హైదరాబాద్ నగరం నలుదిశలా మెట్రో లైన్లను విస్తరించడం ప్రయాణికులకు శుభసూచకం. ఇందుకోసం రూ.60 వేల కోట్లు ఖర్చుచేసి 6 కారిడార్లలో 400 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు కాలుష్యరహిత ప్రయాణం సాగించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్రిటన్ ప్రభుత్వం లండన్లో ఆ నగర ప్రజల సౌకర్యార్థం 1863లో మెట్రోరైలును ప్రవేశపెట్టింది. అప్పుడు ఆ నగర జనాభా 30 లక్షల లోపే. భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మెట్రో 1984లో కలకత్తాలో మొదలై 2023 వరకు మొత్తం 46.96 కిలోమీటర్లు మాత్రమే విస్తరించింది. అదే బెంగళూరులో 2011 మొదలుపెట్టి 2022 వరకు మొదటి దశలో 68 కిలోమీటర్లు మెట్రో విస్తరణ జరిగితే, జైపూర్లో 2013లో ప్రాజెక్టు మొదలై ఇప్పటివరకు జరుగుతున్నా అక్కడ కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో 2017లో మొదలైన మెట్రో ప్రాజెక్టు 2020 వరకు కేవలం మూడేండ్లలో 69 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం.
గత ప్రభుత్వాలు అసంబద్ధమైన నగర నిర్మాణాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యను నివారించడంలో విఫలమయ్యారు. దీంతో ప్రజలు గమ్యస్థానాలకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు. అనేక నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడంలోనూ, ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రంలోని ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. భారతదేశం మొత్తం మెట్రో విస్తరణ 870.06 కిలోమీటర్లయితే భారతదేశం తర్వాత స్వాతంత్య్రం సిద్ధించిన చైనాలో 11 రెట్లు ఎక్కువగా 9,676.6 కిలోమీటర్లు ఉన్నది. 5.17 కోట్ల జనాభా కలిగి ఉన్న సౌత్ కొరియాలో 883.4 కిలోమీటర్లు మెట్రో వ్యవస్థ ఉండి రోజుకు 2.9 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకున్న పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్యమంత్రిని ఒప్పించి ఇలాంటి ప్రయాణం నగర ప్రజలందరికీ కలిగేలా ప్రపంచ నగరం హైదరాబాద్ నలు దిక్కుల మెట్రో లైన్లను విస్తరించడం అభినందనీయం.
హైదరాబాద్లో నెలకు దాదాపు పదివేల కొత్త కార్లు రోడ్ల పైకి వస్తున్నాయి. మెట్రో ఏర్పాటుచేయడం వల్ల రోడ్లపై ఒత్తిడి తగ్గింది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోరైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇంకా నగర రోడ్లపై ట్రాఫిక్ తగ్గి, ప్రయాణికులు దూసుకువెళ్లాలంటే మరిన్ని మెట్రో మార్గాలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కొత్త పరిశ్రమలు, కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయి. దీంతో యువతకు ఉపాధి, ఉత్పత్తికి కొత్త ఊపు వస్తున్నది. హైదరాబాద్లో మెట్రోరైలుకు మరో మెట్రో రైలు మధ్య సమయం చాలా తక్కువ. ఏ స్టేషన్ నుంచి అయినా బండి వచ్చే సమయం 4.5 నిమిషాల వెయిటింగ్ సమయంతో వస్తే బెంగళూరు, జైపూర్ లాంటి నగరాల్లో అక్కడ మెట్రోలో సమయం కొన్ని స్టేషన్లలో 12 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోలైన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నది. అందుకే ప్రపంచంలో అత్యధిక 802 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థ ఉన్న చైనా దేశంలో గల షాంగై నగరానికి పోటీగా అభివృద్ధి చేయడం కోసం ముందుకు దూసుకుపోవడం హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా ఉన్నవాళ్లకు నచ్చకపోవడంలో వింతేమీ లేదు.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ)
-డాక్టర్ బైరి నిరంజన్
93901 15644