‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.. దేశం పురోగతి సాధించాలంటే ప్రతి పల్లె అభివృద్ధి చెందాలె’ అని చెప్పిన మహనీయుల బాటను అనుసరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమూలంగా పరిష్కరించే క్రమంలో మౌలిక వసతులు కల్పించడం, తద్వారా గ్రామాల నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు పోయే వలసలను ఆపడం వల్లనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందనేది చారిత్రక సత్యం.
చిన్న ప్రాంతాలతోనే పటిష్ఠమైన అభివృద్ధి: వికేంద్రీకరణ ద్వారానే పరిపాలన సులభమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించారు. 459గా ఉన్న మండలాలను 612కు పెంచారు. 8,368గా ఉన్న గ్రామ పంచాయతీలను 12,769లకు పెంచారు. తత్ఫలితంగా హామ్లెట్ గ్రామాలు, గిరిజన తండాలు, గూడేలు అనేకం కొత్త గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాజీలేని కృషి చేస్తున్నది.
సమగ్రాభివృద్ధితో మురుస్తున్న పల్లెలు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించిన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం (టీఆర్ఐజీపీ) తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా 2019-2022 మధ్య కాలంలో 12,769 గ్రామ పంచాయతీలకు రూ.16,070.77 కోట్ల నిధులను కేటాయించింది. రూ.7,203 కోట్లు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వగా.. రూ.8,867.77 కోట్ల నిధులు ఆయా శాఖల ద్వారా ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసింది. ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని 2015-16లలో ప్రారంభించగా, 2022-23 వరకు 14,965 నర్సరీలను ఏర్పాటు చేసింది. 230 కోట్ల మొక్కలను నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకొని, 270.65 కోట్ల మొక్కలు నాటింది. దీనికోసం దాదాపు రూ.10.417 కోట్ల నిధులను వ్యయం చేసింది. అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దాలని రూ.457.23 కోట్లు నిధులు కేటాయించగా 77 పార్కులు పూర్తయ్యాయి. 60 పార్కులు ప్రజావసరాల కోసం వినియోగంలో ఉన్నాయి. 71.15 కోట్ల మొక్కలతో 158 కిలోమీటర్ల రహదారులను తీర్చిదిద్దింది.
పల్లె ప్రగతి-సుపరిపాలనతో నిరంతర కార్యాచరణ: 2018లో చేసిన నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా పల్లెల్లో నెలకొన్న నిర్దిష్టమైన సమస్యల పరిష్కారానికి సమగ్రమైన ఆలోచనలతో ‘పల్లె ప్రగతి’ అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు విడుతలు పూర్తికాగా, గ్రామీణులకు ఉత్తమ, నాణ్యమైన ప్రామాణిక జీవితాన్ని అందించడం కోసం రూ.14235.50 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా 2014-15లలో రాష్ట్రంలో 62.48 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, అది 2021-22ల నాటికి 135 లక్షల ఎకరాలకు చేరుకున్నది. తద్వారా తెలంగాణ అన్నపూర్ణగా మారి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.
బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి: గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే వలసలు ఆగిపోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయి బాట పట్టిన తెలంగాణ ప్రజానీకం నేడు సొంత గ్రామాల్లోనే స్వయం ఉపాధి పొందుతున్నది. వ్యవసాయం, కుటీర, పాడి పరిశ్రమలు, ఉద్యాన తోటలు, అనేక రకాల చిరుధాన్యాలను పండిస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యవసాయ రత్నగర్భగా అగ్రశ్రేణిలో నిలబెడుతున్నది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అనేక కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, ఆర్థిక స్వావలంబన చేకూర్చడానికి వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసి ప్రభుత్వం రూ.653 కోట్ల నిధులు విడుదల చేసింది. 4.20 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్ధిదారులు తీసుకున్న రూ.5 వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లించారు. దేశం మొత్తంలో ఇంతపెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం కేవలం తెలంగాణలోనే సాధ్యమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వ అవార్డులతో నూతనోత్సాహం: రాష్ట్ర ప్రభు త్వం పుష్కలంగా విడుదల చేస్తున్న నిధులతో గ్రామీణ ప్రాం తాలు పట్టణ ప్రాంతాలను మించి సౌకర్యవంతమైన నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభు త్వం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ప్రకటించినటువంటి 46 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులను దక్కించుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కింద నడుస్తున్నటువంటి అనేక పథకాలకు పేర్లు పెట్టుకున్నా, నిధుల విడుదలలో మాత్రం ప్రచార ఆర్భాటం తప్ప కేటాయింపులు చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఏ స్థాయిలో బలోపేతం చేసిం దో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే చెప్తున్నాయి. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని మరొక్కసారి ఆశీర్వదించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: 2023-జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రహీత)
-నాసన్పల్లి నరసింహారెడ్డి
99492 88555