వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య వాద వివాదాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ఆయా రాజకీయ పక్షాల దృక్పథం ఏమిటి అనేది ప్రజలకు ఆసక్తి కలిగించే అంశం. సాధారణంగా ప్రతిపక్షాలు పాలకపక్షాన్నీ, దాని వైఫల్యాలనూ, అది ఏ విధంగా ప్రజాహితానికి అనుగుణంగా వ్యవహరించడం లేదో ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తాయి. కాగా, అతికొద్ది సందర్భాలలో మాత్రమే పాలకపక్షం ప్రతిపక్షం మీద ఎదురుదాడికి పూనుకొని ఆ ప్రతిపక్షం ఏ విధంగా ప్రజా వ్యతిరేకమైనదో నిరూపించేందుకు ప్రయత్నిం చే సందర్భాలు వస్తుంటాయి.
ముఖ్యంగా, ఒక పాల క పక్షం గనుక బలమైన ప్రజానుకూల విధానాలను ముందుకు తెచ్చి, వాటికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఒక బహిరంగ చర్చలోకి లాగగలిగితే, అది కచ్చితంగా పాలక పక్షానికి లాభించేదే. మరీ ము ఖ్యంగా, ఆ విధానంపై తన అభిప్రాయం చెప్పక తప్పని స్థితిలో కనుక ప్రతిపక్షం ఉంటే ఇది మరింత నిజం. ఈ ఉపోద్ఘాతం మొత్తం సమకాలీనంగా అమెరికా రాజకీయ ఆర్థిక రంగస్థలంపై జరుగుతోన్న కొన్ని పరిణామాలూ, వాటిని గతంలో మన దేశంలో జరిగిన, చరిత్రను ఒక మలుపు తిప్పగలిగిన కోల్పోయిన అవకాశాలతో పోల్చి చూపడం కోసమే!
ప్రస్తుతం అమెరికా రాజకీయాలు వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి. ఒక పక్కన, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీకి చెందిన దేశాధినేత బైడెన్, మరో పక్కన రిపబ్లికన్ పార్టీ ఇప్పటి నుంచే ప్రజల ఆలోచనలనూ, ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ మీద పైచేయి సాధించేందుకుగాను బైడెన్, ప్రస్తుత సంవత్సరానికి తాము సమర్పించనున్న బడ్జెట్ను సాధనంగా చేసుకుంటున్నాడు. వివిధ కార్యక్రమాలలో దేశమంతా తిరుగుతూ, తాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్ గురించి విస్తృతంగా వివరిస్తున్నాడు. చర్చను లేవదీస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానూ, మరీ ముఖ్యంగా అమెరికాలోనూ ప్రజలను ఆర్థిక సమస్యలు కృంగదీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజానీకం కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అలాగే, వారు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ రాజకీయాలను సైతం మరింత సునిశితంగా గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో బైడెన్ ప్రస్తుతం లేవనెత్తిన బడ్జెట్ తీరుతెన్నుల గురించిన చర్చ కచ్చితంగా అమెరికా ప్రజలకు ప్రాధాన్యత ఉన్న అంశం.
