డాక్టర్ అవ్వాలి.. లేకపోతే ఇంజినీర్. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ కొట్టాలి. ఎవని కిందనో పని చేయాలి తప్ప.. మనం పది మందికి జాబ్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. మనమెందుకు మన దుకాణం పెట్టొద్దు. మనమెందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టొద్దు. మనమెందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారుచేయవద్దు. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్.. అవేమన్న బ్రహ్మ పదార్థాలా? రాకెట్ సైన్సా? మనం కనిపెట్టలేమా. అప్పట్లో సరైన వసతులు లేవు.
కానీ ఇప్పుడు టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, టాస్క్.. అనేక ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు తెలంగాణలో ఉన్నాయి. మీ కోసం ప్రభుత్వం రెడిమేడ్ ప్లాట్ఫాం సిద్ధం చేసింది. పెట్టుబడులు పెట్టేవాళ్లను తీసుకొస్తాం. మెంటర్షిప్ ఇస్తాం. మీ కోసం అన్నీ చేస్తాం. అరటి పండు తెచ్చి మీ చేతిలో పెడతాం. ఒలిచి తినే బాధ్యత మీదే. ఆలోచనతో రండి.. ఉత్పత్తులతో వెళ్లండి.. ఎంటర్ప్రైజ్లు పెట్టండి. డోంట్ బీ ఏ జాబ్ సీకర్ బీ ఏ జాబ్ క్రియేటర్.
– మంత్రి కేటీఆర్
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది. ఒకరేమో భవిష్యత్తుకు భరోసానిస్తూ.. విద్యార్థులు ఇన్నోవేటివ్గా ఆలోచించి నలుగురికి ఉపాధి కల్పించాలని చెప్తుంటే, ఇంకొకరేమో సరైన అవగాహన లేకుండా యువతకు భవిష్యత్తు అనేదే లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వారే మన రాష్ట్ర ఐటీ శాఖ మం త్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రపంచ మేధావుల మన్ననలు పొందిన కేటీఆర్తో రేవంత్ను పోల్చడమే బుద్ధి తక్కువ. అయినప్పటికీ చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి యువతకు చెప్పక తప్పడం లేదు.
ఉపాధి కల్పనలో తెలంగాణ సర్కారు దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ముందంజలో ఉన్నది. 2014 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. 2,02,735 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 1,60,083 మంది కొలువులు పొందారు. ఒక్క టీఎస్ఎల్పీఆర్పీబీ ఆధ్వర్యంలోనే ఈ పదేండ్లలో 50 వేల వరకు పోలీసు నియామకాలు జరిగాయి. టీఎస్పీఎస్సీ 35 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేయగా, మరో 18 వేల వరకు కొలువులు భర్తీ దశలో ఉన్నాయి. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ హయాంలో 2004-2014 వరకు పదేండ్ల కాంగ్రెస్ ప్రభు త్వం 24,086 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన మన తెలంగాణ వాటా చూసుకుంటే సుమారు 10 వేలు మాత్రమే. అంటే ఏటా 1008 ఉద్యోగాలే. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 16,083 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది కేసీఆర్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి.
మన దేశంలో 140 కోట్ల జనాభా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ కొలువులు సుమారు 40 లక్షలు మాత్రమే. అయితే ప్రస్తుతం 30 లక్షల మంది మాత్రమే కేంద్ర ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. సుమారు 10 లక్షల ఖాళీలున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోక్సభ సాక్షిగా సెలవిచ్చింది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తుంటాయి. పరిశ్రమల రాకతో రాష్ట్ర ఖజా నాకు ఆదాయం రావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ విషయంలో మన రాష్ట్రం ఎంతో స్పష్టతతో ఉన్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పరిశ్రమల రంగం దూసుకుపోతున్నది. మరీ ముఖ్యంగా ఐటీ రంగం జెట్స్పీడ్ను అందుకున్నది. సిలీకాన్వ్యాలీగా పేరొందిన బెంగళూరును మన హైదరాబాద్ దాటేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణ లు, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా అనేక అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ వేదికైంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కొలువయ్యాయి. గ్లోబల్ కంపెనీలు గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ తదితర సంస్థలు తమ క్యాంపస్లను ఇక్కడ ఏర్పాటుచేశాయి. భారీగా కొలువులు వచ్చాయి. గతేడాది దేశవ్యాప్తంగా 4.5 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగా.. వారిలో 1.5 లక్షల మంది హైదరాబాద్ నుంచే ఉండటం గమనార్హం.
2014కు ముందు హైదరాబాద్లో 3.2 లక్షల ఐటీ ఉద్యోగులే ఉండగా.. ఈ పదేండ్లలో ఆ సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లుండగా.. ప్రస్తుతం మన రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షల కోట్లకు ఎగబాకాయి. 31 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తున్నది. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాలకు కూడా ఐటీ టవర్లు అం దుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో స్థానిక యువతకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్, టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ తదిత ర ఇన్స్టిట్యూట్లను నెలకొల్పింది. నైపుణ్య శిక్షణను అందిస్తున్నది. ఐటీతోపాటు ఇతర పరిశ్రమలకు తెలంగాణ కేంద్రంగా మారింది.
దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు, సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామికవాడ, రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి చూపుతున్నది.
ఉపాధికి ఊతమిస్తున్న సర్కారుకు అండగా నిలవాల్సిన బాధ్యత యువతపై ఉన్నది. ఈ సమయంలో యువత తప్పటడుగు వేస్తే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురవుతుంది. మళ్లీ పైకి లేవాలంటే సంవత్సరాలు పడుతుంది. అందుకే యువత మేలుకో. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడిపించే నాయకుడిని ఎన్నుకో.
సికింద్రాబాద్ రోడ్లపైన వ్యాపారాలు చేస్తుంటారు. అదే కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముతుంటారు. వాళ్లందర్నీ వేరే ప్రాంతానికి తరలిస్తాం. ఆ ప్రాంతంలో 24/7 కార్యకలాపాలు నడుస్తుంటాయి. బిజినెస్ జరుగుతుంది. ఇన్కమ్ పెరుగుతుంది. యువతకు ఉపాధి దొరుకుతుంది. తెలంగాణ యువతకు మూడు షిప్టుల్లో పని లభిస్తుంది.
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
-మాలోతు సురేష్
98856 79876