నోట్లరద్దు కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విషయంలో ఆర్బీఐ సొంతంగా
ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 8 నవంబర్ 2016న రాత్రి ఆకస్మిక నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సరైనదేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే, ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ నాగరత్న ఆ తీర్పుతో విభేదించారు. కేంద్రం నిర్ణయం చట్టవ్యతిరేకమన్నారు. ఇంతటి కీలకమైన నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరుల మీద ఎటువంటి ప్రభావం పడుతుందో ఆర్బీఐ ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. ఆమె పేర్కొన్న ముఖ్యాంశాలు..
‘ఆర్బీఐ దఖలు పరిచిన రికార్డులను పరిశీలిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కోరుకున్న పదాలు, పదబంధాలు ఆ రికార్డుల్లో ఉన్నాయని నేను గుర్తించాను. ఆర్బీఐ స్వతంత్రంగా ఆలోచించలేదని దీని ద్వారా తెలిసింది. ఇంత సీరియస్ అంశంపై సొంతబుర్ర పెట్టి ఆలోచించటానికి ఆర్బీఐకి సమయం సరిపోలేదా? నవంబరు 7న ఆర్బీఐకి కేంద్రం లేఖ రాసింది (నోట్లరద్దు ప్రకటనకు కేవలం ఒక్క రోజు ముందు). కేంద్రం ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం ఆర్బీఐ తన సిఫార్సును వెలువరించలేదు. ఆ సెక్షన్ ద్వారా సాధ్యం కూడా కాదు. ఎందుకంటే, ఏదైనా కరెన్సీ నోట్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సిరీస్ నోట్లనే రద్దు చేయటానికి ఆర్బీఐకి సెక్షన్ 26(2) ప్రకారం అధికారం ఉంది. కానీ, మొత్తం అన్ని సీరిస్ల నోట్లను రద్దు చేయటానికి లేదు. కేంద్రం కోరుకున్నది కాబట్టి అన్ని సిరీస్ల నోట్లను రద్దు చేయటం అన్నది చాలా సీరియస్ విషయం. ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. దానిని కేవలం ప్రకటన (ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్) ద్వారా కాకుండా.. ఆ మేరకు తగిన చట్టం తీసుకురావాల్సింది. ప్రజాస్వామ్యానికి కేంద్రం పార్లమెంటు. అటువంటి పార్లమెంటును ఇంత కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు సంప్రదించకుండా వదిలివేయరాదు.
నోట్ల రద్దు కారణంగా తలెత్తిన సమస్యలను చూసినప్పుడు.. ఈ నిర్ణయం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఆర్బీఐ సెంట్రల్బోర్డు అసలేమైనా ఊహించిందా? అన్న ఆశ్చర్యం కలుగకమానదు. చెలామణిలో ఇంత భారీ సంఖ్యలో ఉన్న కరెన్సీ నోట్లను ఉన్నపళంగా రద్దు చేస్తే వచ్చే సమస్యలను సెంట్రల్ బోర్డు కనీసం పరిశీలనలోకైనా తీసుకున్నదా? లేదా?. నోట్లరద్దు వెనుక ఉన్న లక్ష్యాలు (ఆర్బీఐ సెంట్రల్బోర్డు పేర్కొన్నవి) సరైనవి, న్యాయమైనవే. కానీ, వాటి సాధన కోసం అనుసరించిన విధానంగానీ, మార్గంగానీ చట్టబద్ధంగా లేదు. రద్దు చేసిన నోట్ల విలువలో దాదాపు 98 శాతానికి సమానమైన నోట్లను ప్రజలు బ్యాంకుల్లో ఇచ్చి చెలామణిలో ఉన్న వేరే నోట్లను తీసుకున్నారు. రూ.2 వేల నోటును ఆర్బీఐ కొత్తగా విడుదల చేసింది. ఈ మొత్తం ఫలితం ద్వారా తేలిందేమిటంటే, ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. నోట్లరద్దు వంటి నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ మీద, దేశ పౌరుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో ఆలోచించి ఆర్బీఐ నిజాయితీగా, స్వతంత్రంగా ఒక అభిప్రాయానికి వస్తుందని ఆశిస్తాం. కానీ, అలా జరుగలేదు.
రూ.500, రూ.1000 నోట్లన్నింటినీ రద్దు చేస్తూ తీసుకున్న చర్య చట్ట విరుద్ధమైనది. కాబట్టి, నోట్లరద్దును ప్రకటిస్తూ విడుదల చేసిన నోటిఫికేన్లోని అంశాలతో కూడిన ఆర్డినెన్స్-2016గానీ, మరుసటి ఏడాది చట్టంగానీ చట్ట వ్యతిరేకమైనవి’.