అమెరికా రాజకీయాలలో రిపబ్లికన్ పార్టీ కంటే కూడా కాస్తలో కాస్త మెరుగ్గా డెమోక్రటిక్ పార్టీ ఆర్థిక సంబంధిత వ్యవహారాలలో, ఆ దేశంలో జనసామాన్యానికి, వారి అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంది. కాబట్టి ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన అంశంలో కూడా ఆ పార్టీ చాలా మేరకు అమెరికా జన సామాన్యం ఆకాంక్షలకు దగ్గరగానే ఉండగలదు. ఈ సానుకూల అంశాన్ని ఆసరాగా తీసుకొని బైడెన్ ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీని ఎండగట్టేందుకు, రాజకీయ చర్చలను బడ్జెట్ చుట్టూరా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ అంశంపై ప్రతిస్పందించకుండా ఉండిపోయే లేదా దాటవేసే అవకాశం రిపబ్లికన్ పార్టీకి లేదు. ఎందుచేతనంటే అమెరికా బడ్జెట్ నేడు అరువు తెచ్చుకొన్న సొమ్ములతో నడవాల్సిన స్థితిలో ఉంది. ఇప్పటికే అమెరికా 31 లక్షల కోట్ల డాలర్లపైన అప్పులలో మునిగి తేలుతోంది. గత అనేక సంవత్సరాలుగా పలు దఫాలుగా ప్రతీసారి సరికొత్తగా అప్పు చేయడం కోసం ఆ దేశంలోని కాంగ్రెస్, సెనేట్లలో పాలక ప్రతిపక్షాల మధ్య చర్చలు, ప్రతిష్టంభనలు, బేరసారాలు నడిచాయి. ప్రస్తుతం ఖజానాలో కాసులు అనతికాలంలోనే అడుగంటిపోతోన్న తరుణంలో మరో దఫా కొత్త అప్పులు చేయడం కోసం ఇటువంటి చర్చలే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య నడుస్తున్నాయి. తీసుకొచ్చిన అప్పును ఏ విధంగా ఖర్చు చేయాలనే దాని చుట్టూరానే ఈ చర్చలు నడుస్తున్నాయి. ఈ డబ్బును అంటే బడ్జెట్ డబ్బును ఏయే అవసరాల కోసం ఏయే విధంగా ఖర్చు చేయాలనే అంశంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. ధనవంతులు, శ్వేతజాతీయులకు అనుకూల రాజకీయ పక్షంగా రిపబ్లికన్ పార్టీ పేరుబడింది. కాగా, దీనికి కొంత భిన్నంగా అమెరికా జన సామాన్యం, మధ్యతరగతి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండే రాజకీయ పక్షంగా డెమోక్రటిక్ పార్టీ ఉంది. దీనివల్లే బైడెన్ బడ్జెట్ తీరుతెన్నుల గురించి లేవనెత్తుతోన్న చర్చలోకి లోతుగా వెళ్లేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలు వెనుకాడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రతిపాదిస్తున్న సంక్షేమ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించి ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకుగాను రిపబ్లికన్లు నానా పాట్లు పడుతున్నారు. దీనికోసం మేము కూడా సంక్షేమానికి అనుకూలం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కానీ, ప్రజాక్షేత్రంలో జరిగే చర్చ ద్వారా ఏ రాజకీయ పార్టీ మనసులోని మాట ఏమిటో ప్రజలకు బోధపడగలదు. ఈ నేపథ్యంలో, మనం ఒక్కసారి మన దేశ రాజకీయ చరిత్రలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను పరిశీలించుకోవచ్చు. అవి 1. వీపీ సింగ్ పాలన-మండల్ కమిషన్ నివేదిక అమలు. 2. 1996లో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవిని తీసుకొనేందుకు జ్యోతిబసుకు, ఆయన పార్టీ సీపీఎం అవకాశాన్ని తిరస్కరించడం.
నాడు సీపీఎంకు పార్లమెంట్లో 32 సీట్లు ఉన్నాయి. 540 పైగా సీట్లు ఉన్న పార్లమెంట్లో, కేవలం 32 సీట్లతో ప్రధానమంత్రి స్థానంలో కూర్చుంటే తాము గతంలో వ్యతిరేకించిన వాటినే, అప్పుడు అమలు చేయాల్సి వస్తుందనే వాదనలతో సీపీఎం కేంద్ర నాయకత్వం జ్యోతిబసును ప్రధానిగా చేసే అవకాశాన్ని వదులుకుంది. ఇక్కడ మొదటగా మండల్ కమిషన్ నివేదిక అమలు ద్వారా వీపీ సింగ్ దేశంలోని మితవాద రాజకీయాలపై ఎదురుదాడికి దిగడం, తద్వారా ఆ మితవాద రాజకీయ పక్షాలు అధికారంలోకి రాగలిగే అవకాశాన్ని దెబ్బ తీసే విధంగా, దేశంలో రాజకీయ చర్చను, విభజన రేఖలను సరికొత్త దిశగా మళ్లించగలగడం అనేది గమనించవలసిన విషయం. దేశంలోని ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో 27% మేరకు రిజర్వేషన్ కల్పించే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడం ద్వారా నాడు ప్రధాని వీపీ సింగ్, దేశంలో రాజకీయ చర్చను.. మండల్ వర్సెస్ కమండల్ దిశగా మరల్చగలిగారు. దీనివల్ల దేశంలో రామమందిరం కేంద్రంగా మత ఎజెండా బలపడే బదులుగా, ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రంగా అగ్రకులాలు-బడుగు బలహీన కులాలుగా రాజకీయం బలపడింది. ఫలితంగానే, బీహార్లో ఓబీసీ నేత, లోహియా అనుయాయుడు లాలూప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో అదే లోహియా రాజకీయాల నేత ములాయం సింగ్ యాదవ్ల రాజకీయ శకం మొదలైంది.
