బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను వింటే ఆశ్చర్యమనిపించింది. ‘రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కూడా మారటం కష్టమే’నని భావించిన చాలామంది తమ అభిప్రాయం నిజమేనని ఈ మాటలతో నిర్ధారణకు వచ్చారు. ‘అధికారంలోకి వచ్చి పదవీ బాధ్యతలు చేపట్టాక హుందాతనం, మార్పు వస్తుందిలే’ అని భావించిన వాళ్లంతా తమ అంచనాలు తప్పాయని అనుకుంటున్నారు. రాజకీయాల్లో రేవంత్రెడ్డిలా దుందుడుకుగా విమర్శలు చేసేవారు చాలామందే ఉంటారు. కానీ, ఒక్కసారి అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తే చాలామంది తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకుంటారు.
ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవికి వన్నె తేవాలనుకుంటారు. అలా సందర్భానుసారం మారి, పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కొందరు తమ పద్ధతిని మార్చుకోకుండా, పదవికి మచ్చ తెస్తారు. అలాంటివారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఎందుకంటే హోదాను మరిచి, పదవికి కళంకం తెచ్చేలా వ్యవహరించేవారు చరిత్రహీనులుగా మిగిలిపోయి, అందరికీ గుర్తుండిపోతారు కనుక. మన సీఎం కూడా ఆ కోవకే చెందినట్టున్నారు! తాను సీఎం అయ్యానని ఇప్పటికీ నమ్మకం కుదరక, ఆయన ఇంకా గతంలోనే విహరిస్తున్నారు. ఎన్నికల నాటి భాషనే పదేపదే వల్లె వేస్తూ అభాసుపాలవుతున్నారు. ఆయన భాషను చూసి సొంత పార్టీ నాయకులే తలదించుకుంటున్నారు.
రేవంత్రెడ్డి మాట తీరు, ఆయన భాషను చూసి చాలా మంది మేధావులు, బుద్ధిజీవులు కాంగ్రెస్ పార్టీకి ఇంత కష్టం వచ్చిందేంటని ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే, గతంలో ఆ పార్టీ గొప్పగొప్ప నాయకులకు నెలవు. సొంత పార్టీ నాయకులను మించి ప్రతిపక్ష నేతలను గౌరవించిన చరిత్ర కొంతమంది హస్తం పార్టీ నేతలకున్నది. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వాజ్పేయిని ఎంతగా గౌరవించారో అందరికీ తెలిసిందే. అంతెందుకు ఇప్పుడున్న సీఎం బంధువైన జైపాల్రెడ్డి కూడా కాంగ్రెస్ నేతనే. ఆయన ఎంత హుందాతనం కలిగిన నేతనో మనందరం చూశాం. ఇలాంటి నేతలు కాంగ్రెస్లో కోకొల్లలు. ఇప్పటికీ కొంతమంది అలాంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. తన స్థాయిని మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్రెడ్డిని చూసి మేధావులు నివ్వెరపోతున్నారు. ఆయన మాటతీరును చూసి కాంగ్రెస్ పతనం మొదలైందని చర్చించుకుంటున్నారు.
నిజానికి రేవంత్రెడ్డి మాట్లాడే భాష ఒక శాతం ప్రజలను మాత్రమే రంజింపజేస్తుంది. ఆ ఒక్క శాతం కోసం తెలంగాణ ప్రజలంతా విస్తుపోయేలా మాట్లాడటం చూస్తుంటే, ఏమిటీ వైపరీత్యమని బాధపడాల్సి వస్తున్నది. ఆయనలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల కన్నా దుందుడుకుగా వ్యవహరించే ఒక కార్యకర్తకు ఉండాల్సిన లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నది. అందుకే సీఎం పదవి వచ్చాక కూడా అధిష్ఠానాన్ని మెప్పించేందుకే ఆయన ఇతర నాయకులతో పోటీ పడుతున్నట్టున్నారు.
కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులను తిడితేనే పదవిలోకి వచ్చానని రేవంత్రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. ఆ క్రమంలో దక్కిన పదవిని కాపాడుకోవటానికి కూడా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. ఇది కేసీఆర్ అంటే నచ్చని వాళ్లకు కొన్ని రోజుల పాటు బాగుంటుంది. కానీ, రేవంత్రెడ్డిపై ఓ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడం కేసీఆర్ను తిట్టినంత సులువు కాదు. సంక్షేమం, అభివృద్ధిలో కొత్త ఒరవడిని సృష్టించిన కేసీఆర్ను మించి పని చేస్తేనే తనకంటూ ఓ గుర్తింపు వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. పరిపాలనాపరంగా కేసీఆర్ ఓ ట్రెండ్ను సెట్ చేశారు. తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నారు. ఆయనకంటూ ఓ ట్రాక్ రికార్డు ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర రాష్ర్టాల వాళ్లు తెలంగాణ అభివృద్ధిని చూసి ఈర్ష్యతో ఆయనపై కోపం పెంచుకున్నారు. ఇప్పుడు మాత్రం నవ్వుకొంటున్నారు. తెలంగాణను చూసి జాలిపడుతున్నారు. ఎందుకంటే, దావోస్ పర్యటనతో తెలంగాణ భవిష్యత్తు ఏంటో వాళ్లకు కండ్లకు కట్టినట్టు కనిపించింది.
