తెలంగాణ చాలా ప్రాచీనమైనది. తెలంగాణ అనే పేరు కూడా ప్రాచీనమైనదే.మహాభారతంలో ఆంధ్రులే కాదు తెలుగువారిగా భావిస్తున్న ‘తెలివానుల’ ప్రస్తావన ఉన్నది. గోదావరినదికి ‘తెలివాహ’ అనే పేరున్నది. తెలివాహ తీరంలో జీవించిన జనులే తెలుగువారయ్యారనీ, ‘తెలివాహ’ నుంచే ‘తెలుగు’మాట వచ్చిందని పరిశోధకుడు సంగనభట్ల నరసయ్య ప్రతిపాదన. హాలుని కవితా సంకలనం ‘గాథాసప్తశతి’లో ఎన్నో తెలుగు మాటలున్నాయి.
శాతవాహనుల ద్విభాషా నాణేలమీద లిఖించబడ్డ మొదటి భాష ప్రాకృ తం కాగా రెండవ భాష స్థానికభాషని, అదే తెలుగని చరిత్రకారులు నడుంపల్లి శ్రీరామరాజు వివరించారు. ‘తిలింగ’, ‘తిలింగా’ పదా లు దేశీనామమాల వంటి గ్రంథాలలో కనిపిస్తాయని మల్లావఝల నారాయణశర్మ ఒక వ్యాసంలో ప్రస్తావించారు. తిలింగ అనే మాట కు ‘ఆణెము’ అనే మాట జోడింపబడినపుడు ఆణెము అనే పదానికి దేశమని అర్థం ఉన్నది కనుక ‘తిలింగదేశం తెలంగాణం’, ‘తెలంగా ణ’ అని పిలువబడ్డదని చెప్పడానికి భాషాపరమైన అవకాశమున్నది
తెన్ అంటే ద్రావిడంలో దక్షిణమనే అర్థమున్నది కనుక తెనుంగు ప్రాంతం తెలంగాణనే అని చెప్పిన చరిత్రకారులున్నారు. మౌర్యుల పాలనాకాలంలో వారు దక్షిణాన ఉన్న ద్రావిడదేశాల మీద దండయాత్రలకు బయలుదేరినపుడు వారికి సాయపడ్డది ‘వడుగర్ల’ట. వడుగర్లు అంటే దక్షిణాన ఉండే వారు. మౌర్యరాజ్యానికి దక్షిణాన ఉన్న తెలుగువారు ‘వడుగర్లు’ అని పిలువబడ్డారని మరొక వ్యాఖ్య.
గోదావరి పరీవాహకప్రాంతంలో ఉన్న ఈ అస్మక జనపదానికి ఇప్పటి మన బోధన్ (అప్పటి పోతలి, బహుధాన్యపురం) రాజధానిగా ఉండేది. పోతలి రాజధానిగా దక్షిణభారతదేశాన్నంతా జైనమత తొలితీర్థంకరుడు రుషభుని రెండోకొడుకు బాహుబలి పాలించాడని జైనసాహిత్యం వల్ల తెలుస్తున్నది. మనదేశంలో మౌర్యుల పాలనాకాలంలో ఉన్న గ్రీకురాయబారి మెగస్తనీసు ‘ఇండికా’లో ఈ జనపదం లో ఉన్నాయని పేర్కొన్న ముప్పైనగరాలను అన్వేషించే క్రమంలో చరిత్రకారులు కొన్ని నగరాలను గుర్తించారు. వాటిలో కోటిలింగా ల, ధూళికట్ట, బోధన్, వర్థమానుకోట, కొండాపూర్ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వందశాతం తవ్వకాలు జరుగలేదు. ఆశించినంత చరిత్ర బయటపడలేదు.
తెలంగాణలో క్రీ.పూ.3,4 శతాబ్దాల నుంచే ప్రాంతీయ పాలకులున్నారని, కోటిలింగాలలో జరిపిన తవ్వకాలలో బయటపడిన నాణేల ఆ ధారంగా గోబద, నారన, సిరివయ, కంవా య, సమగోప, సిరికమ (కొత్తరాజు పేరు) 6 గురు రాజులు పాలించారని తెలుస్తున్నది. కో టిలింగాల 2 వేల ఏండ్ల కిందట గోదావరితీరాన వెలసిన తొలి తెలంగాణ రాజ్య రాజధాని నగరం. తెలంగాణ పదం ఎన్నో పరిణామాల తర్వాత వచ్చిన పదం. తెలింగాన, తెలుంగా ణ, తెలగాణ పదాలు తెలంగాణ పదానికి పర్యాయపదాలుగా వాడబడ్డాయి. ఈ పదా లు జాతిపరంగా వాడబడినట్టు లేదు. తెలుగు మాట్లాడేవారిని సంబోధించిన పేర్లే ఇవి. తెలివాహ (గోదావరి)నది ఒడ్డున జీవించిన ప్రజలే తెలివానులు, తెలివాహులు, తెలుగువారిగా పిలువబడి ఉంటారు.
