యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్న సమయంలో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల రిక్రూట్మెంట్పై న్యాయ వివాదాలు తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకానికి బాధ్యతాయుతంగా 2017 నవంబర్ 25న జీవో 34ను జారీచేసింది. యూపీ, అలహాబాద్ యూనివర్సిటీల్లో విభాగాల వారీ రోస్టర్ ఫిక్సేషన్ చేయాలంటూ కొందరు హైకోర్టులో కేస్ ఫైల్ చేశారు. దీంతో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి గతంలో సోషల్ సైన్సెస్, సైన్సెస్, ఇంజినీరింగ్ విభాగాలను యూనిట్లుగా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేసేవారు. కానీ, సబ్జెక్టుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.
ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేయడంలో యూజీసీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాప్యం చేసింది. దేశంలోని యూనివర్సిటీ మేధావులు, ప్రొఫెసర్ల ఒత్తిడి మూలంగా ఎట్టకేలకు సుప్రీం లో సవాల్ చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)పై తీర్పు వచ్చే వరకు దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ను వాయిదా వేయాలని హెచ్ఆర్డీ మినిస్ట్రీ 2018, జూలై 18న వీసీలకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితం గా 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో ఖాళీల భర్తీ ప్రక్రియలో జరిగిన మోసాలు, కుట్రలు, రాజకీయ ఒత్తిళ్లను గుర్తించారు. అటానమస్ పేరుతో కొందరు వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. అందుకే రిక్రూట్మెంట్ ప్రక్రియను సమూలంగా మార్చాలని తలిచారు. మేధావులతో చర్చించి యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు కు అంకురార్పణ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని 11 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి 2022, సెప్టెంబర్ 12న రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పారదర్శకత పాటించాల ని, వాటిని బలోపేతం చేయాలని వర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు 2022, జూన్ 23న ఉత్తర్వులు జారీచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సిటీల బలోపేతానికి కామన్ రిక్రూట్మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు కృషిచేస్తుంటే, తెలంగాణ నిరుద్యోగుల జీవితాల్లో చీకటి నింపడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది. బిల్లు ల మీద సంతకాలు చేయకుండా గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే చివరికి ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. గవర్నర్ స్థాయిలోనే ఆమోదించే అవకాశం ఉన్నప్పటికీ.. రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మరింత ఆలస్యం చేసేందుకే ఇలా పంపడం ఉన్నత విద్యావంతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది గవర్నర్ కావాలనే చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నది. వర్సిటీలకు చాన్స్లర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ ఇప్పటికైనా వర్సిటీల బలోపేతానికి అవసరమైన రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలిపితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. లేదంటే యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరగకుం డా అడ్డుకున్నరనే మచ్చ గవర్నర్కు ఎప్పటికీ ఉంటుంది.
ప్రొ.చింతకాయల దినేష్ కుమార్
98490 50305