‘రైతు అనే నేను.. ఉమ్మడి పాలనలో దగాపడ్డాను. విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్న. మాకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలినయి. బీఆర్ఎస్ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మా (రైతు) రాజ్యం వచ్చింది. ఉద్యమ నాయకుడు రైతుబిడ్డ కావడంతోనే కష్టాలు కడతేరుతున్నయ్. రైతుబంధుతో మా జీవితాలకు భరోసా దొరికింది. సీఎం కేసీఆర్ సహకారంతో సంబురంగా సాగులోకి దిగుతున్నం..’ ఇది రాష్ట్రంలోని సగటు రైతు అభిప్రాయం.
ఒకటి కాదు.. రెండు కాదు.. పరాయి పాలనలో రైతులు ఆరు దశాబ్దాలు మోసానికి గురయ్యారు. ఆలి మెడలో పుస్తెలమ్మి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చారు. రోజుల తరబడి క్యూలైన్లో నిలబడి అరిగోస పడ్డరు. ఎండవేడికి గొంతెండిపోతే గుక్కెడు నీళ్లిచ్చేటోళ్లే కరువైండ్రు. గొంతులు తడారిపోయినయి. సాగు ఆశలు సన్నగిల్లినయి. తొలకరికి చేనులో నాటిన మొక్కను బతికించుకునేందుకు ఎరువుల కోసం కర్షకులు పరుగులు తీస్తే టీడీపీ, కాంగ్రెస్ సర్కారోళ్లు లాఠీలతో కుళ్ల బొడిచిండ్రు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతు ఇంటిల్లిపాది రాత్రిళ్లు చేనులో కాపలా కాసిన్రు. ఇట్లా రైతులు అనేక ఇబ్బందులు పడ్డరు. గత పాలకుల హయాంలో రాత్రిపూట కరెంట్ షాక్తో కొందరు రైతులు మరణిస్తే, విషనాగులు కాటేసి మరికొందరు రైతులు చనిపోయారు. కానీ ఇప్పడు కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ రైతుల బతుకుల్లో భరోసా నింపింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి కలిపి రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేలు అదునుకు ముందే రైతు ఖాతాలో డబ్బులు జమచేస్తున్నది ప్రభుత్వం. ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ర్టాన్ని సాధించి పెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఒక రైతు బిడ్డ కావటం వల్లనే అన్నదాతల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నవి.
తెలంగాణ ఉద్యమంలో ‘మా నీళ్లు మాకే’ అనే నినాదమే పునాదిగా స్వరాష్ర్టాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఏడాది తిరగకముందే వ్యవసాయాన్ని బాగు చేయాలని పక్కా ప్రణాళికలు రచించుకున్నరు. అనేక ప్రాజెక్టులను పూర్తిచేసి సాగును సస్యశ్యామలం చేసిండు. ఏండ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిన పాత కాలువలను ఆధునీకరించిండ్రు. ఎండకాలంలోనూ చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నయ్. ఆయకట్టు కింద రెండు పంటలు పండుతున్నాయ్.
ప్రకృతి విపత్తులతో సంభవించిన పంట నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినంకనే పరిహారం అందుతున్నది. పండించిన పంటలను నిల్వజేసేందుకు ప్రతీ మండలంలో కొత్త గిడ్డంగులు ఏర్పాటయ్యాయి. కేంద్రం అంగీకరించకపోయినా పత్తి, ఇతర అపరాలు, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మునుపెన్నడూ లేనివిధంగా అకాల వర్షాలకు తడిసిన పంటలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు జేసి రైతులను అక్కున చేర్చుకోవడం ముదావహం. అరవై ఏండ్ల ఆంధ్రా అరాచక పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ తెచ్చిందో.. అప్పటి నుంచే తెలంగాణలో రైతు రాజ్యం వచ్చింది. ‘మా నీళ్లు మాకే.. మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే’ అనే నినాదాలతో స్వరాష్ర్టాన్ని సాధించి పెట్టిన గులాబీజెండా నీడన రాష్ట్ర రైతాంగం ఇప్పుడు సేదదీరుతున్నది. ఆరుదశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా మొదటసారిగా మా వ్యవసాయానికి పగటి పూట కరెంట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తున్నది. రైతుబంధుతో రైతుల జీవితాలకు, రైతు బీమాతో రైతుల కుటుంబాలకు భరోసా దొరుకుతున్నది.
కాయల పూర్ణచందర్
9182777985