తెలంగాణ ఇప్పుడు ఓ విజయ గాథ. నిన్నటి వెనుకబాటుతనం గత చరిత్ర అయిపోయింది. నేడు తెలంగాణ సమున్నత సగర్వ పతాక విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నది. వరుస విజయాలు, కీర్తికిరీటాలు వరించి వైభవోజ్వల పథంలో మున్ముందుకు సాగుతున్నది. ప్రగతికి మారుపేరుగా, దేశానికే ఆదర్శ రాష్ట్రంగా విలసిల్లుతున్నది. తాజాగా జీఎస్డీపీ లెక్కల్లో అగ్రస్థానంలో నిలవడమే అందుకు సాక్ష్యం. స్వరాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం అందించిన దీక్షాదక్షతల నాయకత్వమే తెలంగాణను నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్ద కాలంలో ఒక్కొక్క రంగం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధిలో ఆకాశపు అంచులు తాకడం మనమంతా కండ్లారా చూశాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అసాధారణమైన రీతిలో 11.97 శాతం వృద్ధి సాధించింది. రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో 10 అత్యుత్తమ రాష్ర్టాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. సుమారు తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, మౌలిక రంగాల్లో సాధించిన అద్భుత ఫలితాల వల్లనే ఇది సాధ్యమైందని ఆర్థికవేత్తలు అంటున్నారు.
అస్తిత్వ పోరాటం ఫలించి స్వరాష్ట్రం సాధించుకున్నప్పుడు ఎట్లుండె తెలంగాణ? కరువులు, వలసల చక్రభ్రమణంలో నలిగిపోయి నీరసించించిది తెలంగాణ. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయి మూలుగుతున్నది తెలంగాణ. తాగేందుకే నీళ్లు లేని గోస. ఇక సాగుకు నీరెక్కడ.. సాగు బాగుపడి రైతన్న బతుకులో చీకట్లు తొలగిపోయేదెప్పుడు? పరాయిపాలన దోపిడి కింద అణగారిన తెలంగాణ తలెత్తుకునేదెప్పుడు..? ఇవీ తెలంగాణను నిత్యం తొలిచివేసిన ప్రశ్నలు. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ఆర్థిక వ్యవస్థకు ఆధారభూతమైన వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.10 వేల నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు మిషన్ కాకతీయ వంటి బృహత్తరమైన పథకంతో వేలాది చెరువులకు మరమ్మతులు నిర్వహించి వాటికి జీవం పోశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారు. మనుషుల దాహాన్ని, మట్టి దాహాన్ని తీర్చి పచ్చని భవితకు బాటలు పరిచారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను అద్వితీయమైన రీతిలో అభివృద్ధి చేశారు.
ఇవాళ జీఎస్డీపీలో మనం శిఖరాగ్రంపై నిలవడానికి దూరదృష్టితో సాధించిన ఈ అభివృద్ధే మూలమని చెప్పకతప్పదు. పంట పెట్టుబడి నుంచి దిగుబడి కొనుగోలు వరకూ అన్ని దశల్లో రైతన్నకు అండగా నిలిచి ముందుకు నడిపించారు. కాళేశ్వర సుజలాలతో మెట్ట మాగాణమై వరి పంటలో తెలంగాణ పంజాబ్ను అధిగమించింది. అటు మౌలికరంగం అభివృద్ధితో, సులభ వాణిజ్య విధానాలతో పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేశారు. భారీ ఐటీ, ఐటీయేతర కంపెనీలు తెలంగాణకు బారులు తీరడమే ఇందుకు నిదర్శనం. పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఉపాధి అవకాశాలు మెరుగై తిరుగు వలసలు మొదలయ్యాయి. విద్యారంగంలో కనీవిని ఎరుగని ప్రగతి సాధించి, వైద్యసేవలను ప్రజల అవసరాల మేరకు విస్తరించి భరోసా కల్పించారు. వీటన్నిటి ఉమ్మడి ఫలితంగానే ఇవాళ తెలంగాణ అభివృద్ధికి నమూనాగా నిలిచింది. ఇదీ కేసీఆర్ పాలనా ముద్ర. ఓడిపోయిన తెలంగాణను గెలిపించిన పాలనా పటిమ. ఇదీ జీఎస్డీపీలో తెలంగాణను నంబర్ వన్గా నిలబెట్టిన సమర్థ నేతృత్వం. ప్రజలు పదేపదే గుర్తు చేసుకుంటున్న స్వర్ణయుగం.