‘ఏదైనా మిషన్ విజయవంతం కావాలంటే అందుకు సృజనాత్మక నాయకత్వం అవసరమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభివర్ణించారు. వినూత్న ఆలోచనలు, స్పష్టమైన ప్రణాళిక, వ్యూహరచన, నిబద్ధతతో కూడిన కార్యాచరణతో పనిచేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ సృజనాత్మక నాయకత్వానికి చక్కని ఉదాహరణ. ప్రపంచ వేదికలపై తనదైన శైలి ప్రజెంటేషన్లతో ప్రపంచ దేశాధినేతలను, పారిశ్రామికవేత్తలను మంత్రముగ్ధులను చేస్తున్న ఆయన గ్లోబల్ లీడర్గా ఎదుగుతూ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనాత్మక ఆలోచనలు, నిబద్ధత కలిగిన ఆచరణలే. ఈ కృషి వల్లనే భారత దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరచిన ఐటీ శాఖ మంత్రిగా ఆయన నిలిచారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు వృద్ధి చెందాయి. ద్వితీయశ్రేణి నగరాలైన సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లలో ఐటీ పార్కులను ఏర్పాటుచేయడం కేటీఆర్ దార్శనికతకు నిదర్శనం. కేటీఆర్ మేధో మథనం నుంచి ఆవిర్భవించిన టీఎస్-ఐపాస్ ద్వారా సులభంగా, వేగంగా అనుమతులు లభిస్తుండంతో బహుళజాతి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. గత తొమ్మిదేండ్ల కాలంలో దాదాపు రూ.2,61,732 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించగలిగింది.
మరో రూ.1,54,690 కోట్ల పెట్టుబడులు అనుమతులు పొందాయి. తాజాగా తన అమెరికా, దుబాయ్ పర్యటనల్లో ఓమ్నికాం మీడియా గ్రూప్, మార్స్ గ్రూప్, ఎలైవ్కోర్, ఓ9 వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ విస్తృతంగా చర్చలు జరిపారు. కార్నింగ్ కంపెనీ నుంచి రూ.934 కోట్ల పెట్టుబడులను సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో సంతృప్తి చెందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో రూ.700 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనకూ అంగీకారం తెలిపింది. ప్రపంచ దిగ్గజ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ కంపెనీ రూ.215 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరిస్తామని వెల్లడించింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని బీపీ వరల్డ్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ చక్కగా వివరించడంతో తెలంగాణలో వ్యవసాయానికి చేయూతను ఇచ్చేందుకు శీతల గిడ్డంగుల నిర్మాణంలో మరో రూ.50 కోట్లు పెట్టుబడి పెడతానని ఆ కంపెనీ తెలిపింది.
ఇంతటి భారీ స్థాయిలో పెట్టుబడులు సునాయాసంగా రావు. దాని వెనుకాల కేటీఆర్ అద్భుత నాయకత్వ పటిమ, నేర్పరితనం దాగి ఉన్నాయి. బహుశా ఇన్ని సంవత్సరాలలో కేటీఆర్ చేసినన్ని పర్యటనలు మరే నాయకుడు చేసి ఉండరేమో! ప్రపంచవ్యాప్తంగా ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా అందులో తన ప్రాతినిధ్యం తప్పనిసరి అనే స్థాయికి ఎదిగారు కేటీఆర్.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు, యూరప్, ఆసియా దేశాలకు చెందిన 100 మంది అత్యంత ప్రతిభావంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆసియా లీడర్స్ సీరీస్ మీటింగ్లో పాల్గొనడం, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల ప్రతిష్ఠాత్మక సదస్సుల్లో పాల్గొనే అరుదైన అవకాశాలు కేటీఆర్కు దక్కడం ఆయన ఉన్నతికి నిదర్శనం.
2018లో చెన్నైలో జరిగిన ఒక సదస్సులో దేశాభివృద్ధికి యువశక్తి కీలకమని, వారి ఆకాంక్షలకు ప్రభుత్వాలు ఆసరా అందిస్తే ప్రపంచాన్నే జయించవచ్చని వ్యాఖ్యానించారు. దాన్ని ఆచరణలో సాధించి చూపారు. తొమ్మిదేండ్ల కాలంలో ఐటీ రంగంలో లక్షలాది మంది యువతకు, పారిశ్రామిక రంగంలో 15,74,798 మంది యువతకు ఉద్యోగాలు లభించడం వెనుక ఆయన కృషి ఎంతో ఉన్నది. యువత ఉపాధి పొందడం కాదు, ఉపాధిని సృష్టించాలి అనేది కేటీఆర్ అభిమతం. అందుకే నూతన ఆలోచలనతో వచ్చే యువతను ప్రోత్సహించడానికి టీ-హబ్ ఏర్పాటు చేశారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున రాయితీలు అందిస్తూ రాష్ర్టాన్ని స్టార్టప్లకు అడ్డాగా మార్చారు.
పెట్టుబడులను ఆకర్షించాలంటే పట్టణాల రూపు రేఖలు మార్చాలి. ఈ విషయంలో కేటీఆర్కు స్పష్టమైన విజన్ ఉన్నది. గత తొమ్మిదేండ్లలో హైదరాబాద్ మహా నగరంలో ప్రణాళికాబద్ధంగా జరిగిన అభివృద్ధి ఆయన విజన్ను మనకు స్పష్టం చేస్తుంది. స్కై వేలు, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటి సదుపాయాలను తెలంగాణ ఏర్పడకముందు ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరేమో. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేటీఆర్ నాయకత్వంలో పట్టణ పాలనలో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కేటీఆర్ కృషి వల్ల ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. నగరాల్లో వేగంగా నిర్మాణాలకు అనుమతులిచ్చేలా టీఎస్-బిపాస్ తీసుకువచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
శాస్త్ర, సాంకేతికాభివృద్ధి వల్ల ప్రపంచం శరవేగంగా మారుతున్నది. విద్యావకాశాలు, జీవన ప్రమాణాలు, నగరీకరణ పెరగడంతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆధునిక అభివృద్ధి విధానాలపై సమగ్ర అవగాహన, స్పష్టమైన ఆలోచన కలిగిన కేటీఆర్ లాంటి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం. టీ-హబ్ సృష్టికర్తగా, పెట్టుబడుల సాధకుడిగా, పట్టణాభివృద్ధి ప్రావీణ్యుడిగా, పరిపాలనాదక్షుడిగా, ప్రగతి కాముకుడిగా, నిరంతర శ్రామికుడిగా సంపద సృష్టిలో సంచలనం సృష్టించిన కేటీఆర్ నవ తరానికి రోల్ మోడల్గా నిలిచారు.
(వ్యాసకర్త: వైస్ ఛాన్స్లర్,కాకతీయ యూనివర్సిటీ)
-ప్రొఫెసర్
తాటికొండ రమేష్