ఈ విద్యా సంవత్సరంలో భాగంగా జూన్ 26 నుంచి జూలై 31 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు పఠనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాల ని తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. విద్యార్థులు ధారాళంగా చదవడం ఒక అలవాటుగా చేసుకోవాలె. చదువుతూ ఆనందం పొందడం, స్వతంత్ర పాఠకులుగా ఎదగడం వంటి ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకురావడం అభినందనీయం.
పఠనం నిత్యకృత్యమైనది. ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో పఠనం వల్ల కలిగే బహుళ ప్రయోజనాల గురించి చర్చ జరగాలి. దినచర్యలో భాగంగా పఠనాన్ని ఒక అలవాటు గా చేసుకొని ఎదిగిన వ్యక్తుల గురించి తెలియ పరచాలి. ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడిగా ఉన్న మైక్రోసాప్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ పఠనానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని చెప్తూ ఏడాదిలో కనీసం 56 పుస్తకాలు చదువుతాడ న్న విషయాన్ని తెలియజేయాలి.
ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్నుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ప్రతిరోజూ 10 గంటలు చదివేవాడట. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయ న మరణించే నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయం దాదర్లోని ఆయన రాజగృహమే. అందులో 50 వేలకు పైగా పుస్తకాలుండేవి. ఇలా అదే కోవకు చెందిన పుస్తక ప్రియులను విద్యార్థులకు పరిచయం చేయాలి.
విద్యార్జనకు తొలిమెట్టు పఠనం. దీంతో విద్యార్థులకు రాయడంలో పట్టు లభిస్తుంది. సంభాషణల్లో చతురత, ఉపన్యసించడంలో నేర్పరితనం అబ్బుతాయి. ప్రపంచంలో గొప్ప గొప్ప వక్తలందరూ గొప్ప పాఠకులే/ చదువరులే. రోజూ పఠనం వల్ల పదసంపద వృద్ధితో పాటుగా జ్ఞాన భాండాగారం నిండుతూ పోతుంది. పఠనంతో మెదడులోని ప్రతి కణం చైతన్యశీలమవుతుంది. కణాల మధ్య సంధానం బలపడటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వివేచన, తార్కికపరమైన ఆలోచనలకు బీజం పడుతుంది. పుస్తక పఠనం అలవాటున్న వారిలో ఊహాశక్తి, సమస్యా-పరిష్కార నైపుణ్యాలు అలవడుతాయి. ప్రత్యేకించి మంచి నవలలు, డిటెక్టివ్ పుస్తకాలు చదువుతున్నప్పుడు పాఠకుడు ఆయా పాత్రల్లో లీనమవుతూ తమను తాము మరిచిపోయే స్థితికి చేరుతాడు. ఆ విధంగా చేసే ప్రతి పనిలోనూ ఏకాగ్రత పెరగడానికి దోహదపడుతుంది. మానవ సంబంధాలు మెరుగవుతాయి. ప్రపంచపు పోకడలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.
మనిషి శరీరంలోని ప్రతిభాగం ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు పదునుపెడుతూ, అది చురుకుగా పనిచేయడానికి పుస్తక పఠనం అంతే అవసరం.
ఈ రోజుల్లో ‘పుస్తక పఠనం’ అనే అలవాటు తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తి గతిశీలకంగానే కాక, సమాజపరంగా, దేశవ్యాప్తంగా ఎంతోనష్టం కలుగుతుంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను, వారి త్యాగాలను, సేవలను, ధ్యేయాల ను తెలుసుకోలేకపోతున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, వారసత్వంపై అవగాహన లేకుండాపోతున్నది. దేశ భక్తి కొరవడుతున్నది. పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పఠనోత్సవం విజయవంతమవడానికి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొ ని విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో ముందుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. పుస్తక పఠనాన్ని విద్యార్థులు ఒక అలవాటుగా చేసుకునేందుకు ప్రతీ రోజు 15 నిముషాల పాటు మహనీయుల జీవిత చరిత్రలను బిగ్గరగా చదవాలి. పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి. ఎక్కడికెళ్లినా వారితో పాటుగా పుస్తకాలను తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. బహుమతులుగా పుస్తకాలని వ్వడం, వాటిని ఒకరితో మరొక రు ఇచ్చిపుచ్చుకునేందుకు ప్రేరేపించాలి.
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి )
-డాక్టర్ శివార్చక విజయకుమార్
70328 75756