మన దేశంలో ప్రత్యేక లక్ష్యమైన కుల విభజనతో పాటుగా, ప్రపంచమంతా సార్వజనీనంగా పరిగణనలో ఉండే సామాజిక విభజన అంశమైన వర్గం కూడా సహజంగానే అస్తిత్వంలో ఉంది. కానీ, మన దేశంలో కమ్యూనిస్టుల వర్గ రాజకీయాలు, చాలా మేరకు ఈ వర్గ విభజన తాలూకూ చైతన్యాన్ని పేద ప్రజానీకంలో పెంపొందించడంలో విఫలమయ్యాయి. దీనికి కారణాలు అనేకానేకం. ఈ కారణాలపై చర్చను కాస్త పక్కన పెడితే ఆ దిశగా… అంటే ప్రజల్లో వర్గ చైతన్యాన్ని పెంచే దిశగా దొరికిన శక్తివంతమైన అవకాశాన్ని జ్యోతిబసుకు ప్రధాని పదవిని స్వయంగా తిరస్కరించటం ద్వారా కమ్యూనిస్టులు కోల్పోయారు. అక్కడ అమెరికాలో బైడెన్ అధ్యక్ష స్థానంలో కూర్చొని తన ప్రత్యర్థులైన రిపబ్లికన్లను జనాలలో ఎండగట్టేందుకు, ప్రస్తుత బడ్జెట్పై చర్చను ముందుకు తేవడాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా తన దేశ సెనేట్, కాంగ్రెస్లలో మైనారిటీగానే ఉన్నాడు. అంటే, ఆయన తాను కోరుకున్న ప్రతీ నిర్ణయాన్ని.. ప్రస్తుతం చర్చకు పెడుతోన్న బడ్జెట్తో సహా అమలులోకి తేగల స్థితిలో లేడు. అయినా, ఆచరణలో ఆ బడ్జెట్ను అమలులోకి తేగలనా లేదా అనే ప్రశ్నను పక్కన పెట్టి ఆయన దానిపై చర్చలోకి రిపబ్లికన్లను లాగుతున్నాడు. అంటే, ఆయన తను అనుకున్న రూపంలోనే బడ్జెట్ను ఆమోదింపజేసుకోగలడా లేదా అనేది పక్కన పెడితే 2024 ఎన్నికల పోరాటానికి తన ప్రత్యర్థి రిపబ్లికన్లను ప్రజా సంక్షేమ వ్యతిరేకులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదే విధమైన బలహీన స్థానంలో ఉండి కూడా ఇదే విధమైన విధాన చర్చకు తెర లేపి దేశీయంగా, ఎవరి ఎజెండా నిజంగా ఏమిటో? ముసుగులు తొలగిస్తే ఏ రాజకీయ పక్షం ఏ వర్గాలకు అనుకూలంగా ఉందో? ప్రజలకు విశదపరిచే అవకాశాన్ని నాడు ప్రధాని పదవిని తిరస్కరించడం ద్వారా మార్కిస్టు పార్టీ కోల్పోయింది. తన ఎజెండాను ఆచరణలోకి తీసుకురాగల అవకాశం నాడు మార్క్సిస్టు పార్టీకి ఎంత ఉందనేది పక్కన పెడితే నాడు అధికార స్థానంలో కూర్చొని, ప్రజలందరి కళ్ల ముందు ఆ ఎజెండాను ముందుకు తేవడం ద్వారా దేశంలో అతి పెద్ద చర్చకు అవకాశం ఏర్పడి ఉండేది. తద్వారా విస్తృత ప్రజానీకంలో సైద్ధాంతిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించగల అవకాశాన్ని, ప్రతిపక్ష స్థానంలో కూర్చొని, దశాబ్దాల పాటు సాధించలేకపోయిన ఆ అవకాశాన్ని కమ్యూనిస్టులు కోల్పోయారు. నాటి ఈ తప్పిదమే, తర్వాతి కాలంలో నేడు మితవాద రాజకీయ పక్షంగా బీజేపీ ఎదుగుదలను సులువు చేసింది.