తెలుఁగు పూర్వరూపము తెనుఁగు. నన్నయభట్టు తన కావ్యావతారికలో తెనుఁగు అనే రాశాడు. అదే ఆ తరువాత తెలుఁగైంది. ఆ మారిపోయిన రూపాన్ని పట్టుకొని సంస్కృత పండితులు దానికి త్రిలింగ అనే కృత్రిమ మూలాన్ని సృష్టించారంటారు మఱ్ఱిపూడి సుబ్రహ్మణ్యం. త్రిలింగదేశం అనేది కల్పన తప్ప తెలంగాణకు వర్తించదనేది చారిత్రక సత్యం.
ప్రస్తుత తెలంగాణ పూర్వ గోండ్వానా భూ భాగానికి చెందిన భూఖండమే. దక్కన్ పీఠభూమిలోని భాగం. ఇక్కడి నైసర్గిక స్వరూప మే ఇక్కడి ప్రజల సంస్కృతి, నాగరికతలను, వారి భాషలను వికసింపజేసింది. ఈ నేలకే ఆనాటి పాలనారూపాలలోని షోడశజనపదాలలో ఒకటి, దక్షిణ భారతదేశంలోని ఏకైక జనపదం పేరు ‘అస్మక’. తెలంగాణ భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకం, కృష్ణా, గోదావరియోర్మధ్య ప్రదేశం.
ఏడు శతాబ్దాల క్రితం బర్మా (నేటి మయన్మార్)లో ఓ రాజుండే వాడు. అతడి పేరు మగాడు. అచ్చతెలుగు పేరు. తమకు తొలి ధర్మ శాస్త్ర గ్రంథాన్ని అందించిన రాజుగా నేటికీ బర్మీయులు అతడిని స్మరించుకుంటారు. దక్షిణ బర్మాలో తొలినాటి తటోను, హంసావతి, మర్తబాన్; అలాగే ఉత్తర థాయిలాండ్లోని తొలి నాళ్లకు చెందిన ద్వారావతి, హరిపుంజాయి రాజ్యాల స్థాపకులు మన్ జాతీయులే.
వీరు క్రీస్తు శకం తొలినాళ్లలో కృష్ణా, గోదావరి ముఖద్వారాల నుంచి బర్మాకు వెళ్లారని సర్ ఆర్థర్ ఫెయిరీ 1883లో తన ‘హిస్టరీ ఆఫ్ బర్మా’లో తెలిపారు.బ్రిటీష్ పౌరుడైన ఫెయిరీ ఆనాడు బర్మాకు లెఫ్ట్నెంట్ గవర్నర్ జనరల్ గా పనిచేశారు. మన్ జాతీయులను తలైంగు లు అని కూడా అనేవారని, దీనికి కారణం వీరి మాతృభూమి తెలంగాణ కావడమేనని’ ఫెయి రీ తేల్చిచెప్పారు. మన్ మౌఖిక సాహిత్యంలో ఓ జోలపాట (మన్ భాషలో.. మో న్యా తఛ్) ఉన్నది..‘ఓ కొడుకా, మన నేల తె లంగాణ.. మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో తూర్పు దిక్కున ఉన్న ఈ సువర్ణభూమికి వచ్చాం’. (అనురాధ భట్ట గారి పరిశోధన)ఈ పాటలో, అక్కడి చరిత్రలో కూడా తెలంగాణ ప్రస్తావన ప్రాచీనం.
తెలంగాణ అనే పదం తెలుగు సాహిత్యం లో ప్రస్తావించబడలేదు. తెలింగా అనే మాట మాత్రం ప్రాచీనమే. కానీ, ముసునూరి నాయకుడు కాపయనాయకుని మేనల్లుడు ముప్పనాయకుడు వేయించిన 64 పంక్తుల ‘శ్రీరం గం’ రాగిరేకుల శాసనంలోని మొదటి రేకు, మొదటి వైపు 8,10 వరుసలలో తిలింగాణా మా, తిలింగాణా’అని మొదటిసారి పేర్కొన్న ది. శక సం.1280 అంటే 1358లో కోరు కొం డ ముమ్మడి నాయకుడు వేసిన శ్రీ రంగం తా మ్ర శాసనం ఎపిగ్రాఫియా ఇండికా, 14వ సం పుటిలో 3వ శాసనంగా కనిపిస్తున్నది.
రెండవసారి తెలంగాణను ప్రస్తావించింది తెల్లాపూర్ శాసనం. 1418 జనవరి 8న ఓజులు(విశ్వకర్మలు) కట్టించిన ఏతాంఉన్న కల్కుకంబాల నడుబావి వద్ద దొరికిన తెల్లాపూర్ శాసనంలో ఆ గ్రామం పేరు ‘తెలుంగణపురం’గా పేర్కొనబడింది. ఫిరోజ్షా బహమనీ రాజ్యకాలంనాటి శాసనం. పోచోజు, నా గో జు, కొండమీది మలోజు, నాగోజు అయ్యలో జు సుల్తాన్ ఫెరోజు షాకు బంగారు గాజుండల గొలుసు చేశారని సారాంశం.అందువల్ల తిలింగాణా/తెలంగాణా అని తొలుత పేర్కొన్న శాస నం శ్రీరంగం రాగిరేకుల శాసనమే. తెల్లాపూర్ శాసనం కాదు.
(వ్యాసకర్త : కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం)
శ్రీరామోజు
హరగోపాల్