దేశంలోనే తొలిసారిగా వసతి గృహాల్లో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే అత్యధికంగా 26 శాతం మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచింది. దీంతో 3214 ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న 8,59, 000 మందికి పైగా పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మరింత నాణ్యమైన భోజనం, వసతి సదుపాయం ఏర్పడనున్నది.
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య ద్వారానే పేదరికాన్ని జయించాలని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యారంగ అభిదృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో వసతి గృహాలంటే ఉడికీ ఉడకని పురుగుల బువ్వ, నీళ్ల చారుతో విద్యార్థులు అర్ధాకలితో పస్తులుండేవారు. అదిగాక జిల్లాకు ఒకటి, అరా మాత్రమే ఉండేవి. ఫలితంగా అనేక మంది నిరుపేదలు ఆర్థిక స్తోమత లేక విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం 123 గురుకులాలే అందుబాటులో ఉండగా నూతనంగా సుమారు 900కు పైగా గురుకులాల ను ఏర్పాటుచేసుకొని వాటి సంఖ్యను 1,011కు పెంచుకోవడం జరిగింది.
ఇతర వసతిగృహాల సంఖ్య కూడా పెరిగింది. తద్వారా ఏటా 9,40,000 మందికి పైగా విద్యార్థులు నాణ్యమైన విద్యను ఉచితంగా పొందుతున్నారు. గురుకులాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది. సన్నబియ్యం, గుడ్డు, మాంసం వంటి పౌష్టికాహారం, సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నది. గురుకులాల్లో చదివే విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులతో పోటీపడుతున్నారు. NEET, IIT, JEE వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నా రు. కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో కూడా గురుకుల విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. మారుమూల గ్రామంలో వెనుకబడిన గిరిజన కుటుంబంలో పుట్టి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు గురుకులాల్లో చదువంటేనే పిల్లలతో పాటు తల్లిదండ్రులు భయపడిపోయి విముఖత వ్యక్తం చేసే స్థితి నుంచి నేడు సీటు కోసం పోటీపడే పరిస్థితి వచ్చిందంటే ఆ ఘనత ముఖ్యంగా కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.
మన ఊరు – మన బడి: ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల విద్య అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. అందుకే ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖాభివృద్ధితో పాటు అందరికీ ఆంగ్ల విద్య సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే 19,40,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు సుమారు రూ.7,289 కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని మూడేండ్లలో అమలుచేయనున్నారు. డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, అదనపు గదుల నిర్మాణం, ఇతర మరమ్మతులతో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందు కు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.
మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ గురుకులాలు: ఇం ర్మీడియెట్ తర్వాత బాలికల్లో చాలామంది పేదరికం వల్ల చదువు మధ్యలో వదిలేస్తున్నారు. దీన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి డిగ్రీ విద్యతో మహిళా రెసిడెన్షియల్ గురుకుల విద్యను 9 కోర్సులతో అందుబాటులోకి తెచ్చింది. మహిళా డిగ్రీ గురుకులా ల ఏర్పాటుతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గి మహిళలు ఉద్యోగార్థులుగా రాణిస్తున్నారు. మహిళా విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలను మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభు త్వం 100 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. తద్వారా మహిళలకు ఉన్నత విద్య అవకాశం కల్పించింది.
అంబేద్కర్ ఫూలే
ఓవర్సీస్ స్కాలర్షిప్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశీ విద్యావకాశాన్ని కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దీనివల్ల ఆర్థిక వెనుకబాటుతనంతో పేద వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న విదేశీ విద్య సులభతరమైంది.
మెడికల్ కాలేజీలు: దేశంలోని బీజేపీ ప్రభు త్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి తెలంగాణకు ఒకటైనా కేటాయించకుండా వివక్ష చూపినప్పటికీ వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం లభించనున్నది.
ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే.. మెడిక ల్, నర్సింగ్ కళాశాలలు, గిరిజన యూనివర్సిటీ, నవోదయ లాంటి జాతీయ విద్యాసంస్థల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్షను కనబరు స్తూ కేంద్రం విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది.
దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో నిత్యావసర ధరలు పెరుగుతుండగా, దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల మెస్, కాస్మొటిక్ చార్జీలను ఒక్కసారిగా 26 శాతం (3-7వ తరగతి రూ.950 నుంచి రూ.1200కు, 8-10వ తరగతి రూ.1100 నుంచి రూ.1400, ఇంటర్ – పీజీ రూ.1400 నుంచి రూ.1875 చొప్పున) పెంచింది. దీనిపట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధిరంగాల్లో భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తు న్న ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యార్థిలోకం, యువత రుణపడి ఉంటుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నాయకులు, కాకతీయ యూనివర్సిటీ)
కొనుకటి ప్రశాంత్
80084 92700