వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన ఆర్థిక నమూనానే ఆచరించింది. రాష్ట్ర జీఎస్డీపీలో 23.5 శాతం మాత్రమే అప్పులు చేసిందని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది కదా! చేసిన అప్పులతో, తెలంగాణ పడిపోతే చూసి పగలబడి నవ్వాలనుకున్న వాళ్లందరూ ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి కోసమే ప్రతిపైసా వెచ్చించింది.
Congress | తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం పడ్డ పాట్లపైన హస్తం పార్టీ పసలేని దాడి చేసి అభాసుపాలైంది. సొరంగం తవ్వి పాతాళంలో పూడ్చిపెట్టిన లెక్కల పత్రాలను పట్టుకొచ్చినట్టు ఫోజు కొట్టి చివరికి అందరికీ తెలిసిన అంకెలనే మళ్లీ సభలో చర్చకు పెట్టి తికమకపడ్డది.
ప్రతిపాదనలకు, ఖర్చుకు పొత్తే కానరాని అశాస్త్రీయ ఆదాయ, వ్యయాల అంచనాలతో కూడిన నాటి పద్దులు పది జిల్లాలకు దాహాన్ని, దరిద్రాన్నే మిగిల్చాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ నేల నొప్పులు తెలిసిన కేసీఆర్, వాటిని శాశ్వతంగా నయం చేయడానికి బడ్జెట్కు బుద్ధిని, పద్దులకు ప్రాణాన్ని అద్ది రాష్ట్రం వెలుగులకు దారిపరిచారు. భద్రమైన భవిష్యత్తు కోసం, సకల రంగాల్లో తిరుగులేని పురోభివృద్ధి కోసం పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సాహసోపేత అడుగులు వేసింది. రాష్ట్ర సాధన ఉద్యమం లాగే, ప్రగతి కోసం పోరులో గులాబీ సర్కార్ పరుగులు తీసింది. తొలి అడుగులోనే ఎన్నో అడ్డంకులు, సహకరించని కేంద్ర సర్కార్, బాగుపడితే కడుపు మండే చంద్రబాబు ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రం కాళ్లలో కట్టెలు పెడుతుంటే, ప్రగతి కోసం ప్రతి కదలికా ప్రసవించినంత కష్టమైంది కదా!
ప్రభుత్వం కుదుటపడకముందే కూల్చే కుట్రలను ఎదుర్కొంటూనే, విభజన హామీలను, నీటి వాటా లెక్కలను తేల్చకుండా తమాషా చూసే కేంద్ర సర్కార్ను నిలదీస్తూనే.. ఎంత నిబ్బరంగా తెలంగాణను కేసీఆర్ నడిపించారో ప్రజలకు తెలుసు. పదేండ్ల కిందట ఏముండెనో, ఎట్లుండెనో, నేడు ఏడున్నమో అంకెల్లో కాదు.. గ్రామాల్లో వెతికితే అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని జారవిడుచుకోవడం వెనుక కేసీఆర్ మీద వ్యతిరేకత అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నేతల కండ్లకు పది రోజుల్లోనే పచ్చ కామెర్లు సోకినట్టే. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, ఏమరుపాటుతనం గులాబీ పార్టీని ఎడమవైపునకు నెట్టేసిందే కానీ, పాలనలో పాపాల వల్ల కాదు. కాంగ్రెస్ ఓడిపోయిన మూడు రాష్ర్టాల్లో ఎన్ని పాపపు ప్రభుత్వ చర్యలు కారణమో ఢిల్లీ పార్టీ పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. స్వల్ప తేడాతో అధికార పీఠమెక్కగానే కుటిల ఆర్థికవేత్తలా, అంకెలకు విషం పూసి, కేసీఆర్ కృషిని కాలరాయాలనే కపటత్వం వికటిస్తుందే కానీ, హస్తం పార్టీ సర్కారుకు విలువనివ్వదు.
అసలు దశాబ్దాల పాటు దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను పాతాళంలోకి అడుగులు వేయించిన కాంగ్రెస్ పార్టీకి, పరిపాలనలో ఓనమాలు ఎరుగని రేవంత్రెడ్డికి సుస్థిర, సమ్మిళిత పురోగతికి అనుసరించే ఆర్థిక నమూనా అర్థమవుతుందా? ధ్వంసమైన తెలంగాణ భవితకు బలమైన, భద్రమైన పునాదులు నిర్మించేందుకు అప్పులూ అవసరమనే సత్యం మెడ మీద తల కలిగిన ప్రతి మనిషికీ తెలియనిదేం కాదు కదా! అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసనసభ సమావేశాల్లో కొత్త సర్కార్ కార్యాచరణను ప్రకటించాలే కానీ, పాత ప్రభుత్వంపై అరిచి, అరిచి అరిగిపోయిన నిందలే మళ్లీ వినిపించడం వివేకవంతులైన పాలకులు చేసే పనేనా?
వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన ఆర్థిక నమూనానే ఆచరించింది. రాష్ట్ర జీఎస్డీపీలో 23.5 శాతం మాత్రమే అప్పులు చేసిందని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది కదా! చేసిన అప్పులతో, తెలంగాణ పడిపోతే చూసి పగలబడి నవ్వాలనుకున్న వాళ్లందరూ ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి కోసమే ప్రతిపైసా వెచ్చించింది. పెట్టే ప్రతి రూపాయి పది పుట్టించేదిగా ఉండాలనే శాస్త్రీయ ఆర్థిక దృక్పథంతో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఖర్చుచేసింది. ఆదిలోనే తెలంగాణ బెదిరిపోకుండా, ధైర్యంగా విపణి ఆర్థికరంగంలో విజయ గీతం ఆలపించేందుకు అవసరమైన అన్ని విధానాలు అమలుచేసింది.
ఉద్యమ జీవితం, పాలనా అనుభవం, తెలంగాణ నలుచెరుగులా అవసరాలపై తిరుగులేని అవగాహన కలిగిన కేసీఆర్.. ఏం చేస్తే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందో కచ్చితమైన అంచనాలతోనే పాలన సాగించారు. దానివల్లనే ఎండి, వలవలా ఏడ్చిన నిన్నటి తెలంగాణ.. పదేండ్లలోనే పంటల బాంఢాగారంగా మారింది. తెలంగాణ ఏర్పడేనాటికి 68.17 లక్షల టన్నులున్న ఆహారధాన్యాల ఉత్పత్తి.. 2021-22 నాటికి 2.02 కోట్ల టన్నులకు పెరగడం వెనుక ఆరోగ్యకర ఆర్థిక నమూనానే కదా అక్కరకొచ్చింది. బీడు పడ్డ భూముల అడ్డాగా మారిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలోకి 2019 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్యకాలంలో 49.44 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖ లెక్కలే తేల్చిచెప్పా యి. తెలంగాణ అప్పులతో ఏం సాధించిందో ఈ లెక్కలను చూస్తే ఎవ్వరికైనా అర్థం కాకుండా ఉండదు కదా! పదేండ్లలో 1.20 లక్షల కోట్ల విలువ చేసే 6.70 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతాంగం నుంచి బీఆర్ఎస్ సర్కార్ సేకరించిందంటే, అప్పులు అన్నదాత వెలుగుల కోసం ప్రమిదలా ఉపయోపడ్డాయనే సత్యం దాచేస్తే దాగుతుందా? తలసరి ఆదాయం, జీఎస్డీపీలు గాలికి పెరగవనే సంగతి రాజకీయపార్టీల నేతలకు తెలియనిదేం కాదు.
నిన్నటి ప్రజా ప్రభుత్వంపై నిందలేసి, హామీల అమలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే కాంగ్రెస్ సర్కార్ పన్నాగం పాలనా క్రూరత్వ మే అవుతుంది. కేంద్ర సర్కార్ దోపిడీ పన్నుల నమూనా, రాష్ర్టాలను ఆర్థికంగా బలహీనపరిచి లోబరుచుకోవాలనే ఫెడరలిజంపై ఫ్యాక్షనిజం, పెద్ద నోట్ల రద్దు, కరోనా ఇలా ఎన్నో గండాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొని, సాధించుకున్న స్వరాష్ర్టాన్ని సమున్నత స్థాయికి చేర్చింది. పదేండ్లలోనే ఎన్ని సమకూర్చుకుంది తెలంగాణ? కడుపులో అగ్గి ఉన్న నేత, నేలను తల్లిలా ప్రేమించే ముఖ్యమంత్రి పట్టుబడితే పడిలేచిన కెరటంలా ఎలా ఎదగవచ్చో మన రాష్ట్రమే సాక్ష్యం. తొమ్మిదికిపైగా భారీ సాగునీటి ప్రాజెక్టులు, 640 ఎత్తిపోతల పథకాలు, మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువుల పునరుద్ధరణ, లక్ష కిలోమీటర్లకు పైగా రహదారులు, దాదాపు 6 వేల దవాఖానలు, వెయ్యికి పైగా గురుకులాలు, అద్భుత సచివాలయం, నూతన జిల్లాలు, అందమైన కలెక్టరేట్లు, నూతన మండలాలు, గ్రామ పంచాయతీలు ఇలా ఎంతో సంపదను సొం తం చేసుకున్నది మన తెలంగాణ.
కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్ తదితర ముఖ్యమంత్రులు, ఎందరో కేంద్రమంత్రులు, కార్యదర్శుల ప్రశంసలు తెలంగాణ అందుకున్నది. వివిధ రంగాల నిపుణుల ప్రశంసలతో పాటు కేంద్ర సర్కార్ అవార్డులను తెలంగాణ రాష్ట్రం దక్కించుకున్నది. చూడగలిగే కండ్లుంటే మన హైదరాబాద్ విపణి పెట్టుబడులకు విశ్వసనీయ విశ్వనగరంగా ఎదిగిన తీరు కనపడకుండా ఉండదు కదా? రాష్ట్ర అవసరాలు, భవిష్యత్తు తరాల పురోభివృద్ధికి పునాదులు వేసేందుకు శాస్త్రీయ దృక్పథంతో పరిపాలన సాగించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
నిజానికి అందరి అప్పుల మర్మం విప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత శాస్త్రీయ రుణ సేకరణ విధానం అనుసరించిందో అందరికీ అర్థమవుతుంది. పైన పేర్కొన్నట్టు.. తెలంగాణ జీఎస్డీపీలో 23.5 శాతం మాత్రమే రుణాలు చేసిందని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. కానీ ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో 40 శాతం మాత్రమే అప్పులు చేసే పరిమితిని దాటి మోదీ సర్కార్ 57 శాతం అప్పులు చేసింది. అలాగే 2020-21 రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం స్థూల ద్రవ్యలోటు 3 శాతం కంటే ఎక్కువగా ఉండి, జీఎస్డీపీలో అప్పుల శాతం భారీగా పెరిగి, అస్తవ్యస్థ ఆర్థికవ్యవస్థలుగా మారిన రాష్ర్టాల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలే స్థానం దక్కించుకున్నాయి. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల ఆర్థికవ్యవస్థలు అస్తవ్యస్థమని ఆర్బీఐ నివేదికే బట్టబయలు చేసింది. దేశాన్ని, పాలిత రాష్ర్టాలను దివాళా తీయించిన ఘనులు కాంగ్రెస్, బీజేపీ నేతలే అని అధికారిక ఆర్థిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ముంచే పాలనకు అంబాసిడర్లైన హస్తం, కమలం పార్టీలు ప్రగతి విప్లవం సాధించిన బీఆర్ఎస్పై నోరు పారేసుకోవడం విడ్డూరం. నీళ్లలో నిప్పులు కుమ్మరించాలని చూసి కాంగ్రెస్ సర్కారే నవ్వుల పాలైంది.
వాస్తవాలను కబేళాకు తరలించాలనుకునే వారంతా పొలిటికల్ పరందామయ్యలవుతారే కానీ, నాయకులనిపించుకోరు. దొరల పాలన అని నిత్యం అబద్ధాలు ఆడిపోసుకున్న రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తూ పటేల్ గిరి పాలనకు శ్రీకారం చుట్టారు. చైతన్యవంతమైన తెలంగాణ తిరగబడి తీరుతుంది. తిరిగి ప్రగతి విప్లవాన్ని ఆహ్వానిస్తుంది.
ధ్వంసమైన, దారిలేక తలో దిక్కూ చకోర పక్షుల్లా వలసకూలీలై చెదిరిపోయిన తెలంగాణను మళ్లీ గ్రామాలకు తిరిగి రప్పించడానికి జరిగిన ప్రగతి విప్లవంపై నిందలేసి నవ్వులపాలయ్యారు. గ్యారెంటీల గండాన్ని వాయిదా వేసుకోవడానికో, మెడకు వేలాడుతున్న హామీల పాము కాటు ఆపద నుంచి తాత్కాలిక ఊరట పొందేందుకో గానీ, కాంగ్రెస్ సర్కార్ సభలో మసి హస్తాలతో చర్చకు పెట్టిన శ్వేతపత్రం చివరికి సోదిపత్రంలా మారింది. నిజానికి రాష్ట్ర ఏర్పాటు నాటికి వ్యవసాయంతో పాటు ఏ రంగంలోనూ బతుకుకు కనీస భరోసా ఇచ్చే విధానాలు లేవు. పక్షవాత పాలన వల్ల బడ్జెట్ అంకెల్లో మిగులు, బతుకుల్లో దిగులు తప్ప తెలంగాణలో మిగిలిందేమీ లేదు.
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
(రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)