75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందటం లేదు. ముఖ్యంగా, ఎస్సీల్లో ఉప కులాలుగా ఉన్న ప్రజలు అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్నారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల మాల, మాదిగలే గరిష్ఠంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి ఏపీలో నాలుగేండ్లపాటు అమలైన వర్గీకరణ కూడా ఉప కులాలకు న్యాయం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఉప కులాలను ఆదుకునే విధంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాల్సిన అవసరం ఉన్నది.
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమానతలకు దారితీస్తున్న విషయాన్ని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. రిజర్వేషన్ల లక్ష్యం అసమానతలు తొలగించడమే అయినప్పుడు, కల్పించిన రిజర్వేషన్లతోనే అసమానతలు ఏర్పడటం ఆందోళనకరం. 1996 సెప్టెంబర్లో నాటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అందరికీ సమ న్యాయం కోసం ఎస్సీలను ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరించాలని సూచించింది. దాని ప్రకారం ఎ-గ్రూపులో రెల్లి తదితర 12 కులాలకు ఒక శాతం రిజర్వేషన్; బి-గ్రూపులో మాదిగ తదితర 18 కులాలకు 7 శాతం రిజర్వేషన్; సి-గ్రూపులో మాల తదితర 25 కులాలకు 6 శాతం రిజర్వేషన్; డి-గ్రూపులో ఆది ఆంధ్ర తదితర 4 కులాలకు ఒక శాతం రిజర్వేషన్.. మొత్తం 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పింది. ఈ మేరకు 2000 నుంచి 2004 వరకు ఏపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసింది. 2004లో దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రద్దుచేస్తూ, వర్గీకరణచేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ 2008లో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
తెలంగాణలో మోచి, బైండ్ల, హోలీయ దాసరి, గోసంగి, చిందు, మాస్టిన్, మాదిగ జంగం, మాల జంగం, డక్కలి, సమగర, బేడ బుడగ జంగం, నేతకాని, మితల్ అయ్యళ్వార్లు, మాదాసి కురువ, పాకి, బ్యాగరి, దోంబరా, మన్నే మొదలైన అత్యంత వెనుకబడిన 57 ఉప కులాలు ఉన్నాయి. వీరి జనాభా 21,44,718. ఎస్సీలలో వీరు 34 శాతం ఉన్నారు.
ఈ దేశ చరిత్రను, పురాణాలను భాగవతం, యక్షగానాల రూపంలో భవిష్యత్తు తరాలకు అందిస్తున్న ఉప కులాల ప్రజలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. భిక్షాటన చేస్తూ, పూసలు అమ్ముతూ, చెప్పులు కుడుతూ, సంచార జీవనం గడుపుతూ, వీధి సర్కస్లు చేస్తూ, గ్రామ దేవతలకు పూజారులుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయాల పరంగా మాల, మాదిగలతో పోల్చితే అత్యంత వెనుకబడి ఉన్నారు.
కులం, వృత్తి, దారిద్య్రం ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. రిజర్వేషన్ల వల్ల సమన్యాయం జరగాలి. ఇదే అంశంపై 2020 ఆగస్టు నెలలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దావీందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం పరిశీలనకు నివేదించారు. ఈ కేసులో కొన్ని ముఖ్యమైన అంశాలను గమనిస్తే ఎస్సీలను వర్గీకరించరాదంటూ 2004లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని, ఎస్సీలను వర్గీకరించి వారిలో వెనుకబడ్డ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ర్టాలకు ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2004లో చెన్నయ్య కేసును విచారించిన బెంచ్ ఇచ్చిన తీర్పు సరికాదని, వాస్తవాలను గుర్తెరగకపోతే సామాజిక మార్పు జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరదని స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 నుంచి 2004 వరకు అమలులో ఉన్న ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగ కులాలు మాత్రమే అధిక లబ్ధి పొందాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఉపకులాలకు తీరని నష్టం జరిగిందని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గతంలో జరిగిన ఎస్సీ వర్గీకరణను రద్దు చేసి, అందుకు భిన్నంగా ఎస్సీ ఉప కులాలకు న్యాయం జరిగే విధంగా హేతుబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఎస్సీ ఉప కులాలను ఎ-గ్రూపులో; మాదిగలను బి-గ్రూపులో, మాలలను సి-గ్రూపులో ఉండేట్లు ఎస్సీల వర్గీకరణ చేయాలి. మూడు గ్రూపులకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించాలి. మాలల ద్వారా మాదిగలకు నష్టం జరిగిందని అంటున్నారు. అది నిజమే కానీ.. మాల, మాదిగల ద్వారా ఎస్సీ ఉప కులాలకు కూడా తీవ్రనష్టం జరుగుతూనే ఉంది. దీన్ని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒకే జాతి వారమన్న నెపంతో సంపన్న శ్రేణి వారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందడం సరికాదు. కాబట్టి రాజ్యాంగ రక్షకులైన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఈ అసమానతలను తొలగించటానికి తగిన చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఎస్సీల్లో ఉన్న ఉప కులాలకు రిజర్వేషన్లలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
(వ్యాసకర్త: వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి)
-బైరి వెంకటేశం మోచి
94919 94090