అస్తిత్వం కోసం అరువై ఏండ్లు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అబివృద్ధి, సంక్షేమం శిఖరాగ్రానికి చేరిందనేది వాస్తవం. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘన విజయాలు ఇప్పటికీ కండ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలు తెలంగాణ సాధించింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ జోడెడ్ల వలె పరిగెత్తాయి.
కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలను కూడా కేసీఆర్ రూపొందించారు. ఆ విధంగా చేస్తే పాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు పాలన చేరువవుతుందనే ఆలోచన కేసీఆర్ది.
అందుకే, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2016లో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం పరిపాలన వికేంద్రీకరణలో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందనే ముందుచూపు కేసీఆర్ది. ఆయన అనుకున్నట్టుగా పాలన వికేంద్రీకరణతో ప్రజలకు అవస్థలు తగ్గిపోయాయి.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ కొత్త రాగం అందుకుంటున్నది. జిల్లాల కుదింపు అవసరమని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం తెలంగాణ సబ్బండ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాల విభజన జరుగకముందు దూరం, పరిధి వంటి సమస్యలుండేవి. ప్రజలు జిల్లా అధికారులను కలిసేందుకు రావాలంటే సుదూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. అలాగే అధికారులకు, ప్రజలకు సంబంధాలు చాలా తక్కువ ఉండేది. జిల్లాల కుదింపు మండలాలపై ప్రభావం పడే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.
జిల్లాల విభజన తర్వాత మండలాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. ఇదిలా ఉంటే జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రతి జిల్లాకు కలెక్టర్ కార్యాలయాలు రూపుదిద్దుకున్నాయి. అందులోనుంచే పాలన పరుగులు పెడుతున్నది. మరి అలాంటప్పుడు కొత్తగా జిల్లాల కుదింపు ప్రక్రియ జరిగితే ఆ వేళ కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాల పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితి నెలకొంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదిస్తే ఈ భవనాలను ఏం చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది.
జిల్లాల విభజన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగింది. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా దూర ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భూముల రేట్లలో భారీగా మార్పులు వచ్చాయి. జిల్లాల కుదింపు నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తే గ్రామాల్లో భూముల ధరలు మొత్తానికే పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. అంతేకాదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు వంటి కేంద్ర విద్యాసంస్థలు రాష్ర్టానికి వచ్చే అవకాశం ఉండదు. ఇప్పటికే ఉన్న జోనల్ విధానం మీద ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. ఉద్యోగులకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రతి వర్గానికి నష్టం కలిగే ప్రమాదం ఉన్నది.
అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది. ఏ వర్గానికి మేలు కలుతుందో దేవుడెరుగు. రైతు భరోసా ఊసు లేదు, రైతుబీమాకు ధీమా లేదు, రుణమాఫీ మీద స్పష్టత లేదు. ఫిబ్రవరి 1 నాడు ఇస్తానని చెప్పిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకా విడుదల కాలేదు. ఈ రోజు ప్రజలు, రైతులు తాగు, సాగునీరు లేక అల్లాడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని పక్కన పెట్టి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు ఏమిటోనని జనాలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఎక్కువయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి ఒకవేళ జిల్లాల కుదింపు నిర్ణయం అమలుచేస్తే ఒకరకంగా అది ప్రజల మెడకు గుది బండ వంటిదే.