ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఒకప్పుడు ప్రైవేట్ దవాఖానలన్నీ తిరిగిన తర్వాత చివరి అవకాశంగా సర్కారు దవాఖానకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వ దవాఖాన ఫస్ట్ ఛాయిస్ అయింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ వైద్యరంగంలో నెంబర్ వన్ అయింది. కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే కాకుండా.. సౌకర్యాల విషయంలోనూ కార్పొరేట్ దవాఖానలతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానలు పోటీ పడుతున్నాయి.
ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు. కిడ్నీల మార్పిడి, గుండె మార్పిడి చికిత్సలకైతే లెక్కేలేదు. వాస్తవానికి ప్రభు త్వ దవాఖానలు ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఏ ఒక్కరూ కలగనలేదు. కేవలం శస్త్రచికిత్సలు మాత్రమే కా కుండా, అత్యాధునిక వైద్యం అందించడంలోనూ తెలంగా ణ ప్రభుత్వ దవాఖానలు శిఖర స్థానంలో ఉన్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఇన్ని మార్పులు చూసిన తర్వాత గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. కేవలం పదేండ్ల పాలన లోనే 100 శాతం ప్రభుత్వ వైద్యరంగాన్ని బాగు చేయడమంటే మామూలు విషయం కాదు. ఎంతో దీర్ఘదృష్టి, మ రెంతో విశాల దృక్పథం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి
కేవలం వైద్యం మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మాతా శిశు సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం తెర పైకి తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న మరో గొప్ప పథకం అమ్మఒడి-102 వాహనసేవ లు. 300 అమ్మఒడి వాహనాలు రోజుకు 4 వేలమంది గర్భిణులకు సేవలందిస్తున్నాయి. వీటిద్వారా ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్భిణులు లబ్ధిపొందారు. అలాగే 350 మందికి ప్రభుత్వం మిడ్ వైఫరీ శిక్షణ అందించింది. 56 టిఫా స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎంసీహెచ్లను 6 నుంచి 28కు పెంచింది. 350 ప్రసూతి కేంద్రాలను (ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం) ఆధునీకరించిం ది. న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లను 56కు పెంచింది.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి. ఎఎంఆర్ (తల్లి మరణాల రేటు) 92 నుంచి 43కు (దేశ సగటు -97) తగ్గింది. ఐఎంఆర్- 39 నుంచి 21 ( దేశ సగటు-28)వ్యాక్సినేషన్ -68శాతం నుంచి 100 శాతం (దేశ సగటు-79శాతం)కు చేరింది. ఇన్స్టిట్యూషన్ డెలివరీలు -91శాతం నుంచి 100శాతం (దేశ సగటు 79) చేరాయి. ఇవన్నీ మనం చెప్పటం కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు.
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రతి మంగళవారం 272 ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల వైద్య సేవలు అందిస్తారు. ఈ ఏడాది మార్చి 8 నుంచి ఆగస్టు 1 వరకు 22 మంగళవారాల్లో 2లక్షల మందికి ఈ సేవలు అందాయి.
ప్రపంచంలోనే పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించిన చరిత్ర తెలంగాణకు మాత్రమే దక్కింది. మొదటి విడతలో ప్రభుత్వం కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసింది. రెండో దఫాలో కోటి 61లక్షల మందికి కంటి పరీక్షలు చేసి, 41 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే పరిధిని 2 లక్షలనుంచి 5 లక్షలకు పెంచి, 90 లక్షల కుటుంబాలకు వర్తింప జేసింది. ట్రాన్స్ప్లాంట్ల విషయంలో పది లక్షల వరకు ఉచిత సేవలు అందిస్తున్నది. సులభతర సేవలు పొందేందుకు డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నది. ఆయుష్మాన్ భారత్ కాకుండా రాష్ట్ర సొంత నిధులతో అందిస్తున్న ఆరోగ్యశ్రీపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. 2014 జూన్ 2 నుంచి 2023 మే 18 వరకు 16 లక్షల కుటుంబాలకు రూ.7వేల కోట్ల విలువైన చికిత్స ఉచితంగా అందింది. దీనికి అదనంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ ద్వారా గడిచిన 9 ఏండ్లలో 6 లక్షల కుటుంబాలకు రూ.3వేల కోట్ల నిధులను వైద్యం కోసం వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 7వేల కోట్లు, సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ ద్వారా రూ.3 వేల కోట్లు మొత్తంగా రూ. 10 వేల కోట్లను 20 లక్షల కుటుంబాల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్య 102కి పెంచింది. ములుగు, ఏటూరు నాగారంలో కూడా డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్కూడా ఇస్తున్నది. ఏటా 150 వరకు కిడ్నీట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి.
ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత అవసరమయ్యే మందులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా (నెలకు రూ.15 వేలు విలువ చేసే) జీవిత కాలం అందిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నది. కేవలం డయాలసిస్ కోసమే ప్రభుత్వం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నది. నిమ్స్ దవాఖానలో 150 మిషన్లతో దేశంలోనే అతిపెద్దదైన డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
2014లో 321గా ఉన్న 108 అంబులెన్సుల సంఖ్య ను 455కి పెంచింది.. నాడు ఫోన్ చేసిన 30 నిమిషాల్లో అంబులెన్స్ చేరితే, నేడు ఆ సమయాన్ని 15 నిమిషాల కు తగ్గించింది. దవాఖానల్లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మరణిస్తే పైసా ఖర్చు లేకుండా మృతదేహాలను తరలించేలా పరమపద వాహనాలు ఏర్పాటు చేసింది. వైద్యారోగ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 22,455 పోస్టుల భర్తీని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సహా ఇతర సిబ్బందిని నియమించింది. 5204 స్టాఫ్ నర్సుల భర్తీ, 1520 ఏఎన్ఎం పోస్టుల భర్తీ, 156 ఆయుష్ డాక్టర్ల భర్తీ కొనసాగుతున్నది. ఇవీ కూడా పూర్తయితే ఒక్క ఆరోగ్య శాఖలోనే మొత్తం 30వేల పోస్టుల భర్తీ పూర్తి చేసినట్టవుతుంది.
దవాఖానల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడంకోసం, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించి, ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును రూ.5000 నుంచి రూ.7500కు పెంచింది. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కింటికి ఇచ్చే డైట్ చార్జీలను రూ.56 నుంచి రూ.112కు పెంచింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు బెడ్ ఒక్కింటికి రూ.40 నుంచి రూ.80కు చేసింది.
హైదరాబాద్లోని 18 మేజర్ ప్రభుత్వ దవాఖానల్లో రోగితో ఉండే సహాయకులకు రూ.5కే భోజన సదుపాయం మూడు పూటలా కల్పించింది. ఇక 2014 ముందు ఆశాల జీతాలు రూ.2000 మాత్రమే ఉంటే దాన్ని రూ.99 00కు పెంచింది. ఏఎన్ఎంల జీతాలు నాడు రూ. 8,800 ఉంటే నేడు రూ. 27,300 ఇస్తున్నది. నర్సింగ్, హౌస్ సర్జన్లు, పీజీ, సూపర్ స్పెషాలిటీ డా క్టర్ల ఉపకార వేతనాల ను పెంచింది. ఇదం తా కేవలం పదేండ్ల కాలంలోనే పూర్తి చేయటం గమనార్హం
(వ్యాసకర్త : ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు)
-డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్
98484 80890