విద్యార్థులు తమ చదువులను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నది రాజ్యాంగాన్ని ధిక్కరించే వ్యవస్థలను తెచ్చుకోవడానికా, కాదు కదా? కానీ, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన నాయకులు రాజ్యాంగస్ఫూర్తిని కాపాడకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
బుల్డోజర్ పాలనను తీసుకువచ్చి రాష్ర్టాన్ని అవిచ్ఛిన్నం చేసుకుందామా, వద్దా అనేది ప్రజలే ఆలోచించాలె.కరీంనగర్ బిడ్డగా, తెలంగాణ శ్రేయోభిలాషిగా, ఒక ప్రజాప్రతినిధిగా… ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బుల్డోజర్ పాలనను అమలు చేస్తామని’ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలను ఈ సందర్భంగా ఖండిస్తున్నా.
బుల్డోజర్ పాలన అక్రమమనీ, రాజ్యాంగ విరుద్ధమనీ అల హాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాథుర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో సత్వర న్యాయం పేరుతో వ్యవస్థలను తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడం వల్లే రాయలసీమ లో ఫ్యాక్షనిజం, తెలంగాణలో నక్సలిజం వంటి హింసాత్మక వ్యవస్థలు పుట్టుకు వచ్చాయని ఆయన అన్నారు. తద్వారా రెండు ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం చోటుచేసుకున్నదో మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు బుల్డోజర్ వ్యవస్థను కొత్తగా దేశంలో, అదేరీతిలో తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలని కమలం నేతలు చేస్తు న్న ప్రయత్నాలు భవిష్యత్తు విపరిణామా లకు నాంది.
సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ భద్రం గా ఉన్నది. అన్నిరంగాల్లో ముందుండి దేశానికి ఆదర్శంగా మారింది. శాంతిభద్ర తల విషయంలో రాజీ పడకుండా ప్రజల కు ఆయన చక్కటి పాలన అందిస్తున్నారు. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టి ఓ వర్గం ఓట్లను కొల్లగొట్టడమే వారి ఉద్దేశమా? అని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక దేశం విషయానికి వస్తే తొమ్మిదేండ్లుగా జీడీపీ పడిపోయింది, ఉద్యోగాల కల్పన లేదు, 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ నాయకులు రైతులను మోసం చేశారు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, దేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీల గురించి ఇక్కడి నాయకులు ఏనాడూ మాట్లాడలేదు. కాబట్టి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆ దిశగా అవలోకనం చేసుకోవాలి.
పార్లమెంటు, రాజ్యసభల్లో బీఆర్ఎస్ సభ్యులు నిలదీస్తే కుంటిసాకులు చెప్తున్నారు. ఏపీలో మాత్రం చట్టాన్ని సవరించి మరీ బీజేపీ అనుకూలంగా వ్యవహరించింది. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపారు. 2014 జూన్ 2కు ముందే చేయాలని మే 30న ఆర్డినెన్స్ తెచ్చి, తర్వాత చట్టం చేయడం తెలంగాణకు బీజేపీ ద్రోహం చేయడం కాదా? ఆంధ్రప్రదేశ్లో 50 ఎమ్మెల్సీ సీట్లను 58కి పెంచలేదా? తెలంగాణలో మాత్రం ఎందుకు పెంచకూడదు? అసలు నరేంద్ర మోదీ, అమిత్ షాకు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. ఇది వారి మాటల్లోనే చాలాసార్లు బహిర్గతమైంది. తల్లిని చంపి, బిడ్డను బయటకు తీశారని మోదీ బాహాటంగా ప్రకటించారు. 370 ఆర్టికల్ రద్దు సమయంలో పార్లమెంట్లో జరిగిన చర్చలో, తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికమని, అది చీకటి బిల్లని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా, తెలంగాణ ప్రజలు వారు చేసిన ద్రోహాన్ని మర్చిపోరు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు అంటున్నప్పటికీ, ఆయా రాష్ట్రా ల్లో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్ప న, ఏ రంగంలోనూ తెలంగాణతో పోల్చ లేం. తెలంగాణ ప్రజలు వారికి ఓటేసి యూ పీ, మధ్యప్రదేశ్ తరహా పాలనను కోరుకోరు. తెలంగాణలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడంపైనే బీజేపీ ఆధారపడింది. తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి పరిపాలనాదక్షత ఉన్న నాయకులను, ఇతర ఏ పార్టీలోను ప్రజలు చూడలేదు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి బీజేపీకి లేదంటే అతిశయోక్తి కాదు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎదగడం అసా ధ్యం. కూల్చే, పేల్చే నాయకులను తెలంగాణ ప్రజలు ఆదరించరు. ప్రజల కోసం పనిచేసే నాయకులను కోరుకుంటారు. రాష్ట్రంలో సుపరిపాల న అందిస్తున్న కేసీఆర్కే తెలంగాణ ప్రజలు మరోసారి పట్టం కడతారనడంలో సందేహం లేదు.
దేశంలో మోదీ ప్రతిష్ఠ కూడా రోజురోజుకూ దిగజారుతున్నది. జేపీ నడ్డా సొంత రాష్ట్రం, 96.50 శాతం హిందువులున్న హిమాచల్ ప్రదేశ్లోనే బీజేపీ ఘోర పరాజయం పాలైంది. దీనర్థం ఇకముందు దేశంలో, రాష్ట్రాల్లో హిందూత్వ, మతతత్వం అనే సెంటిమెంట్ను ప్రజలు ఆదరించరని స్పష్టమవుతున్నది.
రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు నడుస్తున్నదనే విషయం మరోసారి తేటతెల్లమైంది. బండి సంజయ్ నోటి దురుసు వల్ల ఇతర నాయకులు తలెత్తుకోలేకపోతున్నారని రాష్ట్ర బీజేపీ మొత్తుకుంటున్నది. బండి సంజయ్ని బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నది. ఈ సందర్భంగా బండి సంజయ్కి నేను చెప్పేదొక్కటే. ముందు నీ పార్టీ నేతలను చక్కదిద్దుకో… లేకుంటే పార్టీ పదవికి రాజీనామా చెయ్.. అంతేకానీ పచ్చగా వర్ధిల్లుతున్న తెలంగాణలో నిప్పులు పోయాలని చూస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరిస్తున్నా. అయినా బండి సంజయ్ని చూస్తుంటే ఇంట గెలవలేనమ్మ.. రచ్చ గెలుస్తుందా? అనే సామెత గుర్తుకువస్తున్నది.
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్)
-సర్దార్ రవీందర్ సింగ్
94400 73073