వస్తున్నాడు… భూమిపుత్రుల కోసం భారతావనిని తాకట్టు నుంచి విడిపించేందుకు విముక్తి గీతమై వస్తున్నాడు. వలసభారతం రూపురేఖలు మార్చి, సర్వజనానికి సార్థకత చేకూర్చటానికి వస్తున్నాడు. గాంధీ లాంటి బక్కపల్చటి దేహమున్నవాడు, తెలంగాణ మట్టి పొరల పౌరుషం ఉన్నవాడు. అట్టడుగుపొరల నుంచి అభివృద్ధి జెండాను ఎగురవేస్తూ వస్తున్నాడు.
చీకటిలో మగ్గుతున్న దేశాన్ని వెలిగించటానికి, కార్పొరేట్శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వస్తున్నాడు. నదులన్నింటిని ఏకం జేస్తూ దుక్కుల గొంతులు తడిపేందుకు, పంటల సాగును పండుగ జేసేందుకు వస్తున్నాడు. దేశాన్ని కమ్మిన మతం చీకట్లను చెదరగొట్టేందుకు, గంగా జమునా తెహజీబ్ గొంతుక పెకిలించుకొని వస్తున్నాడు. దేశం కోసం నిటారుగా నిలబడతానని, దేశానికి కాపలాదారునిగా వస్తున్నాడు. ఆకలికేకలు లేని రాజ్యం కోసం, ఆత్మగౌరవాల అస్తిత్వ పతాకాన్ని చేపట్టి వస్తున్నాడు. విద్వేష రచనలను విధ్వంసం చేస్తూ, మనిషిని మనిషి ప్రేమించాలన్న తత్వం చెప్తూ వస్తున్నాడు. జాతిని ఏకం చేసే ఐక్య గీతాన్నల్లుకుంటూ, కశ్మీరం మొదలు కన్యాకుమారీ వరకు సమాజానికంతటికీ సామూహిక గీతమై వస్తున్నాడు…
వస్తున్నాడు… రాజ్యాంగ వ్యవస్థలను చెరబడుతున్న దుష్టశక్తులకు ఎదురునిలిచి శిరసెత్తుకుని వస్తున్నాడు. దేశానికి లక్ష్యమేదని ప్రశ్నిస్తూ, నూరుకోట్ల భారతీయుల ముక్త కంఠమై వస్తున్నాడు. రాజ్యాంగవ్యవస్థల రక్షణ కోసం, నియంతృత్వాన్ని నిలువెల్ల పాతర వేస్తూ వస్తున్నాడు. జనవ్యాకరణానికి జీవం పోస్తూ, రేపటితరం ప్రశ్నకు జవాబుదారీగా వస్తున్నాడు. దేశాన్ని ప్రమాదంలో పడేసి ధర్మం నాలుగు పాదాలను విరుస్తుంటే, న్యాయదేవతా కళ్లు తెరువమ్మా అంటూ పరుగెత్తుకొస్తున్నాడు. మతానికి ముడిబెట్టి ఆడే ఆటలు చూపిస్తూ, చట్టసభల్ని కూల్చేసే హంతకతనాన్ని నిరసిస్తూ వస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఫేక్ మీడియాల గుట్టు విప్పుతూ, లౌకికశక్తుల పునరేకీకరణే లక్ష్యంగా వస్తున్నాడు. జన ఆకాంక్షల ఎజెండాలను వెలిగిస్తూ, దేశానికి లక్ష్యరచనలు చేసుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణల పొద్దు పొడుపై, భారత్ రాష్ట్ర సమితి జెండై వస్తున్నాడు. దేశీయ ఉత్పత్తుల ఉత్ప్రేరకమై, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం సైరన్ మోతై వస్తున్నాడు. ఉబికివస్తున్న కన్నీటిని తుడిచే ఉద్యమమై వస్తున్నాడు. దళితబంధు పథకమై, బహుజనావళి గురుకుల పాఠశాలలై, పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటుతూ, ప్రజాహిత పథకాలై, నిరుద్యోగ భారతాన్ని ఉత్పత్తి భారతంగా తీర్చిదిద్దేందుకు వస్తున్నాడు. నాడు స్వాతంత్య్ర సమరం, నేడు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ సమరం విశాల భారతావని ఐక్యతా ఉద్యమం.
(వ్యాసకర్త: తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్)
-జూలూరు గౌరీశంకర్