కొంతమంది రేవంత్రెడ్డి భాషను సమర్థించే క్రమంలో ‘కేసీఆర్ గతంలో తిట్టలేదా?’ అనే వాదనను ఎత్తుకుంటున్నారు. కానీ, కేసీఆర్ ఎప్పుడైనా తీవ్రమైన విమర్శలు, పదునైన మాటలు మాట్లాడారంటే, అది కచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసమేననే విషయాన్ని గుర్తెరగాలి. గతంలో మీడియాను పాతరపెడతానని అన్న సందర్భం అందరికీ తెలిసిందే. మొత్తం తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కొందరు మాట్లాడటంతో ఆయన అలా కఠినంగా వ్యవహరించారు. తెలంగాణపై జరిగిన దాడిని చూసి ఆయన స్పందించిన తీరును తెలంగాణ సమాజం కూడా అంగీకరించింది. తెలంగాణను విమర్శిస్తూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపైనే ఆయన పదునైన భాషను ప్రయోగించారు. అలాంటివారినే వ్యంగ్యంగా విమర్శించారు. ఏ వేదికపై ఎలా మాట్లాడాలో కేసీఆర్ కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు. తన ప్రవర్తన, హుందాతనంతో తెలంగాణ కీర్తిని మరింత పెంచిన వ్యక్తి కేసీఆర్. ఆయనతో రేవంత్రెడ్డి పోటీపడాలంటే అదయ్యే పని కాదు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ కఠినంగా మాట్లాడితే.. రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణను సాధించిన వ్యక్తిపైనే నోరు పారేసుకుంటున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది కొండంత అయితే.. రేవంత్రెడ్డి పాత్ర గోరంత కూడా లేదు. అలాంటి వ్యక్తిని చార్లెస్ శోభరాజ్తో పోల్చటం అత్యంత అభ్యంతరకరం. రేవంత్రెడ్డి భాషను మేధావులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఓ బీజేపీ నేత నోరుపారేసుకుంటే, మొదటగా ఖండించింది కేసీఆరే అనే విషయాన్ని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి.
అప్పుడు ఆయన కాంగ్రెస్లో లేరేమో. అందుకే ఆయనకు ఈ విషయం తెలిసుండదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం దిగొచ్చినా ‘కేసీఆర్ గొంతు పిసకటం, బీఆర్ఎస్ను బొందపెట్టడం’ సాధ్యం కాదు. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పోరాటయోధుడాయన. ఆ విషయాన్ని రేవంత్రెడ్డి కూడా గతంలో అంగీకరించారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు చిరస్మరణీయం. ఆధునిక భారతంలో ఇలాంటి కీర్తి కలిగిన ఏకైక నేత కేసీఆర్. కాంగ్రెస్ అధిష్ఠానం తలుచుకుంటే రేవంత్రెడ్డి అనుభవిస్తున్న పదవులు రాత్రికి రాత్రే ఊడిపోతాయి. ఆ తర్వాత రేవంత్రెడ్డి ఎవరంటే? ఎంతమంది గుర్తుపడతారు. అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ప్రజలకు గుర్తున్న పేర్లెన్ని?
కాంగ్రెస్ గెలవటంలో రేవంత్రెడ్డి పాత్ర ఎంతుందో తెలియదు గానీ.. ఇలాగే మాట్లాడితే కచ్చితంగా ప్రజాదరణకు ఆయనే దూరమవుతారు. అదే జరిగితే ఆయన గొంతు పిసకటానికి, ఆ పార్టీలోనే చాలా మంది రెడీగా ఉంటారు. వాస్తవానికి కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్లకే అసెంబ్లీలో ఎలా ఉండాలనే అంశంపై శిక్షణ ఇస్తుంటారు. ముఖ్యమంత్రికి అటువంటి శిక్షణ అవసరం ఉండదు. ఎందుకంటే, ఆ స్థాయి వరకు వచ్చారంటే చాలా నేర్చుకొనే ఉంటారని అందరూ భావిస్తారు. కానీ, రేవంత్రెడ్డి భాష, మాటతీరును చూసిన తర్వాత భవిష్యత్తులో సీఎంలకు కూడా హుందాతనం, అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలన్న దానిపై శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తారేమోనన్న అనుమానం కలుగుతున్నది. ఇప్పటికైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి.. తెలంగాణ ప్రజలకు గట్టి మేలు తలపెట్టే కార్యక్రమాలు చేయాలి. లేదంటే ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండకూడదు’ అని భవిష్యత్తు తరాలకు పాఠాలు చెప్పేందుకు ఉదాహరణగా మిగిలిపోతారు.
-రచ్చ దినేష్
89787 40475