స్థూలంగా మన దేశంలో ప్రధాన విభజన రేఖలుగా ఉన్న కులం, వర్గాల తాలూకు అవగాహనను, చైతన్యాన్ని విస్తృత ప్రజానీకంలో పెంపొందించడంలో దేశంలోని అభ్యుదయ శక్తులు పాక్షికంగా మాత్రమే ముందడుగు వేసాయి. మండల్ కమిషన్ సిఫారసుల అమలుపై దేశంలో జరిగిన చర్చ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని కులం అనే ఒక పాక్షిక కోణంలో మార్చగలిగింది. కాగా, కమ్యూనిస్టు రాజకీయాల కేంద్ర బిందువైన వర్గ ప్రాతిపదికన కనుక నాడు కమ్యూనిస్టు ప్రధాని, వారి ఎజెండా రూపంలో ఒక సార్వజనీన చర్చను దేశ ప్రజానీకంలో రేకెత్తించగలిగితే అది భవిష్యత్.. అంటే నేటి సమకాలీన రాజకీయాల రూపురేఖలనే భిన్నంగా మార్చగలిగి, నిర్మించగలిగి ఉండేది.
నేడు పలు వామపక్ష, అభ్యుదయ శక్తులు ఇస్తోన్న లాల్, నీల్ నినాదాన్ని నిజం చేయగలిగే స్థాయికి దేశ ప్రజానీకం రాజకీయ చైతన్యం పెరిగి ఉండేది. అలా జరగని కారణంగానే, ఇప్పటికీ దేశ రాజకీయంలో, సామాజిక రంగంలో పాక్షిక సత్యం మాత్రమే అయిన అస్తిత్వ రాజకీయాలు నిర్ణయాత్మక స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఇక్కడ వామపక్షాలకు సంబంధించిన చిన్న విజయాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. యూపీఏ-1 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్షాలు జాతీయ ఉపాధిహామీ పథకం వంటి, గ్రామీణ పేద ప్రజానీకం జీవితంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిన పథకాన్ని సాధించగలిగాయి. కానీ, ఇప్పటికీ మెజారిటీ సామాన్య ప్రజానీకం దృష్టిలో ఆ పథకం సోనియమ్మది, కాంగ్రెస్దే. ప్రజలలో ఈ భావనకు కారణం నాడు ఈ పథకం అమలులోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కావడమే. నాడు జన సామాన్యం దృష్టిలో పెద్దగా లైవ్ులైట్లో లేని యూపీఏ వెలుపలి మద్దతుదారుగా ఉన్న కమ్యూనిస్టులకు, ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన క్రెడిట్ పెద్దగా దక్కలేదు. దేశ ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉండే ఢిల్లీ పీఠం మీద వీలైతే ఏక్ దిన్ కా సుల్తాన్గానైనా కూర్చోగలిగితే ఆ తీరే వేరుగా ఉండేది. ఇదంతా బహుశా ‘ఒకే ఒక్కడు’ సినిమా కథను గుర్తు చేసినా, వాస్తవంలో అత్యంత ఆచరణాత్మకమైన, శక్తివంతమైన సందేశాన్ని జనాలలోకి తీసుకెళ్లగలిగే అవకాశం ఉండేది. ఇక్కడ గమనించవలసిన విషయం దేశ వామపక్ష రాజకీయాలలో కేంద్ర బిందువుగా, బలమైన రాజకీయ పక్షంగా ఉన్న మార్క్సిస్టు పార్టీ పదేపదే ఇటువంటి అతివాద బలహీనతలకు (పార్లమెంటరీ పార్టీగా ఉండి కూడా) లోనవుతూ ఉండడం.
నాడు వాస్తవాలను విస్మరించిన అతివాద రొమాంటిసిజంతో ప్రధాని పదవిని వదులుకోవడం మొదలుకొని.. నేడు 2015 విశాఖపట్నం జాతీయ మహాసభలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కు కూడా దూరంగా ఉండాలంటూ ‘కఠోర నియమ నిష్టల’ తీర్మానం చేసుకొని, ఆ తరువాత ఆచరణలో దానిని అమలు చేయలేక బెంగాల్ ఎన్నికలు మొదలుకొని.. వివిధ సందర్భాలలో సెల్ఫ్ గోల్ చేసుకొన్న విషయం గమనార్హం. అయితే ఈ వ్యాసం లక్ష్యం మార్క్సిస్ట్ పార్టీనో, కమ్యూనిస్టు పార్టీలనో విమర్శించడం కాదు. లేదా ఎప్పుడో జరిగిపోయిన ఒక అంశాన్ని లేవనెత్తి నిర్జీవ చర్చ జరుపటం కూడా ఇక్కడ ఉద్దేశం కాదు.
