందుకే తెలంగాణ విద్యుత్తురంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
-మోటె చిరంజీవి
99491 94327