ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల అమలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ప్రతి రోజు ఉదయం సమయంలో ఒక గ్రామంలో, మధ్యాహ్నం సమయంలో మరో గ్రామంలో గ్రామసభలు జరుగుతున్నాయి. అక్కడే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని పాలకులు ప్రకటించారు.
Prajapalana | ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీళ్లు, నీడ ఉండేట్టు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం, రద్దీ దృష్ట్యా ప్రజలను నియంత్రించడానికి పోలీసులను కూడా నియమించింది. అయితే అసలు విషయం ఏమంటే.. ప్రపంచమంతా ఆన్లైన్ మయం అయిన ఈ రోజుల్లోనూ.. ప్రజలను గంటల తరబడి లైన్లలో నిల్చోబెట్టి దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం ఎందుకొస్తున్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరమున్నది.
ఆధార్ అప్డేట్ను అనధికారికంగా తప్పనిసరి చేయడంతో ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఒకరోజు టోకెన్ తీసుకోవడానికి, వారిచ్చిన తేదీ ప్రకారం వాటిని అప్డేట్ చేసుకోవడానికి మరో రోజు.. ఇలా రెండు రోజుల పాటు గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు. తెల్ల రేషన్కార్డులు ఉంటేనే గ్యారెంటీలు వర్తిస్తాయని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో దాని కోసం ప్రజలు బారులుతీరుతున్నారు. అక్కడ కూడా అదే సమస్య ఎదురవుతున్నది. తెల్లకార్డుల కోసం ప్రజలు రోజుల తరబడి పనులన్నీ విడిచిపెట్టి తిరుగుతున్నారు. అయితే తెల్లకార్డు ఉంటేనే గ్యారెంటీలు అని చెప్పిన ప్రభుత్వం.. వాటి దరఖాస్తులను స్వీకరించకపోవడం గమనార్హం. ఈ విషయం తెలియక అనేకమంది మీసేవల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ విషయంలోనూ ఇదే జరుగుతున్నది. అర్హుల ఎంపిక పేరుతో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తుండటంతో గంటల తరబడి లైన్లలో నిల్చుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అర్హుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం ఉండదని ఓ వైపు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. కాంగ్రెస్ మార్క్ కనిపించేందుకే ‘ప్రజాపాలన’ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నది. అర్హులను ఎంపిక చేసేటప్పుడు గ్రామ, మండల, జిల్లా పార్టీ నాయకులు అక్కడే ఉండేలా గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. అందుకు తగ్గట్టుగానే స్థానిక నేతలు అంతా తామై గ్రామ సభలను నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి నేరుగా వెళ్లవచ్చని, పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావించినా.. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతున్నది. ప్రొటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నా.. పార్టీ మార్క్ ఉండేందుకు వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం పేరిట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నట్టు ప్రజల నుంచి ఆరోపణలు వస్తుండటం గమనార్హం. తద్వారా అర్హుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. 64 స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ, అదే సమయంలో 39 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో ఎంఐఎం గెలుపొందాయి. దీంతో సభలో ప్రతిపక్షం కూడా బలంగానే ఉన్నది. ఇలాంటి సమయంలో పార్టీకి మైలేజీ తీసుకురావడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రజా పాలన సభల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా కుట్ర జరుగుతున్నదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హస్తం ఎమ్మెల్యేలు లేని చోట, ఓటమి పాలైన ఆ పార్టీ అభ్యర్థులకు, నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కాకుండా కాంగ్రెస్ నేతలకు పెత్తనం ఇచ్చినట్టయింది. తద్వారా ప్రజా తీర్పును ప్రభుత్వమే ధిక్కరించినట్టు అయ్యింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదైతే పార్టీలతో సంబంధం లేకుండా, పక్షపాతం చూపకుండా అర్హులను ఎంపిక చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే నెపంతో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సూచనలను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
-ఫిరోజ్ ఖాన్
9640466464