2009వ సంవత్సరం. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. నేను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో డాక్టర్గా పనిచేస్తున్నాను. 610 జీవో రద్దు చేయాలంటూ అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం దవాఖానకు తీసుకువచ్చారు. ఆయనకు వైద్యం చేసిన బృందంలో నేనూ ఒకడిని. ఆయన అలా బెడ్పై పడుకొని ఉన్నప్పటికీ దవాఖానలో సేవల గురించి ఆరా తీశారు.
తెలంగాణ ఏర్పాటైతే వైద్యరంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో చర్చించారు. నేను కొన్ని సలహాలు ఇచ్చాను. ‘డాక్టర్ గారూ మన తెలంగాణ వచ్చినంక అవన్నీ అమలుచేద్దాం’ అని ఆరోజు చెప్పారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ వచ్చింది. మహోజ్వలంగా ఎదిగింది. ఈ పదేండ్లలో ఒక్కసారి ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే కనీవినీ ఎరుగని మార్పులకు కారణమైంది. ఇందుకు ఎవరి దార్శనికత కారణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
విద్య, వైద్యం ఉచితంగా అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా దేశం ఆర్థికంగా, సామాజికంగా ముందుకువెళ్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఇదే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ పదేండ్లలో ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, జిల్లా హాస్పిటళ్లు, టెర్షియరీ కేర్ హాస్పిటళ్ల రూపంలో మూడంచెలుగా ఉన్న వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా మార్పుచేశారు. క్షేత్రస్థాయిలో పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు, ఉన్నతస్థాయిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
తద్వారా మారుమూల తండాలోని ప్రజలకు కూడా వైద్యం అందుబాటులోకి వచ్చిం ది. ఎంత పెద్ద జబ్బుచేసినా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా చికిత్స అందేలా వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ నలువైపులా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు డాక్టర్ను కలవాలంటే పది, ఇరువై కిలోమీటర్ల దూరంలో ఉన్న మం డల కేంద్రంలోని పీహెచ్సీకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పల్లె దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి వచ్చా యి. పట్టణ ప్రాంతాల్లోని బస్తీల్లో నివసించే పేదల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో ఏడాదికి రెండు కోట్ల ఓపీ సేవలు నమోదవుతున్నాయి. ఇక ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా అప్గ్రేడ్ చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల దవాఖానను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది.
ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణలో ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీలు మూడంటే మూడే. అంటే సగటున ఇరువై ఏండ్లకొక మెడికల్ కాలేజీ. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షే అయింది. మరోవైపు డాక్టర్ కావాలనుకున్న తెలంగాణ యువత ఆశలు అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో వైద్య విప్లవానికి నాంది పలికారు. గడిచిన తొమ్మిదేండ్లలో దాదాపు ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారు. ఈ కాలేజీల్లో తయారయ్యే డాక్టర్లు, రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ వైద్యాన్ని చేరువ చేయబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు వేల కోట్లను కేటాయించింది. వైద్యం కోసం ఏయే రాష్ట్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలుపుతూ కేంద్రం ఓ నివేదిక విడుదల చేయగా, ఇందులో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఈ కేటాయింపులు నేరుగా ప్రజలకు వెళ్లకపోయినా, పరోక్షంగా వారిపై ఆర్థికభారాన్ని అనేక రెట్లు తగ్గిస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, పల్లెకో పల్లె దవాఖాన, జిల్లాకో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే ప్రజల జేబు నుంచి ఖర్చు చేయాల్సిన అవసరమే ఉండదు.
ప్రభుత్వ దవాఖానల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతున్నది. ప్రసవాల కోసం మెజారిటీ శాతం మంది ప్రభుత్వ దవాఖానలనే ఆశ్రయిస్తుండటం ఇందుకు ఉదాహరణ. ఈ రెండేండ్లలో రెండు వేల మంది డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. రెండేండ్ల కిందట నర్సులను రిక్రూట్ చేయగా, ఇప్పుడు కొత్తగా పోస్టుల భర్తీ జరుగుతున్నది. వీళ్లందరూ ప్రజలకు సేవచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సేవలను పొందడానికి ప్రజలు కూడా ముందుకు రావాలి.
ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రకటించింది. వయస్సులో, విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం అయినా తెలంగాణ పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కి నెట్టి స్వల్ప సమయంలో నే అగ్రస్థానానికి చేరడం ఆషామాషీ కాదు. దానివెనుక ఎంతో కృషి, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుంది. అవన్నీ సీఎం కేసీఆర్లో మెండుగా ఉన్నాయి. అంతేకాదు, ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలందించేలా మంత్రి హరీశ్రావు నేతృత్వంలో వైద్యారోగ్యశాఖ నిర్విరామంగా కృషిచేస్తున్నది.
(వ్యాసకర్త: ఏవో, ప్రభుత్వ ప్రధాన దవాఖాన, ఖమ్మం)
డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్
98484 80890