2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక బహుజన రాజ్యాధికార ఆశాదీపం. ఐపీఎస్
అధికారిగా ఏడేండ్ల పదవీ కాలం ఉన్నా, వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ను కాదనుకొని, తన సిద్ధాంతాలకనుగుణంగా బీఎస్పీలో చేరి తన పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.ఐపీఎస్గా ఆర్ఎస్పీ పలు హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అనేక శాఖల్లో పని చేశారు. తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయన సాధించిన విజయాలను ప్రపంచం చూసింది.
విద్యార్థులను ఆయన తీర్చిదిద్దిన తీరు ప్రశంసలు అందుకున్నది. ఇ-ప్లస్ క్లబ్లు, వాయిస్ ఫర్ గర్ల్స్, హార్స్ రైడింగ్, ఫిల్మ్ మేకింగ్, సంగీతం, డ్యాన్స్, వాటర్ స్పోర్ట్స్, పర్వతారోహణ, ఇగ్నిటర్, డబ్ల్యూ ప్లస్ క్లబ్లు, ఇంపాక్ట్ ఇలా అనేక వినూత్న కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మాలావత్ పూర్ణను ప్రోత్సహించారు. ఆయన హయాంలో ఎంతోమంది బహుజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లారు.
రాజకీయాల్లోకి రాగానే ఆర్ఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించారు. మారుమూల పల్లెల్లో పర్యటించారు. పేదలు, విద్యార్థులు, ప్రతి సామాజికవర్గాన్ని కలుస్తూ వారి కష్టసుఖాలు, ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాయావతి సైతం ఆర్ఎస్పీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రిజర్వ్డ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిర్పూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తుకు పార్టీ స్టేట్ చీఫ్గా ఆర్ఎస్పీ తీవ్రంగా ప్రయత్నించారు. కేసీఆర్తో భేటీ అయి చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ సీట్లను బీఎస్పీకి కేటాయించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే పొత్తుకు మాయావతి సమ్మతించలేదు. దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్ఎస్పీ తీవ్ర వేదనకు గురైనట్టు తెలుస్తున్నది. తన నిర్ణయాలకు, రాజకీయ వ్యూహాలకు గౌరవం లేని చోట ఉండలేనని భావించినట్టు సమాచారం. అంతేకాకుండా బీజేపీ ఒత్తిడితోనే మాయావతి ఈ పొత్తును కాదన్నారని ఆర్ఎస్పీ బహిరంగంగానే చెప్పా రు. అందుకే బీఆర్ఎస్లో చేరినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ఆయ న నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వీఆర్ఎస్ తీసుకున్న సమయంలో ఆర్ఎస్పీ ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో తన శేష జీవితమంతా తన స్ఫూర్తి ప్రదాతలైన జ్యోతిరావు ఫూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరాంలు చూపిన మార్గంలోనే నడిచి, పేదలకు, పీడితులకు అండగా ఉంటానని ప్రకటించారు. తద్వారా భావితరాలను ఒక కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానన్నారు. అయితే, రాజకీయాల్లోకి రాకముందే ఆయన తన పొలిటికల్ బేస్ను తయారు చేసేందుకు ప్రయత్నించారు. ‘స్వేరో’ ఏర్పాటుచేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. బహుజనుల్లో మార్పు రావాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్మారు. తాను ఏర్పాటుచేసిన ‘స్వేరో’ తనకు రాజకీయంగా అండగా ఉంటుందని భావించారు. దాంట్లో ఆయన అంచనాలు కొంతమేర నిజమైనా… రాజకీయంగా మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయారు.
ఆర్ఎస్పీ రాజకీయాల్లోకి వచ్చాక కేసీఆర్ను టార్గెట్ చేసుకునే విమర్శలు చేశారు. కేసీఆర్ నియంత అని, ఆయనను గద్దె దించకుంటే తెలంగాణకు భద్రత ఉండదని అనేక సార్లు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు.. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్లో చేరినట్టు ఆర్ఎస్పీ ప్రకటించారు. ‘బహుజనులు ప్రతిచోటా మహనీయుని సిద్ధాంతాన్ని తమ హృదయాల్లో పదిలంగా దాచుకుంటారు. తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు’ అని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
అయితే, ఆర్ఎస్పీ ఎవరిని తీవ్రంగా విమర్శించారో, ఆయన పంచనే చేరారని ఆయన వ్యతిరేకులు విమర్శల పర్వం మొదలుపెట్టారు. అయితే ఒక వ్యక్తి సిద్ధాంతాలు, పొలిటికల్ స్ట్రాటజీని అర్థం చేసుకోకుండా.. గుడ్డిగా విమర్శించడం ఎంతవరకు సమంజసమో విమర్శకులు ఆలోచించాలి. అధికారం కావాలనుకుంటే ఆయన కేంద్ర, రాష్ర్టాల్లోని అధికార పార్టీల్లో చేరే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ఆఫర్ చేశామని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగానే చెప్పారు.
ఈ విషయాన్ని ఆర్ఎస్పీ కూడా ధ్రువీకరించారు. కానీ, ఆయన అధికారం కోసం కాకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకువెళ్తున్నారు. రాజకీయాల్లో అడుగు వేశాకే అది తప్పో.. ఒప్పో అనే విషయం తెలుస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం అనేది ఎప్పటికీ ఉండదు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ గతంలో బీజేపీకి సపోర్ట్ చేసిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్తో కలిసి నడిచిన సమయమూ ఉన్నది. అందుకే ఒకే దగ్గర, ఒకే పార్టీలో గడ్డ కట్టుకొని ఉండటం కంటే.. రాజకీయ లక్ష్య సాధనకు ఆర్ఎస్పీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారో బహుజనవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా తనకు స్వాతంత్య్రం లేని పార్టీలో.. తన వ్యూహాలను అర్థం చేసుకోలేని నాయకత్వం వద్ద పనిచేయడం వ్యర్థమని ఆర్ఎస్పీ భావిస్తుండవచ్చు. కొంతకాలం గడిచాక.. ఆయన వేసిన అడుగు సరైందో, కాదో విశ్లేషిస్తే బాగుంటుంది.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
ఫిరోజ్ఖాన్
96404 66464