తెలంగాణ కాంగ్రెస్ అట్టహాసంగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, టీజేఎస్ చీఫ్ కోదండరాంతో పాటు ఇతర రాష్ర్టాల నేతలను తీసుకువచ్చి ఆవిష్కరింపజేసింది. అయితే ఆ డిక్లరేషన్ను చూస్తే బీసీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్కు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఇట్టే అర్థమైపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 34 సీట్లు కేటాయిస్తామని చెప్పి ‘హస్తం’ పార్టీ బీసీలను మోసం చేసింది. ఇప్పుడు ఎంతో ఆశతో ఎదురుచూసిన బీసీ డిక్లరేషన్ ‘కొత్త సీసాలో.. పాత సారా’ అన్న సామెతలా కనిపిస్తున్నది. మరోవైపు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేసిన అంశాలు ఇందులో పొందుపర్చకపోవడాన్ని చూస్తుంటే.. ఆ పార్టీ బీసీలకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నదో అర్థమైపోతున్నది.
కుల గణన చేస్తామని, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు మూడున్నర దశాబ్దాల పాటు, దేశంలో ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీ కుల గణన గురించి అసలుకే పట్టించుకోలేదు. దీం తో బీసీల జనాభా తెలుసుకోవడానికి 1931లో బ్రిటీష్ వారు చేసిన జన, కులగణనే ఇప్పటికీ ఆధారంగా ఉంటున్నది. మండ ల్ కమిషన్తోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు బీసీ కుల గణన చేపట్టాలని సూచించినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అయితే ఓబీసీ కుల సంఘాల ఒత్తిడి మేర కు 2011లో సామాజిక, ఆర్థిక కులగణనను చేయించినా, ఎవరి ఒత్తిళ్లు పని చేశాయో గానీ.. సాంకేతిక కారణాలను చూపుతూ ఆ నివేదికను మాత్రం బయటపెట్టలేదు. స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.
బీసీ సబ్ప్లాన్ ఏర్పాటుకు, ఏడాదికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్కు.. పవర్లో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేకపోయిందన్నది సమాధానం లేని ప్రశ్నే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కుల వృత్తులకు అసలు గుర్తింపే లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, పింఛన్లు అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. గొర్రెల పంపిణీ, ఈత చెట్ల పెంపకాన్ని బీఆర్ఎస్ ప్రోత్సహించినప్పుడు.. వాటిని విమర్శించింది కాంగ్రెస్ నేతలే. ఇప్పుడు వంద రోజుల్లోనే గొర్రెలు పంపిణీ చేస్తామని, ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమిని కేటాయిస్తామని చెబుతున్నారంటే.. ఆయా వర్గాల ఓటు బ్యాంకే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తున్నది.
బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ తన బీసీ డిక్లరేషన్లో ఎక్కడా ప్రస్తావించలేదు. జనాభా ప్రకారం చట్టసభలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు, కేంద్రస్థాయిలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీలు కోరుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వారికి 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే ఆ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాల్సిన ఆవశ్యకత గురించి కాంగ్రెస్ తన డిక్లరేషన్లో ఎక్కడా ప్రస్తావించలేదు. బీసీ బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ గుర్తించినట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో కనీసం ఒక్క బీసీ నేత ఫొటో కూడా కనిపించకపోవడం మరీ దారుణం.
రాష్ట్రంలో సుమారు 72 అసెంబ్లీ స్థానా ల్లో 60 శాతం బీసీలున్నారు. అయితే వీటిలోని 40కి పైగా స్థానాల్లో అగ్రవర్ణాలకు చెందిన లీడర్లే దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నారు. అయితే ఈసారి బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. టికెట్ల కేటాయింపులో మాత్రం వివక్ష చూపింది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆ ప్రకారం చూసుకున్నా రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ మాట తప్పింది. 119 స్థానాల్లో కేవలం 23 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీలు ఆర్థికంగా బలంగా ఉన్న స్థానాల్లోనూ అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా రాని ఎంఐఎం హవా నడిచే పాతబస్తీలోని ఐదు సీట్లు బీసీలకు ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 జనరల్ సీట్లు ఉంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాలుగు సీట్లు కేటాయించింది. ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఒకే ఒక సీటు బీసీకి ఇచ్చారు. సర్వేల్లో ఓడిపోతున్నారని ప్రచారం చేస్తూ బీసీలకు టికెట్లు కేటాయించకపోవడం సరికాదు. టికెట్ దక్కకపోవడంతో బాన్సువాడలో కాంగ్రెస్ నేత కాసుల బాల్రాజు ఆత్మహత్యకు యత్నించాడు. అయినా కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతలు ఆయనను కనీసం పరామర్శించలేదు. బీసీలకు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలంతా కలిసి ఢిల్లీకి వెళ్తే హై కమాండ్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినట్టే.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బీసీ నేత అయిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ను అమలు చేసే పరిస్థితి కనిపించకపోవటంతో.. తీవ్ర అసంతృప్తితో ఆయన పార్టీని వీడారు. ఇచ్చిన మాట ప్రకారం 34 సీట్లు బీసీలకు ఇవ్వాలని ఆయన చేసిన డిమాండ్ను అధిష్ఠా నం పట్టించుకోకపోవడంతో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇంకా అనేకమంది జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు సైతం పార్టీని వీడారు. అయినా పార్టీ వీరితో కనీసం చర్చించలేదు. అయితే టికెట్ల కేటాయింపులో ఉదయ్ పూర్ డిక్లరేషన్నే అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు, బీసీ డిక్లరేషన్, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటే ఎలా నమ్ముతారని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
(వ్యాసకర్త : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు)
– దుండ్ర కుమారస్వామి 99599 12341