విద్యారంగంలో అద్భుతమైన అభివృద్ధి. ఏటా గొప్ప గొప్ప ఫలితాలు. 100 శాతం పాసయిన బడులెన్నో. ఇది మంచి విషయమే. కానీ,ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లలకు వస్తున్న మార్కులతో, పర్సంటేజీలతో సంతృప్తి చెందటం లేదు. 9.9 వచ్చినా తల్లిదండ్రులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ ఏడాది ఇలాంటి అసంతృప్తికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. పరీక్షల్లో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిలయ్యామని, తక్కువ మార్కుల వల్ల తల్లిదండ్రులు మందలించారని… ఇలా కారణమేదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే.
కొడుకుకు 10వ తరగతి ఫలితాలలో 9.5 వచ్చినా, తల్లి మొహంలో విచారం చూసి ధైర్యం చె ప్పి, అయినా మంచి మార్కులే వచ్చా యి కదా? అని అంటే.. ఏం మంచి, మా చిన్నప్పటి చదువులు కాదు కదా? 10/10 రావాలని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది. అంతేకాదు, మా బంధువులలో చాలామందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయని కుమిలి కుమిలి బాధపడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. చివరి నిమిషంలో కుటుంబసభ్యులు చూడటంతో ప్రాణం నిలబడింది. ఇదొక ఉదాహరణ మాత్రమే.
బంధువులతో గొప్పగా చెప్పుకోవడానికో, భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు రావేమోనన్న బెంగతోనో మార్కులతోనే పరిగెత్తేలా పిల్లలపై ఒత్తిడి తెస్తారు తల్లిదండ్రులు. తీరా కొన్ని మార్కులు తక్కువొస్తే పరువు పోయినట్టు ఫీలవుతున్నారు. చివరికి తల్లిదండ్రులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో, ఆ ఒత్తిడి పిల్లలపై పెట్టి వాళ్లు ప్రాణాలు తీసుకోవడానికో పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో మార్కులు ముఖ్యం. కానీ, అవి, ఆ పసివాళ్లు బతికి ఉన్నపుడే కదా! వారి ప్రాణ మే లేకపోతే ఆ మార్కులు, ఈ గొప్పలుండి ఏం ప్రయోజనం?
లోపం ఎక్కడున్నది?: మార్కులే జీవితమనుకునే తల్లిదండ్రులు మొదలు.. ఒకటీ, ఒకటీ, ఒకటీ అంటూ ప్రచారాలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థల దాక అందరికీ ఈ పాపంలో భాగం ఉన్నది. మార్కులొక్కటే జీవితం కాదని చెప్పాల్సిన విద్యాసంస్థలను నేడు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఒకవేళ విద్యాసంస్థలు అలా చెప్తే వాటిని దూరంపెట్టే తల్లిదండ్రులనూ మనం చూడవచ్చు. సమాజంలో గొప్పలు చెప్పుకోవడం, మా వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి. వాడు అక్క డ సెటిలయ్యాడు. వాడికింత ప్యాకేజీ అని గొప్పగా బంధువుల దగ్గర చెప్పుకొనే తల్లిదండ్రులను చూసి ఓహో మా వాడు కూడా అలాగే ఉండాలి, మేము కూడా అలానే చెప్పుకోవాలని ఆరాటపడే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి.
పిల్లల భవిష్యత్ గురించి కలలు కన డం తప్పుకాదు. వారిని ఆ మార్గం గుం డా నడిపించడం కూడా తప్పు కాదు. కానీ మార్కులు తక్కువ వస్తేనో, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ అయితేనో ఏదో ఘోరం జరిగిపోయినట్టు దిగులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవడం మాత్రం ఘోరం. పిల్లలకు ధైర్యాన్నివ్వాల్సింది, వారిని అర్థం చేసుకోవలసింది మొదట తల్లిదండ్రులే. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా మానసికంగా వారికి తోడుగా నిలవాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్లీ చదువచ్చు. మళ్లీ పరీక్ష రాయవచ్చు. కానీ, ప్రాణం తీసుకుంటే ఆ మనిషి మళ్లీ కనపడతాడా? చావొక్కటే మార్గం కాదు కదా?.
నేటి విద్యార్థుల్లో చాలామందికి మొదటిసారి విజయం సాధించకపోతే జీవితం ఇక వృథా అనే ఆలోచనా విధా నం, ఇక జీవితంలో అంతా కోల్పోయినట్టే అనే ఆలోచనలు వస్తున్నాయి. మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసే ఓపిక కానీ, ఫెయిల్ అయితే ఏమవుతుందనే ఆలోచన రావడం లేదు.
జీవితంలో సాధించడానికి మార్కులొక్కటే ప్రామాణికం కాదని ఈ పసిపిల్లలకు చెప్పడంలో మనమంతా ఫెయిలవుతున్నాం. ఫెయిలైతే మళ్లీ రాసి పాస్ కావచ్చని ధైర్యం చెప్పడంలో మనం ఫెయిలవుతున్నాం. తల్లిదండ్రులుగా మంచి జీవితం కోసం కార్పొరేట్ కాలేజీలోనో, స్కూల్లోనే చేర్పించి, ఆనందపడి, మార్కు లు తక్కువ వచ్చాయని, లక్షల ఫీజు వృథా అయిందని బాధపడి పిల్లలపై ఒత్తిడి పెంచి వాళ్లకు అదే బంగారు భవిష్యత్తును అందించడంలో ఫెయిలవుతున్నాం.
పాఠశాలలలో టీచర్లు ఒక మార్కు తక్కువ వేసినా.. వాడికి మార్కులు ఎందుకు తక్కువ వేశారని తల్లిదండ్రులు టీచర్లను నిలదీస్తారు. పక్కపిల్లలతో పోల్చిచూస్తారు. పిల్లవాడి తెలివితేటలు, విజ్ఞా నం వారికి అనవసరం. మార్కులు మాత్రమే వారికి కావాలి. కార్పొరేట్ స్కూళ్లు అందుకే పిల్లలకు మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. జీవితంలో బతుకడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే పిల్లలకు మార్కులు రావచ్చునేమో కానీ, భవిష్యత్లో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకునే ధైర్యం మాత్రం రాదు. తల్లిదండ్రు లూ ఒక్కసారి ఆలోచించండి! మార్కుల కన్నా ప్రాణాలే విలువైనవి.
-భద్రిరాజు తటవర్తి
94933 88940