చేతనైనంత స్థాయిలో, వీలైనంత పరిధిలో, అవగాహనా పరిమితులలో దేశంలో జరిగిన, జరుగుతున్న రాజకీయాల తాలూకు కొన్ని చిక్కుముడులను విప్పి, తద్వారా మెరుగైన చైతన్యంతో, అవగాహనతో ముందుకు దారులను వెతుక్కునేందుకు, వేసుకునేందుకు
ఇదొక ప్రయత్నం.
గతంలో కోల్పోయిన ఈ అవకాశాల తాలూకు వెలితిల్ని పూడ్చుకొని, ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యాన్ని అధిగమించేందుకు కావాల్సింది సరికొత్త ఆర్థిక నమూనా లేదా ప్రత్యామ్నాయం. కార్పొరేట్ల కేంద్రంగా కాక.. ప్రజలూ, వారి ప్రయోజనాలు కేంద్రంగా ప్రస్తుతం ఒక సైద్ధాంతిక అఫెన్సివ్ కావాలి. ఈ అఫెన్సివ్కు లేదా ఎదురుదాడికి అనుకూల స్థితి నేడు వేగంగా ఏర్పడుతోంది.
ఒక పక్కన ప్రపంచం నలుమూలల నుంచీ కమ్ముకొస్తున్న ఆర్థికమాంద్యం కారుమబ్బులతో పాటు, దేశీయంగా ఈ ఆర్థిక ఉపద్రవానికి, అగ్గికి ఆజ్యంలా ధనవంతులు, కార్పొరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వ విధానాలు తోడయ్యాయి. ఫలితంగానే నేడు దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు కారుచిచ్చులా వ్యాపిస్తున్నాయి. ఈ సమస్యల తాలూకు సెగ పెరిగిన కొద్దీ దేశంలోని సామాన్య జనం, మధ్య తరగతి కూడా.. తమ నరాల్లోకి బీజేపీ ఎక్కిస్తోన్న రకరకాల మత్తుల నుంచి వేగంగా మేలుకోక, స్పృహలోకి రాక తప్పని స్థితిలో పడుతున్నారు.
మేలుకుంటున్న, మత్తు వీడుతున్న జన సామాన్యం కోసం ఈ రోజు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల నమూనాలు కావాలి. అది, తెలంగాణ మాడల్ కావొచ్చు లేదా కేరళ మాడల్ కావొచ్చు. దాని పేరు ఏదైనా ఈ ప్రత్యామ్నాయ నమూనాల దారి మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో, ప్రజల ఆకాంక్షల పరిపూర్తి బాటలో, నిజమైన రాజకీయ ఆర్థిక పరిణతి, ప్రజాస్వామ్యం దిశగా నడుపగలదు. ఈ నమూనాను అందుకోగలిగే మనఃస్థితినీ, అవసరాన్ని కూడా నేడు వాస్తవ పరిస్థితులూ, బీజేపీ విధానాలే సామాన్యుడికి కల్పిస్తున్నాయి. కారల్ మార్క్స్ చెప్పినట్టుగా -సామాజిక మార్పుకు మంత్రసాని పాత్రను పోషించడమే- నేటి అభ్యుదయ, ప్రజానుకూల శక్తుల పాత్ర. అటువంటి శక్తులు మాత్రమే నేడు ఈ దేశానికి ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు’లా ఉండగలవు.
దేశంలోని ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో 27% మేరకు రిజర్వేషన్ కల్పించే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడం ద్వారా నాడు ప్రధాని వీపీ సింగ్, దేశంలో రాజకీయ చర్చను.. మండల్ వర్సెస్ కమండల్ దిశగా మరల్చగలిగారు. దీనివల్ల దేశంలో రామమందిరం కేంద్రంగా మత ఎజెండా బలపడే బదులుగా, ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రంగా అగ్రకులాలు-బడుగు బలహీన కులాలుగా రాజకీయం బలపడింది.
– డి.పాపారావు
98661 79615